Online Puja Services

ఓం నమః శ్శివాయ 
కార్తీక పురాణము , ఎనిమిదవ అధ్యాయము - ఎనిమిదో రోజు  పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ 

వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను . దీనివల్ల ధర్మము చాలా సూక్ష్మమైనదని ,  పుణ్యము సులభముగా సంపాదించుకోవచ్చని తెలుసుకున్నాను . కేవలం  నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు . ఇటివంటి  స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభిస్తుండగా , వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని, పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెబుతూంటారు గదా! మరి తమరు ఈ వ్రత విధానాన్ని సూక్ష్మములో మోక్షముగా విశదపరచడం, నాకు అమితాశ్చర్యమును కలుగజేస్తుంది .

దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులైన మహాపాపములు చేసినవారు ఇంత తేలికగా మోక్షమును పొందడం  వజ్రపు కొండను గోటితో పెకలించడం వంటిదే కదా ! కాబట్టి దీనిలో దాగిఉన్న  మర్మమును విడమర్చి, విపులంగా చెప్పాల్సిందిగా మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను “ అని కోరారు .

అప్పుడా వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే,నేను వేదవేదాంగములను కూడా పఠించాను . వాటిల్లో  కూడా సూక్ష్మమార్గాలున్నాయి . వీటిల్లో సాత్త్విక, రాజస, తామసములు అని ధర్మము మూడురకములు.

సాత్త్విక ధర్మమం  అంటే -  దేశ, కాల పాత్రలు మూడూ సమకూడిన సమయములో  ‘సత్త్వ’మనే  గుణము జనించి, ఫలమంతా కూడా పరమేశ్వరార్పితము చేసి , మనోవాక్కాయ కర్మలచే నిర్వర్తించిన ధర్మము. ఇటువంటి  ధర్మము ఎంతో ఉన్నతమైనది.  సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనం చేసి, వ్యక్తులని పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చగలిగినది .

ఏవిధంగా అయితే, తామ్రపర్ణినది సముద్రములో సంగమించే స్థలాలలో, స్వాతికార్తెల కాలంలో , ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి, ధగధగ మెరిసి, విశేషమైన రత్నమైన ముత్యముగా మారుతుందో , అదేవిధంగా - సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరిస్తూ  గంగ,యమున,గోదావరి కృష్ణనదులలో  పుష్కరాలు మొదలైన పుణ్యకాలములలో  స్నానమాచరించి, దేవాలయములలో వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసినా , లేక ఆ నదీతీరములోని దేవాలయంలో జపతపాదులు చేసినా విశేషఫలమును పొందగలరు.

అర్థమైనది కదా ! ఇక రాజసాధర్మాన్ని గురించి వివరిస్తాను  - ఫలాపేక్ష కలిగి, శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించేదిగా ఉంటుంది .

ఇక తామస ధర్మము  - శాస్త్రోక్త విధులను విడిచి దేశ కాల పాత్రలు సమకూడని సమయములో డాంబికాచరణార్ధం చేసే ధర్మం. ఇటువంటి ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసినా అది గొప్ప ఫలము నివ్వగలదు . ఉదాహరణకి  పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమైన చందాన  శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని,తెలియకగాని ఉచ్ఛరించినట్లయితే  వారి సకల పాపములు పోయి ముక్తిని పొందగలరు . దానిని తెలిపే  యితిహాసముని వివరిస్తాను . అంటూ ఆ కథని జనక మహారాజుకి ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠమహర్షి . 
 

అజామీళుని కథ

          పూర్వకాలములో కన్యాకుబ్జమనే నగరములో నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. సకల సద్గుణరాశి అయిన హేమవతి ఆయన భార్య . ఆ దంపతులు అన్యోన్యమైన  ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు . వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు .

వారాబాబుని అతి గారాబముగా పెంచుతూ , ‘అజామీళుడని’ నామకరణము చేశారు .ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ, అతిగారాబము వలన పెద్దలను పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, దుష్టసావాసములు పట్టి , విద్యాభ్యాసము విడిచి , బ్రాహ్మణధర్మములు పాటించక తిరుగుతుండేవాడు .

           ఈ విధముగా నుండగా, కొంతకాలమునకు యవ్వనము ఉదయించగా , మరింత చెలరేగి  కామాంధుడై, మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి, మద్యం సేవిస్తూ , ఒక ఎరుకలజాతికి చెందిన స్త్రీని వలచి, నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుతూ , యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే గడుపుతూ తింటూ ఉండేవాడు .  

అతి గారాబము ఏవిధంగా పరిణమించినదో విన్నావా  రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా, దానిని ప్రదర్శించకుండా , చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో ఉంచకపోతే, యీ విధంగానే జరుగుతుంది .ఆ విధంగా , అజామీళుడు కులభ్రష్టుడు  కాగా, అతణ్ణి వానిబంధువులు విడిచిపెట్టారు.

          దాంతో అజామీళుడు మరింత రెచ్చిపోయి, వేటాడి పక్షులను,జంతువులను చంపుతూ, కిరాతవృత్తి చేపట్టి జీవించసాగాడు . ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కొస్తుండగా, ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోతూ కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి చేరాడు .

ఆ స్త్రీని అజామిళుడు చేపట్టే ముందే, ఆమెకి ఒక కుమార్తె ఉంది . కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా, కామాంధకారముచేత కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి, ఆమెతో కూడి కాపురము చేయసాగాడు . వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగారు .కానీ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు . ఆమె మళ్ళీ గర్భము ధరించి ఒక కుమారుని ప్రసవించింది .

వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుస్తూ ,  ఒక్కక్షణమైన ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్ళేవారు.  "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకేవారు . కాని "నారాయణ" యని స్మరించినంత మాత్రాన  తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననే జ్ఞానం మాత్రము అతనికి  తెలియకపోయింది .

 ఇలా కొంతకాలము జరిగిన తర్వాత, అజామీళునకు శరీరపటుత్వము తగ్గి, రోగగ్రస్తుడై మంచముపట్టి అవసానకాలంలో ఉన్నాడు .చివరి క్షణాలు ఆసన్నమవడంతో ,  భయంకరాకారములతో, పాశాది ఆయుధములు ధరించి యమభటులు అతనిముందు ప్రత్యక్షమయ్యారు . వారిని చూచి అజమీళుడు భయపడి, కుమారునిపై ఉన్న వాత్సల్యము వల్ల "నారాయణా, నారాయణా” ని పలవరిస్తూ , ప్రాణాలు విడిచాడు .   

అజామీళుని నోట "నారాయణా" అనే శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగారు . అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కడికి  వచ్చి "ఓ యమభటులారా! ఇతను మావాడు. మేము ఇతణ్ణి  వైకుంఠమునకు తీసుకు పోయేందుకు వచ్చాము " అని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకుపోయే ప్రయత్నం చేశారు . అప్పుడా  యమదూతలు "అయ్యా! మీకు సరైన సమాచారమున్నదా ? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోయెందుకు  మేమిక్కడికి వచ్చాము . కాబట్టి వీనిని మాకు వదలండి “ అని కోరారు . అప్పుడు విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు. 

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి,  ఎనిమిదవ అధ్యాయము, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !

స్వస్తి !!

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya