Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం- 56

3.17.79.60

శ్రీమదాంధ్ర భాగవతం- 56

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు
ప్రవచనం

2. క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగాలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము. 

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ వున్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసో మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా, ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. దీనిన్ ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అడ్డుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ చెవిలో కానీ పెట్టుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అపుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు. కనుక నీవు ఉత్తర క్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇపుడు ఇపుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. అపుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అపుడు బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావారంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. ఇపుడు నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడి ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. 

ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు ‘ఇప్పుడు నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము నిమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు.అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు బ్రహ్మగారు.

ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆతప్పు చేయకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు. 

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయ కాలమునందు మాత్రమే మరల లీనమఎలా వార్ధక్యం రాకుండా ఐశ్వర్యం చెడకుండా అనారోగ్యం రాకుండా నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఈయగాలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. అపుడు మందర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అపుడు అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకొనండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను. 

ఇపుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. అపుడు దేవతలు ‘మేము మందర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మందరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. ఇపుడు మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని డాన్ని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందరపర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు.అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. అపుడు మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మందరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మందరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేతప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మందరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టారు. ఇప్పుడు మందర పర్వతమును పాలసముద్రం లోకి పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. అపుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అపుడు రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేతట్లు చేస్తుంది.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం.

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya