Online Puja Services

ఓం నమః శ్శివాయ 
కార్తీకపురాణము - నాలుగో యధ్యాయము,నాల్గవ రోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ 

వశిష్ఠమహర్షి  కార్తీకమాసవ్రత మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తి పొందగలరని చెబుతుండగా , జనకుడు 'మాహాతపస్వీ! తమరు వివరిస్తున్న ఈ ఇతిహాసాలని విన్న కొద్దీ ఇంకా వినాలనే కోరిక కలుగుతోంది .  కార్తీకమాసములో ముఖ్యముగా చేయవలసినవి ఏమిటి ? ఏ దేవతని ఉద్దేశించి పూజ చేయాలో వివరించండి” అని కోరాడు . అప్పుడు  వశిష్ఠులవారు ఇలా చెప్పసాగారు .

జనకా! కార్తీక మాసములో సర్వసత్కార్యములు చేయవచ్చు. దీపారాధన వీటిల్లో  అతి ముఖ్యమైనది . దీనివలన అత్యధికమైన ఫలితాన్ని పొందవచ్చు . శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయములోగాని విష్ణ్యాలయములోగాని ఈ దీపారాధనము చేయవచ్చు.

సూర్యాస్తమయ సమయంలో, అంటే, చీకట్లు ముసురుకుంటున్న సంధ్యా సమయంలో  శివకేశవుల సన్నిధిని గాని, ఆలయ ప్రాకారములోగాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని పొందగలరు .

కార్తీక మాసములో హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరినూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్పనూనెతో గాని, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించాలి .

దీపారాధన ఏ నూనెతో చేసినా కూడా వారు అధిక పుణ్యాన్ని పొంది , భక్తితత్పరులుగా మారడమే కాకుండా ,అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధిని పొందగలరు. దీనిని తెలిపేకథనే ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను .  శ్రద్ధగా విను. అని ఇలా చెప్పనారంభించారు. 

శతృజిత్కథ:

          పూర్వము పాంచాలదేశమును పరిపాలిస్తున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేశాడు.  అయినా ఫలితం లేకపోవడంతో, గోదావరీ తీరము చేరి  నిష్ఠతో తపస్సు చేయసాగాడు. అప్పుడక్కడికి పిప్పలాదుడనే  మునిపుంగవుడు వచ్చి, "పాంచాల రాజా! నీవెందుకింత ఘోర తపస్సు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి ? అని ప్రశ్నించాడు .  అప్పుడా రాజు "ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదా ఉన్నాయి . కానీ  నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున చేస్తున్నాను " అని వివరించాడు .

        అప్పుడా  మునిపుంగవుడు "ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిలో  శివదేవుని ప్రీతికోసం దీపారాధనము చేస్తే , నీ కోరిక నెరవేరుతుంది” . అని చెప్పి వెళ్ళిపోయాడు . 

వెంటనే ఆ పాంచాలరాజు తన దేశానికి వెళ్లి , పుత్ర ప్రాప్తిని కోరుతూ కార్తీకమాసం నెలరోజులూ దీపారాధనలు చేయించి , దాన ధర్మాదులతో నియామానుసారంగా వ్రతాన్ని చేసి, ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచిపెడుతూ కార్తీకమాసమంతా దీక్షని కొనసాగించాడు .  

 ఆ పుణ్యము వలన ఆ రాజుగారి భార్య గర్భవతియై,  క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక  శుభముహూర్తములో చక్కని పుత్రునికి జన్మనిచ్చింది . రాజకుటుంబీకులు సంతోషించి తమ దేశమంతట పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములుచేసి, ఆ బాలుడికి  'శత్రుజి' యని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నారు . 

కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతట ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని ఆ రాజు శాశించాడు .

 రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడవుతూ ,  సకలశాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలలోనూ నైపుణ్యాన్ని పొందాడు . కానీ యవ్వనం , దుష్టుల సహవాసము, తల్లిదండ్రుల గారాబము అతనిని పెడద్రోవలో నడిపించాయి .  కంటికి నచ్చిన స్త్రీలని బలాత్కరిస్తూ , యెదిరించిన వారిని దండిస్తూ  తన వాంఛలు తీర్చుకుంటూ , క్షణికసుఖాలకోసం ప్రజలని పీడించసాగాడు . 

తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుడవడం చేత, చూసీ చూడనట్టు వ్యవహరించసాగారు . దాంతో శతృజి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది .  విసృంఖలంగా ప్రవర్తిస్తూ,  తనకడ్డు చెప్పేవారిని నరికేస్తానని కత్తితిప్పి బెదిరిస్తూ  ప్రజలను భయకంపితులను చేయసాగాడు .
  ఇదిలా ఉండగా , ఒకరోజు చక్కని చుక్కలాంటి ఒక బ్రాహ్మణ యువతి అతని కంట పడింది . ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. ఆమె అందచందములను వర్ణించడం  మన్మథునకైననూ శక్యముగాదు. అటువంటి  స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కోరికని తెలియజేశాడు .

ఆమె కూడా ఆ రాకుమారుని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములని  అభవించింది . ఇలా ఒకరి పై ఒకరు ప్రేమని పెంచుకోవడం చేత, వాళ్ళు ప్రతిరోజూ అర్ధరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో తమ వాంఛని చల్లార్చుకోసాగారు .

  ఇలా కొంతకాలము నిరాటంకంగా జరిగిపోయింది . ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె భర్త ఆమెనీ, ఆ రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలన్న నిశ్చయముతో ఒక ఖడ్గాన్ని సంపాదించి , సమయం కోసం ఎదురుచూడసాగాడు . 

ఒక నాటి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ  శివాలయములో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికివారు వారి మార్గాలలో శివాలయానికి బయల్దేడారు . ఇదే తగిన సమయమని ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించిన ఖడ్గాన్ని తీసుకొని గర్భగుడిలో దాగి వేచిచూడసాగాడు.

ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకున్నారు. అప్పుడు రాకుమారుడు "చీకటిగా వున్నది, దీపముంటే బాగుండేది గదా," అన్నాడు. దాంతో ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించింది .

 తర్వాత వారిరువురునూ మహానందముతో రాసలీలకి సిద్ధమవుతుండగా , అదే యదునుగా భావించిన ఆమె భర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారునీ ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించాడు .

వారి పుణ్యం కొలదీ ఆరోజు కార్తీక శుద్ధ  పౌర్ణమి, సోమవారము .  ఆ రోజు ముగ్గురు చనిపోవుటవల్ల శివదూతలు ఆ ప్రేమికులిరువురినీ తీసుకు పోవడానికి  - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోయేందుకూ అక్కడకు వచ్చారు .

యమా దూతలని చూసి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కోసము శివదూతలు విమానములో రావడమేమిటి ? నన్ను తీసుకొని వెళ్లేందుకు యమదూతలైన మీరు రావడమేమిటి ? ఇది చాలా చిత్రముగా ఉన్నదే !” వివరించండని కోరాడు .

అప్పుడా యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైనా , యీ పవిత్రదినమున, అనగా కార్తీకపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన, అప్పటివరకూ వారు చేసిన పాపములన్ని నశించి పోయాయి .

కాబట్టి వారిని కైలాసమునకు తీసుకొనిపోయెందుకు శివదూతలు వచ్చారు " అని చెప్పారు. ఈ సంభాషణ మొత్తం విన్న రాజకుమారుడు "అలా ఎప్పటికీ జరగనివ్వను . తప్పొప్పులు ఎలా ఉన్న మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము. కాబట్టి , ఆ ఫలితము మా ముగ్గురికీ వర్తించాల్సిందే “ అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు . వెంటనే శివదూతలు అతన్ని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యానికి చేర్చారు . 

విన్నావుకదా జనక మహారాజా ! శివాలయంలో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాక , కైలాస ప్రాప్తి కూడా కలిగింది . కాబట్టి కార్తీకమాసంలో నక్షత్రాలు కనిపించే సమయంలో దీపాన్ని ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు.” అని వసిష్ఠ మహర్షి వివరించారు . 

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము,
నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి

Videos View All

కార్తీక పురాణం - ముప్పదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము
కార్తీక పురాణం - ఇరవైఎనిమిదవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఏడవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఆరవ అధ్యాయము
కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya