Online Puja Services

శ్రీమన్నారాయణుని ఏకవింశతి అవతారాలు

3.141.30.162
శ్రీమన్నారాయణుని ఏకవింశతి అవతారాలు
 
మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించ బడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
 
శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పిందేమంటే - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం. అని సూతమహర్షి చెప్పినట్టు ఉంది
 
1.బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రాహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
 
2.యజ్ఞ వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
 
3.నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
 
4.నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
 
5.కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
 
6.దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
 
7.యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
 
8.ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
 
9.పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
 
10.మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
 
11.కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
 
12.ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
 
13.మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
 
14.వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము . రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
 
15.నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
 
16.వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
 
17.పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్క మారులు దండెత్తి వారిని దండించాడు.
 
18.వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
 
రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
 
19.బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
 
20.బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. (బుద్ధుడు, బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.)
 
21.కల్కి అవతారము: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.
 
ఇది భాగవతం నందలి వివరణ
(సేకరణ)
- శ్రీ రాధా లక్ష్మి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha