Online Puja Services

,శ్రీ మదాంధ్రభాగవతం -- 21

18.221.165.246

,శ్రీ మదాంధ్రభాగవతం -- 21 

పరీక్షిత్తు – కలి – ధర్మదేవత 

పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటినీ కూడా ఏంటో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణ ప్రదంగా ఉన్నదో అంట ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు.

వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్త్రముల నన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిన్మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడం చూసేవారు. అంట నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెడుతుంటే, శిబిరము వేసుకుని ఉంటే, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి ‘మహానుభావా’ మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని, శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారధ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి ఫల్గునా, రధం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి ‘బావా’ అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆడరించాడో! ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు బావా, ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అపుడు అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి. అభిషేకం చెయ్యాలి’ అన్నాడు. అపుడు కృష్ణుడు శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. ‘నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో?” అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనామ్బరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదములయందు నిరంతరమూ రమించి పోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సునిశితంగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనకాతల ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. ఇపుడు శుకుడు వచ్చి కోర్చోవలసిన సందర్భం వస్తోంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే, ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే ‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఒర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది. ఎద్దుకు నాలుగు కాళ్ళూ లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబదినట్లుగా ఆన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడం లేదు – ఆవు ఏడవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసివున్నదానా’ అని అర్థం.

మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంతుంది. మనం అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇపుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా!’ అడిగితె భూమి అంది ‘నేను దేనికి ఎదుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది.’ ఇక్కడ గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నాడో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడయ్యా – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అంది. ఆయనకీ మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు? ఆవిడ అంది –

కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. అతను రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు మూడు పాదములు పోయాయి’ అంది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మమూ. ధర్మమునకు, భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభము. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతలా గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అంది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మీరు మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెండిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha