Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 76

18.222.67.251

శ్రీమదాంధ్ర భాగవతం - 76

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

ధేనుకాసుర వధ:

ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావనం లోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజూ ఆ ఆవులను, దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ పరయట్నంలో ఉన్నారు. మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగేరోజున కథను బలరామునితో అనుసంధానం చేశారు. కృష్ణభగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. ‘అన్నయ్యా, ఈవేళ చెట్లన్నీ వంగి వున్నాయి. మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్యా, మీరు మహాపురుషులు’ అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే, బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది? పిల్లలందరూ పరుగుపరుగున వచ్చి ఒకమాట చెప్పారు. ‘బాలరామా, ఇక్కడకు దగ్గరలో తాటికోట ఒకటి ఉన్నది. అక్కడి తాటిచెట్లకు పెద్దపెద్ద తాటిపళ్ళు ఉన్నాయి. అవి ముగ్గి చెట్టునుండి క్రిందపడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. కానీ అక్కడ ధేనుకాసురుడని పిలువబడే గార్దభాసురుడు ఉండేవాడు. అతడు గాడిద రూపంలో వున్నా రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. కానీ అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు. ఎవ్వరినీ ఆ తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరయినా ఆ తాటిపండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే యిది గబగబా వెళ్ళి వెనకకాళ్ళు ఎత్తి అవతలా వాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈమాట చెప్పి వాళ్ళు అన్నారు – మాకు ఎప్పటినుంచో ఆ తాటిపళ్ళు తినాలని ఉంది. బలరామా, మాకు ఆ తాటిపళ్ళు తినే అద్రుస్తమును కల్పించవా’ అని అడిగారు.

అపుడు బలరాముడు ‘మీకేమీ భయం లేదు. నా వెంట రండి’ అన్నాడు. బలరాముడు అపారమయిన బలశాలి. గోపబాలురనందరినీ ఆ తాటి వనంలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల క్రింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు. దానిని గార్దాభాసురుడు చూశాడు. ‘ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరు తినకుండా కాపాడాను. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు’ అని వాడు వెంటనే గాడిదరూపంలో వచ్చి బలరాముడి గుండెలమీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. అపుడు బలరాముడు గార్దభాసురుని రెండుకాళ్ళు ఒడిసిపట్టుకుని వాడిని గిరగిర త్రిప్పి ఒక తాటిచెట్టు మీదికి విసిరాడు. అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటిచెట్టు వెళ్ళి ఇనొక తాటిచెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటిచెట్టు వెళ్ళి మరొక తాటిచెట్టు మీద పడింది. పెద్దగాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడి తాటిచెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలు ఉన్నాయి. ‘మా నాన్నగారిని ఎవరో సంహరించారు’ అని పిల్ల గాడిదలు అన్నీ కృష్ణుడు మీదకి, బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలీలగా చంపివేశాడు.

పుట్టుకతో మీ అంతటమీరు ప్రయత్నం చేయకుండా అలవాడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. కానీ తను కాయించిన కాయలలో ఒక్క కాయనయినా మామిడి చెట్టు తినదు. నది రాత్రనక, పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తోందని నది తన నీళ్ళు తాను ఒక్క చుక్క త్రాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారుచేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవుదగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుష్యుడు ఒక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ యితరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటికి దాచుకోవడం చేతకాదు. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే డానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనస్సులో కలగాలి. చితి ఒక్కసారి కాలుస్తుంది. చింత నిరంతరం కాలుస్తుంది. అది ఎక్కువయిపోకుండా ఉంటాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి. అలా తిరగకపోతే మనస్సుకి ఆలంబనమును మనస్సు వెతికేసుకుంటుంది. ఎప్పుడూ ఐశ్వర్యం గురించో, పిల్ల గురించో, మరియొక దాని గురించో ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. దానివలన ఎప్పుడూ బాదే. ఇటువంటి లోభ గుణం చేత నరకము వస్తుంది.

భార్యా బిడ్డలని పోషించడానికి ధనార్జన చెయ్యాలి. దానిలో కొంత నిలవ చేయాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య, పిల్లలు అందరూ పంచుకుంటారు. కానీ పాప ఫలమును మాత్రం ఎవరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి. అటువంటి పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్య కార్యములను చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులయిన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారముగా దానం చేయాలి. ఈ లోభ గుణమును విరుచుకోవడం మీ అంతటా మీకు రాదు. మహా పురుషుల జీవితములను ప్రయత్నపూర్వకంగా చూడాలి. పదిమందికి సేవచేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనుకంజ వేయకూడదు. అందుకే కృష్ణ భగవానుడు బలరాముడిని స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితములను తెలుసుకుంటే మీలోవున్న లోభగుణము విరిగిపోతుంది. పదిమంది కోసం బ్రతకడం అలవాటవుతుంది.

కాళియ మర్దనము:

ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీల్లి ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?’ అని వాళ్ళని అడిగాడు.

దానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. డానికి అనేక భార్యలు. ఎందఱో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది అని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి యిది కారణం. కాబట్టి యిప్పుడు నేను ఏమి చేస్తానో చూడండి’ అని తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీదవరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. రెండు పాదములను నేలపై గట్టిగా తాటించి ఒకసారి ఊగాడు. అక్కడ ఒక కడిమిచెట్టు ఉంది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. నాటితో తన జన్మ ధన్యమయి పోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. క్రింద వున్న మడుగు కూడా ఈవేళ సుకృతం అవుతోంది. గోపాలబాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్ళల్లోకి సింహము దూకినట్లు దూకాడు. ఆయన నీళ్ళల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఈ మదుగును చూసేసరికే అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికీ వున్నది?” అని సాక్షాత్తు కాళియుడే చూశాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ‘ఎంత ధైర్యం ఈ పిల్లాడికి. నేను ఉన్న మడుగులోకి దూకుతాడా?’ అనుకుని పడగలు విప్పి కాటువేశాడు. కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. అపుడు కాళియుడు తన దీర్ఘమయిన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపాల బాలురు భయంతో పరుగుపరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు.

ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడడం లేదు. కాళియమడుగులోని నీటిలో దూకాడు అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాముచేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు. నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. నీవు చనిపోయిన తరువాత అయ్యో ఏమి చేస్తాము అని వెనక్కి వెడతామని అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బ్రతికి ఉండము. కాబట్టి మేమూ కాళింది మడుగులో దూకేస్తాము. మేమూ ఆ పాము విషంతో చచ్చిపోతాము’ అని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాల బాలురు కూడా అదే ప్రయత్నం లో  ఉన్నారు.

ఇపుడు పరమాత్మ దీనిని చూశాడు. తనను గురించి ఆర్తి చెందేవారున్నారు. ‘నేను వీళ్ళకి దక్కాలి’ అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరమును వెడల్పుగా, పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో వున్నశరీరం పెరిగిపోతే, కాళియుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రముల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కిందపడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు.

కాళియుని తోకపట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడిన ఆ కాలీయుని పడగలుఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయింది. గోపకులు, గోపకాంతలు అందరూ ఆయమున ఒడ్డున సంతోషంతో ‘శభాష్ కృష్ణా’ అని సంతోషంతో అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలల పగిలిపోయి, లోపల వున్న మణులు చెల్లాచదరయి పోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతోంది. అప్పటివరకు విషముతో నల్లగా వున్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళియుడు శోషించి పోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi