Online Puja Services

భూమి సముద్రంలో మునగడం ఏమిటి?

18.117.81.240

భూమి పైనే సముద్రం ఉంది కదా! మరి భూమి సముద్రంలో మునగడం ఏమిటి? 
-లక్ష్మీ రమణ . 

మహావిష్ణువుకు దఃశావతారాలూ ఎత్తక తప్పింది కాదు . స్వయంగా తానూ దిగొస్తేకానీ జరగవనుకున్న పనులకి , ఆయన వైకుంఠం వీడి వచ్చేందుకు వెనకాడలేదు . వాటిల్లో  ఒకటి వరాహావతారం . అందులోనో ఒకే కల్పంలో  రెండు సార్లు వరాహునిగా అవతరిస్తే, ఆ రెండూ కూడా అవతారాలు ఈ భూమిని రక్షించడానికి కావడం ఒక విశేషమైతే,  తన నాభినుండీ జన్మించిన బ్రహ్మ గారి ముక్కునుండి స్వామి ఉద్భవించిన వైచిత్రి ఇందులోని మరో విశేషం . 

వరాహ అవతారం ఒకే కల్పంలో రెండు వేర్వేరు మన్వంతరాలలో వచ్చింది .  ఆ కల్పం ప్రస్తుత శ్వేతవరాహ కల్పం కాగా ,  ఆ రెండు మన్వంతరాలు ఈ కల్పంలో మొదటిదైన స్వాయంభువ మన్వంతరం మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరం.  మనము  ప్రస్తుతం ఉన్న  మన్వంతరం ఏడవదయిన, వైవస్వత మన్వంతరం !!

స్వామి రెండు సార్లు భూమిని రక్షించడానికే అవతారం ఎత్తారు. బ్రహ్మ తన శరీరం నుంచి జన్మించిన స్వయంభువ మనువు , శతరూపలను సృష్టి కార్యంలో పాల్గొని వివిధ జీవరాశులను ఉత్పత్తి చేయమని ఆదేశిస్తాడు.  కానీ అప్పటికి భూమి ప్రళయ జలాలలో మునిగి ఉంది . దీనినే గర్భోదక సముద్రం అని అంటారు.  అందులో అట్టడుకు చేరి ఉంది .  ఈ పరిస్థితిలో ‘మేము మా సంతానాన్ని అభివృధ్ధి చేస్తే ,  ఎక్కడ ఉండాలి’ అని ప్రశ్నిస్తారు వారు . ఏంచేయాలా అని  అలా బ్రహ్మ ఆలోచిస్తుండగా , బొటన వ్రేలి పరిమాణంలో బ్రహ్మ నాసిక రంధ్రం నుంచి స్వామి ఉద్భవిస్తారు .  చూస్తుండగానే భారీ వరాహ మూర్తిగా మారతారు . 

ఇప్పుడు మనకో సందేహం రావాలి భూమి పైనే సముద్రం ఉంది కదా మరి భూమి సముద్రంలో మునగడం ఏమిటి ?

దీంట్లో మనం  తెలుసుకోవలసిన ఇంకో విషయం ఏమిటంటే, శ్రీమహావిష్ణువు సృష్టిలో అంటే విశ్వంలో (బ్రహ్మాండంలో) మన భూమి లేదా భూలోకం ఒకానొక లోకం మాత్రమే .  ఇంకా ఇలాంటి లోకాలు 13 ఉన్నాయి .  అవి సూక్ష్మ లోకాలుగా లేదా సాధారణ మానవుని చర్మ చక్షువులకి గోచరించని లోకాలు గా చెప్పుకోవాలి . దీన్నే 4th డైమెన్షన్ అంటున్నారు . (ఇప్పటి పిల్లలకు చెప్పాలంటే alien plantes మరియు అక్కడ ఉండేవారిని aliens అని చెప్పాలేమో) . మొత్తం 14 లోకాలు వీటినే చతుర్దశ భువనాలు అంటాము. వీటిని మూడు భాగాలుగా విభజించారు. ఊర్థ్వ లోకం (పై లోకాలు – 6 భువర్లోక, మువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక , సత్యలోకం [ఇది బ్రహ్మ గారి లోకం]) భూలోకం . దాని కింద  పాతాళ లోకాలు (కింది లోకాలు – 7 అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల , పాతాళ లోకాలు).

ఈ లాంటి విశ్వాలు శ్రీమహావిష్ణువు శరీరంలోని  రోమకూపాల నుంచి అనంతంగా వెలువడుతాయి. అందుకే అన్నమయ్య ఆ స్వామిని అనంతకోటి (అఖిలాండ కోటి) బ్రహ్మాండ నాయకా అని కీర్తించాడు. 

 ఇప్పుడు మళ్ళీ కథనంలోనికి వస్తే భూమి అప్పుడు రసాతలంలో అడుగున చేరింది. ఆ రసాతలం చాలా  చీకటి లోకం .  బురద , చిత్తడితో నిండిన చీకటి లోకం. ఇక  వరాహానికి ఒక గొప్ప లక్షణం ఉంది దాని ఘ్రాణ శక్తి (sensing objects by smelling) అద్భుతం. అందుకే, ఇలాంటి లోకంలో మునిగిన భూమిని వెతికేందుకు స్వామి వరాహమయ్యారు . ఆ అవతారం స్వీకరించారు. 

ఇకపోతే, మళ్ళీ స్వామి వారు చాక్షుష మన్వంతరంలో అంటే ఈ మన్వంతరం కంటే ముందుది, మళ్ళీ ఒకసారి భూమిని ఉద్ధరించి హిరణ్యాక్షుని వధించారు. 

కానీ ఈ  కథనం చదివితే మరో సందేహం పుట్టాక మానదు .  ఎలా భూమి కింది లోకాలైన అతల, వితల, సుతల, తలాతల మరియు మహాతలం దాటి రసాతలం అడుగుకి చేరింది ? దీనికి సమాధానంగా ,  మన్వంతర ప్రళయ కాలంలో ఊర్థ్వ లోకాలు (top lokas) అన్ని ఒక లోకంగా అవుతాయని పురాణాలు చెబుతున్నాయి .

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha