Online Puja Services

మాంసాహారం మానేసిన గ్రామం

3.138.200.66

తమ గ్రామంలో కొలువైన సుబ్బారాయుడు కోసం మాంసాహారం మానేసిన గ్రామం. 
సేకరణ: లక్ష్మి రమణ 

500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన ఇది. అయినా ఆ గ్రామం తమ స్వామిమీద అభిమానాన్ని వదులుకోలేదు. భక్తిని విడువలేదు . ఆచారాన్ని అతిక్రమించలేదు .  అదే   శ్రీ సుబ్రహ్మణ్యుడు , శ్రీ  సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం, పాణ్యం మండలంలోని  సుబ్బరాయుడు కొత్తూరు. సాధారణంగా పుణ్య క్షేత్రాన్ని దర్శించే భక్తులు నియామాల పాలన చేస్తారు . కానీ ఇక్కడ సుబ్బారాయుడు తమని అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా ఒకగ్రామం కొన్ని కట్టుబాట్లని పెట్టుకొని వాటిని ఖచ్చితంగా పాటిస్తోంది . ఈ సుబ్బారాయుడు ఆరోగ్యప్రదాత, సంతానప్రదాత కావడంతో భక్తులు విశేషంగా దర్శిస్తూ ఉంటారు . 

ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ, ఆదివారం వచ్చిందంటే, ఖచ్చితంగా మాంసాహారం తీసుకుంటూ ఉంటాం. కానీ, ఈ పల్లె మాత్రం ఆదివారం మాంసాహారం ముట్టదు . ఆరోజు అంత్యక్రియలు నిర్వహించరు . ఇది ఈ పల్లెలో సుబ్బారాయుడు వెలసినప్పటినుండీ వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా, ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఇదీ .


500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగిలింది.  ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమయ్యింది . ఆ తేజస్సుకు చెన్నారెడ్డి కంటిచూపు కోల్పోయాడు .

అతని కేకలు విన్న చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూశారు . అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడింది . అంతటితో ఆ లీల ఆగలేదు . అక్కడ ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు.  తాను సుబ్బరాయుడినని (సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని అనుగ్రహించాడు . గ్రామీణులు సరేనని , అలాగే చేశారు.  దీంతో చెన్నారెడ్డికి కంటిచూపు తిరిగివచ్చింది . 

ఈ సంఘటన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై ఆ గ్రామస్థుల మదిలో భక్తిని , నమ్మకాన్ని రగిలించింది. దీంతో , ఆయనకీ  గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు . ఆనతినీయమని స్వామివారిని వేడుకున్నారు . తమ గ్రామంలోనే ఉంది కాపాడమని కోరుకున్నారు . అప్పుడాస్వామి , ‘రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి, తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని అనుగ్రహించారు . లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తారు . 

ఆ విధంగా స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు గ్రామస్థులు . కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. ఆ సుబ్బారాయుడికి అదే ఇష్టమేమో మరి !  అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా, స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. 

ఇక ఆదివారం మాంసం ముట్టకపోవడానికి కారణం ఇదీ ! 

సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 

తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా, గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే, సోమవారానికి వాయిదా పడుతుంది.

ఆ మూడు మాసాల్లోనూ నియమపాలన వర్తిస్తుంది ! 

ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

అంత్యక్రియలకూ సెలవే మరి ! 

కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

ఇలా చేరుకోవచ్చు:

బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో ఉంది .ఇక్కడ నుండి ఆటో సదుపాయం ఉంటుంది .

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore