Online Puja Services

భగవద్గీత పదిహేడవ అధ్యాయ పారాయణ మహత్యం

3.135.183.89

మహామొండి వ్యాధుల్ని కూడా తగ్గించే భగవద్గీత పదిహేడవ అధ్యాయ పారాయణ మహత్యం .
- లక్ష్మీరమణ 
 
భగవద్గీతలోని సప్తదశాధ్యాయముకి భక్తిత్రయ విభాగమని పేరు .  వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞాలు , దానాలు చేస్తారనే విషయాన్ని భగవానుడు ఈ అధ్యాయంలో వివరిస్తారు. ఈ అధ్యాయాన్ని నిత్యమూ పారాయణ చేయడం వలన వచ్చే ఫలితం ఎటువంటిది అనేది పద్మ పురాణంలో వివరంగా చెప్పారు . పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించిన ఆ విశేషమైన ఉదంతం ఇక్కడ తెలుసుకుందాం . 

 పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నారు “ప్రేయసి ఇంతకు ముందర పదహారవ అధ్యాయ మహత్యాన్ని చెప్పుకున్నాం కదా ! అందులో చెప్పుకున్నట్టు మహారాజు ఖడ్గబాహుడు తన  పుత్రునికి రాజ్యం అప్పజెప్పి తానూ పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ , కైవల్యాన్ని పొందారు.  వారి దగ్గర దుశ్శాశనుడు అని ఒక సేవకుడు ఉండేవాడు.  రాజుగారికి మాత్రమే లొంగిన ఆ మత్తగజాన్ని తానూ ఎలాగైనా లొంగదీసుకోవాలని అతని కోరిక . కానీ అది దైవంశ సంభూతమా అన్నట్టు సామాన్యులకి లోంగే రకం కాదు.  ఆ దుశ్శాశనుడు ఆ గజాన్ని లొంగదీసుకొనే ప్రయత్నంలో దాని పాదఘాతాలకి తాళలేక అక్కడే పడి మృతి చెందాడు .  

గజాన్ని అధిరోహించాలనే తీవ్రమైన కాంక్ష కారణంగా తిరిగి అతను  గజమై జన్మించాడు. అలా గజమై జన్మించిన ఆ దుశ్శాశనుడు దైవానుగ్రహం చేత , గీతలోని పదిహేడవ అధ్యాయ పారాయనని వినడం చేత ముక్తిని పొందాడు .”  అని చెప్పి పరమేశ్వరుడు ఆగారు .

అప్పుడా దేవదేవి మరింత కుతూహలంతో ఈశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించింది .   
  
“ఓ నాథా! అసలు ఈ  దుశ్శాశనుడు ఎవరు? అతనికి ఈ గజతత్వము కేవలం గజాన్ని లొంగదీసుకోవాలనే కాంక్ష వల్ల మాత్రమే ప్రాప్తించిందా?  సప్తదశాధ్యాయమును వినగలగడానికి అతను  సుకృతం ఎటువంటిది ?  ఇదంతా కూడా తెలుసుకోవాలని ఉంది . దయచేసి వివరంగా తెలియజేయండి” అని కోరారు . 

సమాధానంగా  పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగారు. “పూర్వము ఆ దుశ్శాశనుడు మాండలిక రాజపుత్రుల తోటి ఒకసారి పందెము వేసి, గజాన్ని అధిష్టించి అతివేగంగా పోతూ ఉన్నాడు.  ఆ విధంగా వెళుతూ ఉండగా అతడు ప్రమాదవశాత్తూ జారీ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  ఆ గజము అతణ్ణి తొక్కి , అతి కోపంతో అతని శరీరము నుండి పేగులను, అస్థికలను కూడా పెకలించి మరీ ప్రాణాలు తీశింది.

 ఆ తరువాత అతడు సింహలాదీశ్వరుడైన జయదేవుని ఆస్థానములో గజమై జన్మించి చాలా కాలము గడిపాడు. ఒక సారి ఆ జయదేవుడు గజాన్ని తనకు పరమ మిత్రుడైన ఖడ్గబాహునుకు కానుకగా పంపించాడు.  ఆ ఖడ్గబాహుడు తన  ఆస్థానముకి వచ్చిన ఒక కవీశ్వరుడు వినిపించిన శ్లోకములకి సంతోషించి, ఆ గజాన్ని అతనికి బహుకరించాడు.  ఆ కవిశ్వరుడు ఆ గజమును మాలవదేశాధీశ్వరులకు దాన్ని విక్రయించాడు. 

అలా ఆ గజము మాళవదేశం చేరింది . ఒకనాడు ఆ గజానికి  భరింపనలవిగాని జ్వరము వచ్చింది. ఆ బాధ వల్ల ఏనుగు ఆహారము, నిద్ర, నీళ్లు వదిలి అలా అచేతనంగా పడివుండి కన్నీరు కార్చసాగింది. అది తెలుసుకున్న మాళవదేశాధీశుడు గజ చికిత్సలో నిపుణులైన వైద్యులని తీసుకొని ఆ ఏనుగుని చూడడానికి వచ్చారు .  

 మహారాజును చూసి, ఆ గజము ఆశ్చర్య ముట్టిపడే విధంగా మనుష్య భాషలో ఇలా చెప్పసాగింది . “ఓ భూపాలా ! ఈ వైద్యుల వల్ల, ఔషధాల వల్ల ఏమిటి ప్రయోజనం?  నువ్విప్పుడు తక్షణము ఒక బ్రాహ్మణున్ని ఇక్కడకు రప్పించు. భగవద్గీతలోని సప్తదసాధ్యాయాన్ని పారాయణ చేయించు . ఆ సప్త దశాధ్యాయ జపము చేత నాకు వచ్చినటువంటి ఈ రోగము ఖచ్చితంగా  విశ్రాంతి పొందుతుంది” అని చెప్పింది.  అప్పుడు  ఆ రాజుగారు అదే విధంగా ఒక విప్రుని పిలిచి, అతని చేత గీత సప్తదశాధ్యాయమును జపం చేయించాడు. వెంటనే ఆ గజము తన దేహాన్ని విడిచి, దివ్య రూపాన్ని దాల్చి, దివ్య విమానాన్ని అలంకరించింది. 

 రాజది చూసి ఆశ్చర్యాన్వితుడై, ఒక దివ్య రూపాధారి అయిన దుశ్శాశనుని  పూర్వవృత్తాంతం అంతా కూడా అతని ద్వారానే తెలుసుకున్నాడు.  ఆతర్వాత దుశ్శాశనుడు వైకుంఠాన్ని పొందాడు. అప్పటి నుండీ  ఆ మాళవ భూపతి కూడా గీతలోని సప్తదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ, అత్యల్ప కాలములోనే మోక్షాన్ని పొందాడు.  

కాబట్టి ఓ పర్వత రాజపుత్రి! ఈ గీతా సప్తదశాధ్యాయాన్ని పారాయణ చేయడం చేత పశువులుగా జన్మించిన వారు కూడా ముక్తిని పొందుతారు.  ఎన్ని ఔషధాలకు నివారణ కాకుండా ఉండేటటువంటి మహా మొండి వ్యాధులు కూడా ప్రశాంతత పొందుతాయి.” అని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించారు . 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! 

#bhagavadgeeta 

Tags: bhagawadgeeta, bhagavadgeeta, bhagavadgita

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda