Online Puja Services

చండీశ్వరుని కధ

18.226.251.22

చండీశ్వరుని కధ         
➖➖➖
చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివే వాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. 

గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తుండగా గమనించాడు.
అది చూసిన అతని మనసులో బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.

బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.

ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి 
ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. 

ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేద్దామనుకున్నాడు.

 *రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకము నందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.

ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు ‘అయ్యో.. ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయం వినగానే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది.. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచి పెట్టాడు.ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.

ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచి పెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించి పోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.

అతడు చెప్పింది నిజమే ‘వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు’
 అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.

తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. క్రింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు.‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు. 

నెత్తురుకారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. “నాయనా.. ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.”

“మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా, వరంకోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది-అది పత్నీభాగం.” అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు.

”పార్వతీ..నేను ఈవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచి పెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు వేరొకరు తినరాదు!” అన్నాడు. 

ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.

ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని కూడా మరో పేరు.
మనలో చాలా మంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్లి పోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం. ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు. చిటిక వేస్తే ధ్యానము నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.

”ఓహో మా స్వామిని ఆరాధించావా !
ప్రసాదం తీసుకున్నావా !! సరే. తీసుకు వెళ్ళు.” అంటాడు.

ఆయనకు చూపించిన తర్వాత 
ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము దానిని మీరు గుడి యందు విడిచి పెట్టి వెళ్ళిపోతే 
మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. 
చండీశ్వర స్థానము నందు తప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.

అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు చండీశ్వరుడు ఉంటాడు.  ఉత్సవ మూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు. 
ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు.
   
లోకా సమస్తా సుఖినోభవన్తు!

- సిరివెళ్ల నాగరాజ స్వామి 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi