Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 66

18.224.32.86

శ్రీమదాంధ్ర భాగవతం - 66

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ 12వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడు మార్లు పుట్టాను. ఒకమారు నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవ మారు అదితి కష్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.

ఈమాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయా దేవి యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడ నుంచి ఆడపిల్లను తెచ్చి దేవకీ ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు. 

వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు యినుప గొలుసులు, తాళములు, మేకులు ఉన్నాయి. అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటకు వచ్చాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడ పట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉంది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమునా దగ్గరికి వెళ్ళాడు. యమునానది విపరీతమయిన వేగంతో ప్రవహిస్తోంది. వసుదేవుడు పరమాత్మను గుండెల మీద పెట్టుకుని యమున వంక చూశాడు. 

కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమునా చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగి వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుప సంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా యిప్పుడు వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు. దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి. లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదే లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. కాబట్టి లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు ఆడపిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తన పిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుంటోంది. అనుకోని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టేసుకుంది. ‘అన్నయ్యా ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు, మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయిపొయింది. ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు. నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్ల అయిన దానిని చంపేడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు అన్నయ్యా’ అని ఏడుస్తూ వేడుకుంది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేశాడు. లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు.

శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 నామాలతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ 14 నామములు వింటున్నారో వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి అఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవి అన్నీ తీసుకుని క్రింద  
వున్న కంసుని చూసి ఒకమాట అంది. ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. 

వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నంద వ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది.నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతున్నారు. చూచివడ్డాము అని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు “అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నంద ప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడు అవుతాడు. లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడు. అని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి. ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగ కృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు. 

౨. పూతన సంహారం 

కంసుడు అష్టమ గర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నమూ చేత తాను అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. ఇక్కడ కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిఛి విషయమును చెప్పాడు. ‘మీరు అందరూ చూశారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతొ కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది’ అన్నాడు.

అపుడు కంసుని చుట్టూ వున్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శత్రువు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకోర రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను ఎవరు చంపుటారో తెలుసా? విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’ 

ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, జేక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువు అనేవాడు లేకుండా పోతాడు. అప్పుడు యింక మనకు శత్రువు వుండదు. అందుకని వీటినన్నిటిని నాశనం చేసేస్తాము. మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. అక్కడ నంద వ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నాడు. అసలు జన్మించిన వలసిన అవసరం లేని వాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు వున్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళ మాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానె అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం. ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.

‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా”

మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేము అని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉంది. అటువంటి పరబ్రహ్మము గురించి ఏ చదువు చెప్పలేదో ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha