Online Puja Services

రాహు కేతువులు-ఆత్మవిద్య హేతువులు ఎలా అవుతారు ?

3.144.151.106

రాహు కేతువులు-ఆత్మవిద్య హేతువులు ఎలా అవుతారు ? 
-జ్యోతిష్యవేత్త ప్రకాష్ గారి వివరణ . 

రాహుకేతువులు అనగానే రాక్షసులు, నల్లని సర్ప స్వరూపాలు గుర్తొస్తారు . దానికి తోడు జాతకంలో తలెత్తే గ్రహదోషాలు కూడా జ్ఞప్తికి వస్తాయి. రాక్షస గ్రహాలైన రాహు కేతువులు - ఆత్మా విద్యా హేతువులు ఎలా అవుతారు?  అసలు రాహువూ , కేతువూ గ్రహాలంటే, అవెక్కడున్నాయి ? చూపించమంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం .  నీడలు గ్రహాలు ఎలా అవుతాయో చెప్పమంటుంది. వీటికి సమాధానం … కాదు సమాధాన పడే సమాధానం కోసం వెతుకుతూ, గూగుల్ తల్లిని వేధిస్తుంటే, చక్కని వివరణ నాకు ప్రకాష్ గారి రచనగా కనిపించింది . ఆయనకీ కృతజ్ఞతలతో .. ఈ వివరణనని హితోక్తి పాఠకులకు అందిస్తున్నాం . 

ఆధునిక విఙ్ఞానం రాహు కేతువులను ఒప్పుకోదు, ఇవి గ్రహాలు కావు, గ్రహణం రోజున రాహువు మింగటం, కేతువు మింగటం ఇలాంటివి హాస్యాస్పదం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.మంచిదే!ఇవి గ్రహాలు అని శాస్త్రం కూడా చెప్పటం లేదు.జ్యోతిషం రవిని, చంద్రుని గ్రహాలుగా చెప్పటం ఏమిటి? రవి నక్షత్రం కదా, చంద్రుడు ఉపగ్రహం కదా అని అడిగే వాళ్లు ఉన్నారు. గ్రహించేది గ్రహం. ఇది ప్లానెట్, ఇది సేటలైట్ అనే విభజన వేరు. మహర్షులు మానవ జీవితం మీద ఏదైతే ప్రభావం చూపుతున్నదో అది గ్రహం అని గుర్తించారు. మనిషి కూడా గ్రహమే! వీడికీ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్నాయి.భూమి మీద ఏ పరిమాణంలో నీరు, గట్టి పదార్థాలూ ఉన్నాయో, మానవ శరీరంలో కూడా అదే పరిమాణంలో నీటికి సంబంధించిన పదార్థాలు, గట్టి పదార్థాలూ ఉన్నాయి. నదులు కొండలలోని రాళ్లలోంచి పుడుతున్నాయి. రక్తం బోన్ మేరో నుంచి పుడుతున్నది.ఒక కుమ్మరి వాడు కుండను తయారు చేసేటప్పుడు క్రిందనున్న మట్టి తిరిగి తిరిగి స్పందించి అందులోంచి కుండ పై భాగం అలా తయారవుతూ ఉంటుంది. అలాగే భూమి దక్షిన ధృవం స్పందించి, స్పందించి ఈ ఆకారానికి వచ్చింది. ఉత్తర ధృవం అందుచేత కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. భూమి ఎందుకు ఆగదు? ఆగితే ఒక వైపుకు పడిపోతుందా? అంటే ఒరిగిపోకూడదని బొంగరం లా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా? నిజమే! స్పందన వలన శక్తి, శక్తి నుంచి తిరిగి స్పందన…ఇదే సృష్టి యావత్తులోనూ ఉన్న రహస్యం.

ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రం యొక్క మరో పేరు ఆత్మ విద్య. జ్యోతి-స్థూలంగా చెప్పాలంటే లైట్, సూక్ష్మంగా చెప్పాలంటే ఙ్ఞాన జ్యోతి. దీనిని దర్శించే వాడు జ్యోతిష్కుడు! జ్యోతిషం కేవలం భవిష్యవాణి కాదు. కాలక్రమంలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందటం వలన జ్యోతిష్కుడు అనగానే కాల్ళూ చేతులూ చూసే వాడు అనుకుంటారు. కాదు. ఇది ఒక వైఙ్ఞానికపరమైన, తాత్వికపరమైన, ఉపాసన పరమైన సంక్లిష్టమైన శాస్త్రం. సృష్టికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంటుంది.కాలము, జ్యోతి (వెలుగు) ఈఓ రెండిటి యొక్క ప్రభావం ప్రాణ శక్తి మీదా, మనిషి జీవితం మీదా ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

చీకటి వెలుగులు జీవితం లోని భాగాలే కావు. సృష్టి ఆద్యంతం వెంట ఉండే విషయాలు. వీటి మధ్య ఎన్నో ప్రక్రియలు, ఎన్నో యుగాలు. ఒకటి లేకుండా మరొక దానిని అధ్యయనం చేయటం కుదరదు. ఆ చీకటి గృహాలె ఈ రాహు కేతువులనబడే అప్రకాశ గ్రహాలు.ఒక గ్రహణం సంభవించినప్పుడు మూడు వరుసలోకి రావటం మనం చూస్తాం. గణిత శాస్త్రం ప్రకారం రెండు వస్తువుల మధ్య అతి తక్కువ దూరం ఒక తిన్ననైన గీత! అంటే ఒక గ్రహణం సంభవించినప్పుడు ఈ మూడు-సూర్యుడు, చంద్రుడు, భూమి అతి తక్కువ దూరం లోకి వస్తాయి.అప్పుడు పరస్పరం శక్తులను ఇచ్చి పుచ్చుకుంటాయి. దీనినే సినర్జీ అంటారు. ఈ సమయంలో వీటి మధ్యనున్న నీడ ఈ ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియకు మార్గం అవటం వలన ఒక ఛార్జ్ లా ఆ గ్రహణ సమయంలో పని చేస్తుంది. దీనినే మహర్షులు రాహువు లేదా కేతువు అని చెప్పి దాని తాలూకు స్పందన-మంత్రాన్ని దర్శించి మనలో జరిగే స్పందనకు అనుగుణంగా జపించి యున్నారు. ఈ రోజు భాషలో దీనిని మనం మోడరేషన్ అంటాము! 1980-81 లో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయం లో రైలు వస్తున్నప్పటికీ చిన్న పిట్టలు పట్టాల మీద నుంచి కదలలేదు!…

గోచారంలో మరి గ్రహణం అని చెప్పిన రోజున ఆ రాశిలో రాహువో కేతువో ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. అంటే అసలు గ్రహణ నిర్ణయం మహర్షులు అంత సూటిగా ఎలా చెప్పారూ అంటే రాహు కేతువుల స్థానం బట్టి, వాటి సంచారాన్ని బట్టి, సూర్య చంద్రుల సంచారాన్ని బట్టి అని అర్థం!

రాహు, కేతువులు

విఙ్ఞానం మనకి బిగ్ బాంగ్ అని చెబుతుంది. ఈ అంతరిక్షం యావత్తూ ఒక విస్ఫోటనంతో ఏర్పడినదని ఒక అంచనా.మంచిదే! శాస్త్రం ఏమంటోందంటే నవగ్రహ కూటమి ఒక వృత్తాకారంలో జడత్వంతో ఉన్న సమయంలో ప్రకాశం ఒక దిశగా పయనిస్తూ ఈ కూటమిని తాకి ఆ వేగంలో వృత్తానికి అవతల ప్రక్కకు వెళ్లిపోయింది. ఆ తేజస్సుకు ఈ గ్రహాలన్నీ చేతనత్వాన్ని పొందాయి. స్పందిచటం ప్రారంభించాయి. ఆకారంలో పెరగటం మొదలు పెట్టాయి. ఒక నిర్దిష్టమైన వృత్తంలో తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి కాబట్టి వృత్తం ఏర్పడినది. కూటమికి ప్రకాశం ముందు తగిలిన చోట సర్పం ఆకారంలో కనిపించిన నీడను రాహువు అని, వృత్తం అటు వైపు-180 డిగ్రీల లో కనిపించిన అవతలి నీడను శిఖి (కేతువు) అని చెప్పారు. ఈ నీడలు రెండూ అపసవ్యంగా తిరిగాయి. కారణం ఏమిటంటే ఇవి గ్రహాలన్నిటి నీడలు కలబోసుకుని వాటికి భిన్నంగా కదులుతాయి. వీటి మధ్యన ఉన్న గ్రహాలన్నీ ఒక చక్రంలో బంధింపబడ్డాయి-అదే రాశి చక్రం. ‘ రాహువు ‘లోని మొదటి అక్షరం-రా, ‘ శిఖి ‘లోని మొదటి అక్షరం ‘ శి ‘ తీసుకుని రాశి చక్రం అన్నారు!

అంటే రాశి చక్రం అనేది కెవలం మన జన్మ కుండలి కాదు.ఇది సృష్టి యావత్తునూ ప్రదర్శించే 360 డిగ్రీల కుండలి! ఇదే సిమెట్రీ! ఒక వృత్తం ఎంత పెద్దదైనా కావచ్చును. దాని కేంద్రం ఒకటే! అది కూడా వృత్తమే! సృష్టిలోని అతి పెద్దది-అనంతం, అతి చిన్నది కూడా అనంతమే! మరి గణితం కూడా అదే చెబుతుంది. 1/10=10/100=100/1000… ఇలా నేను ఒకటి ప్రక్కన న్యూమరేటర్ లో అనంతమైన సున్నలకు ఒకటి తక్కువగా పెట్టి డినోమినేటర్ లో ఒకటి ప్రక్కన అనంతమైన సున్నాలు పెట్టినా ఆ ఫలం 1/10 మాత్రమే! అదే తమాషా! అటు అనంతం, ఇటు మనం. అది ఇందులో ఉంది-అణువులాగా! రాహు కేతువులు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి. 

ప్రస్తుతం మామూలుగా జ్యోతిష సాస్త్రం జాతకంలో వీరి పరిస్థితిని ఎలా వివరిస్తుందో చూద్దాం. దానికి ముందు ఈ ఇద్దరి గురించీ విపులంగా ఎక్కడ చెప్పారో పరిశీలిద్దాం. బృహత్ జాతకంలో రాహువును తమస్ అని, అగు అని, అసుర అని పేర్కొన్నారు. కేతువును శిఖి అని చెప్పారు. పరాశరుడు, యాఙ్ఞ్యవల్క్యుడు రాహు కేతువులను ఏడు గ్రహాలతో పాటుగా ప్రధానంగా పేర్కొన్నారు. వీరి ఉత్పత్తి, ప్రభావం,ఇలాంటివి మత్స్య పురాణంలో కూడా చెప్పి యున్నారు.రాహువును నల్ల రంగులో, రౌద్రాకారంలో,కత్తి ధరించి సింహారూఢుడై యున్నట్లు వర్ణించారు.కేతువు గద పట్టుకున్నట్లు,గృధ్ర వాహనునిగా వర్ణించారు.

శాస్త్రం రాహువుకు అధిదేవత దుర్గ యని, ప్రత్యధిదేవత నాగదేవతయని, కెతువుకు అధిదేవత చిత్రగుప్తుడని, ప్రత్యధిదేవత బ్రహ్మ యని చెబుతున్నది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతువు మహర్దశ 7 సంవత్సరాలని మనకు తెలిసినదే!

రాశి చక్రంలో రాహు కేతువుల గీత చాలా ప్రధానమైనది. వీరు 18 మాసములు అయిన తరువాత అపసవ్య మార్గంలో రాశులు మారుతారు. గోచారంలో గురు, శని తరువాత ప్రధానంగా గణించ వలసిన గ్రహాలు రాహు కేతువులు. రాహు కేతువులు ఏయే స్థానాలలో ఎటువంటి ఫలితాలనిస్తారనేది పరిశీలిద్దాం. ఒకరి జాతకంలో-రాశి చక్రంలో లగ్నాత్ రాహువు:

మొదటి స్థానం(లగ్నం లో)లో ఉంటే ధైర్యవంతులు,సహాయం చేయు వారు,కానీ కొద్దిగా ముఖం మీద మచ్చలు ఉండు వారు ఉంటారు. రెండులో ఉంటే ఎక్కువగా విందులు చేయు వారు,నల్లని వారుగానూ,వివాహేతర సంబంధాలు కోరు వారు కనిపిస్తూ ఉంటారు. మూడులో ధనవంతులు,మంచి క్రీడాకారులు, సాహసాలు చేయు వారు అవుతారు. నాలుగులో ఉన్నప్పుడు బహు భాషా కోవిదులు, అయిదులో ఉన్నప్పుడు క్రూర స్వభావం గల వారు, గర్భం విషయంలో సమస్యలు ఎదుర్కొనటం, ఆరులో ఉన్నప్పుడు పెద్ద బంధు వర్గం కల వారు,శత్రు రహితులు గానూ,ఏడులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఆరోగ్య భంగం,చక్కెర జబ్బు,మంచి భొజనం కలుగ చేస్తాడు. ఎనిమిదిలో సంకుచితమైన ఆలోచనలు,పోట్లాటలంటే ఇష్ట పడే వ్యక్తిత్వం,తొమ్మిదిలో భయపడే వ్యక్తిత్వం, పదిలో ఉన్నప్పుడు మంచి కళాకారులు,యాత్రికుదు,రచయితలు తయారవుతారు.పదకొండులో ధనవంతులు,సంఘంలో గౌరవం కల వారు,మంచి సంతానం కల వారు,వ్యవసాయదారులు ముందుకు వస్తారు. పన్నెండులో ఉన్నప్పుడు తాత్విక పరులు,కళ్ల జబ్బులు ఉన్నవారు ముందుకు వస్తారు.

కేతువు లగ్నంలో ఉంటే ఎక్కువగా చెమట పూయటం,మంచి ప్రజా సంబంధాలు ఉందటం, రెండులో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవటం, శాంత స్వభావం,మూడులో శక్తిమంతులు,పేరు గలవారు, నాలుగులో గొడవలు పెట్టుకునే వారు,అయిదులో పిల్లలకు ఇబ్బందులు కలుగచేయటం,ఆరులో మాటకారితనం,ఏడులో భాగస్వామికి సమస్యలు,ఎనిమిదిలో నిదానం, తొమ్మిదిలో చత్వారం, మంచి జీవిత భాగస్వామి,పదిలో తాత్విక చింతన,పదకొండులో మంచి హాస్యం,ధనం, పన్నెండులో విదేశ యానం ఇలాంటివి కనిపిస్తాయి. సామాన్యంగా రాహు కేతువులు అప్రకాస గ్రహాలు కాబట్టి ఏ రాశిలో ఉంటాయో, ఆ రాశి యొక్క అధిపతి ఇచ్చు ఫలితాలని ఇస్తాయి.

ఇక్కడ చెప్పిన ఫలితాలు నామ మాత్రానివే. ఒక జాతకంలో అన్ని విషయాలనూ, గ్రహాలనూ పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రాకూడదు!

రాహు కేతువులు-ఆరోగ్యం:

రాహువు దుర్ఘటనలను, ప్రయాణాలలో సమస్యలను, దుష్ట ప్రయోగాలను శాసిస్తాడు. సరీరంలోని కాళ్ల విషయంలో రాహు కెతువులు చాలా సక్రియంగా ఉంటారు.ఆరోగ్యం విషయంలో వీరిరువురు ఎవరితో కలసినా ఇబందే! ఆ గ్రహం , భావం లేదా రాశి పీడితమైనదని తెలుసుకోవాలి.కేతువు సామాన్యంగా స్త్రీల విషయంలో మాసిక సమస్యలను చంద్రునితో కలసి అంద చేస్తాడు. లగ్నాత్ అయిదులోనూ, ఏడులోనూ ఉంటే శరీరంలో ఏవో లంప్స్, ట్యూమర్లు ఇలాంటివి కనపడ వచ్చును. ఎనిమిదిలో చర్మ వ్యాధులు ఉందవచ్చును. రాహువు విష ప్రయోగాన్నీ, అర్థం కాని అనారోగ్యాన్నీ సృష్టిస్తాడు.కెతువు పుండ్లను శాసిస్తాడు. రాగువు కేతు నక్షత్రంలో (అస్విని, మఖ, మూల) ఉంటే దారుణమైన ఏక్సిడెంట్లను ఇస్తాడు. ఆ దశలో జాగ్రత్త వహించాలి. రాహువు ఆర్ద్ర 3, 4 పాదాలలో ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నాల్గవ పాదంలో ఉంటే చెడు అలవాట్లకు లోనవుతారు.అలాగే స్వాతి మొదటి, నాలుగు పాదాలలో రాహువు ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాహువు శతభిషం రెందవ పాదంలో ఉంటే కోపిష్ఠి, మూడవ పాదంలో ఉంటే కాలేయ సమస్యలున్నవారు ఉంటారు.కేతువు అస్విని మూడవ పాదంలో ఉంటే ఆరోగ్యం విషయం లో జాగ్రత్త వహించాలి.అలాగే మఖ 1,2,3 పాదాలలో ఉన్నా అనారోగ్యం,మూల 1,2 లో ఉన్నా జాగ్రత్త వహించాలి. రాహు కేతువులు ఎవరి దశలో ప్రవేశించినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి దశలలో ముఖ్యంగా గుండె విషయంలొనూ, విష జ్వరాల విషయంలొనూ జాగ్రత్త వహించాలి.

లాభాలు

రాహువు మంచి కూడా చెస్తాడు. రాహువు మంచి స్థానంలో ఉండి గురువు చేత 5 లేదా 9 దృష్టి కలిగి యున్నప్పుడు రాజయోగం, సంఘంలో గౌరవం ఇస్తాడు. పన్నెండులో ఉన్నప్పుదు చక్కని తెలివి తేటలిస్తాడు. కేతువు ఆరులో ఉన్నప్పుడు కీర్తి, జ్యోతిష శాస్త్రం, జరిగేది తెలియటం ఇలాంటివి ఇస్తాడు. అలాగే రెండులో ఉన్నప్పుదు మార్కెట్ వలన లాభాలూ, పదకొండులో ఉన్నప్పుడు లాటరీలు ఇస్తాడు. కేతువు తాత్వికమైన గ్రహం. సంప్రదాయ బధ్ధమైన ఉపాసన ఇస్తాడు కేతువు.

కాలసర్ప దోషం:

కాలసర్ప దోషం అనేది నిజానికి ఒక యోగం. నూటికి 70 మందికి ఇది ఉంటుంది. దీని వలన భయం ఏమీ లేదు.రాహు కేతువుల ఏక్సిస్ లోపల అటు కానీ ఇటు  కానీ లగ్నంలో  , చంద్రునితో పాటు అన్ని గ్రహాలూ ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ నీడలోకి చేరాయి కాబట్టి వాటి శక్తి బయటకు రాదని కాలసర్పదోషం అని నిర్ణయిస్తారు. శ్రీకాళహస్తిలో నివారణ చేయించుకుంటే ఇది యోగంగా మారుతుందని ప్రతీతి.

కొందరు మిత్రులు లగ్నం లెదా చంద్రుడు బయట ఉన్నప్పుడు ఈ దోషం ఉంటుందా అని అడిగారు. వివాహం విషయంలో దీనిని కూడా పరిగణించటం మంచిదని శాస్త్రం చెబుతున్నది. కారణం ఏమిటంటే యోగాలు చంద్రుని బట్టి ఎక్కువ గణన లోకి వస్తాయి కాబట్టీ, మరల గోచారం చంద్రుని నుంచి నిర్ణయిస్తాము కాబట్టీ నివారణ చేయటం అవసరం అవుతుంది.కొన్ని గ్రంథాలలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒక్కో స్థానాన్ని గణించి డిగ్రీలు కూడా లెక్క లోకి తీసుకుని ఆ స్థానం ఫలించనప్పుడు రాహు కెతువుల మధ్య వచ్చాయా అనే సంగతి కూడా చూడటం జరుగుతున్నది. అంత అవసరం లేకపోయినా ఇంత చాలు. తమిళ నాడులో ఒక ఆచారం ఉంది. దోషం ఉన్నా, లెకపోయినా వివాహ వయసు వచ్చిన కన్యలందరికీ నివారణ చేయిస్తారు…

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి లోని ఈశ్వరుడు నవగ్రహ కవచ ధారి! ఆయనకు ఎదురుగా సూర్యుడు ఉంటాడు. శివాలయంలో ఇది అరుదు! శివుడు ఇక్కడ భక్తుల గ్రహ దోషాలన్నీ సూర్యుని సాక్షిగా హరించి వేస్తాడు! అలాగే ఈ కాలసర్ప దోషాన్ని నివారించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరొక విశేషం ఉంది . అమ్మవారు శ్రీ ఙ్ఞాన ప్రసూనాంబ ఎదురుగా ఉన్న ప్రాకారంలో నేల మీద ఒక పద్మం ఉంటుంది. దీని మీద నిలబడి చూరు పైకి చూస్తే రాహువు యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని చూస్తూ ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అలా చేస్తూ పేరు, నక్షత్రం, గోత్రం మన్సులో చెప్పుకుని అమ్మవారిని రాహువు నుంచి కాపాడమని కోరాలి. చాలు! ఈ జన్మకు మనలను రాహువు బాధించడు.

రాహువు దుర్గా ఉపాసన ఉన్న వారిని బాధించడు. దృష్టి దోషం సామాన్యంగా రాహువు డిపార్ట్మెంట్! దుర్గా సప్తశ్లోకీ, ఖడ్గమాలా స్తోత్రం, చండీ ధ్వజ స్తోత్రం చదువుకునె వారికి రాహువు బాధలు ఉందవు. సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్నవారికి, నాగ పూజ ఉన్నవారికీ, ఇంటిలో నాగ పడిగ ౠపు మీద పాలతో అభిషేకం చేయు వారికీ, కేతువు వలన ఇబ్బందులు ఉండవు. 

దశలో కానీ, గోచారంలో కానీ రాహువు సమస్య ఉన్న వారు 1800 గ్రాములు నల్ల మినుములు శివాలయంలో దానమిచ్చిన మంచి ఫలితాలను పొందగలరు.

రాహువు సంఖ్య 18. ఒకప్పుడు అయ్యప్ప యాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమయ్యేదని చెబుతారు. అయ్యప్ప గుడి మెట్లు 18.దీక్షలో రాహువు రంగు నలుపు వస్త్రాలు ధరిస్తారు. మహాభారత రణరంగం 18 రోజులు… సంఖ్యా శాస్త్రంలో 18 అంకె-రవి(1), 8(శని) కలసిన సంఖ్య ఇది.అనగా సూర్యోదయం-వెలుగు,పడమర దిక్కు, రిసైక్లింగ్ చేసే శనికి కలిగే సంయోగం ఇది.

 ఆది, అంతం కలసిన ఏమిటి? యుధ్ధం.

ఇదే వెలుగు నీడల యుధ్ధం.రాశి చక్రంలోని వెలుగు నీడల పర్యంతం మన జీవితం అలా సాగిపోతుంది.రాహువు నీడను-మృత్యువును గుర్తు చేస్తూనే ఉంటాడు. అటు చివర కేతువు ఉపాసన మార్గం ద్వారా మోహాన్ని జయించి అమృత తత్వాన్ని తెచ్చుకో మంటాడు.

రాహు కేతువులు ఇద్దరూ ఒక శరీరమే.పురాణం మనకు చెబుతుంది.ఒకరు తల భాగం, ఒకరు అధో భాగం. ఈ రెండిటినీ అధిగమించే సారమే అమృతం.అదే ‘తమసోమా జ్యోతిర్గమయ!’ అనే ప్రార్థన, వేదం లోని మహావాక్యం. అదే జ్యోతిషం!

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda