Online Puja Services

శ్రీ మదాంధ్రభాగవతం -- 20.

18.116.90.141

శ్రీ మదాంధ్రభాగవతం -- 20.

ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. ‘ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా తెలుసా?” అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విడురుడిని పిలిచి ‘నాకు నిద్ర పట్టడం లేదు. ఏదయినా మంచిమాటలు చెప్పు’ అనేవాడు. అప్పుడు విదురుడు ‘నీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు’ అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు ‘నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను. నేను ఈ మొహమ్లోంచి బయటకు రాలేను’ అనేవాడు. కనీసం ఒక మంచివ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని, బుర్రకి పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనం చేయించాడు. జీవితంలో ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో చూడండి!

అటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ‘ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదు. అని కన్నుల నీరు పెట్టుకున్నాడు.

ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్కళ్యాణమే. ఎందుకు ఏడుస్తున్నావు? అని ధర్మరాజుని అడిగాడు. పాపం మా పెదనాన్న గారికి కళ్ళు లేవు, ఉత్తర దిక్కుకి తపస్సుకి అని వెళ్ళిపోయారు. ఆయన ఏమి తింటారు? ఎవరు పెడతారు? అన్నాడు ధర్మరాజు. 

అపుడు నారదుడు ఈ పిచ్చి ప్రశ్న మానెయ్యి. ఎవరు పెడతారని అంటావేమిటి? రెండు కళ్ళు ఉన్న దానిని నాలుగు కాళ్ళు ఉన్నది తినేస్తోంది. నాలుగు కాళ్ళు ఉన్న దానిని రెండు కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి, పళ్ళు పండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తరదిక్కున ఋషులు ఉంటే ఆశ్రమమును చేరుకున్నాడు’ అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అనిన మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు. 

ఇవాల్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటిని వశం చేసుకొని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్ల జేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్ని యందు తన శరీరమును బూడిద చేసేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు’ అని చెప్పాడు. అర్జునుడు వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలు అయింది. కృష్ణ భగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది?’ అని ఆశ్చర్యపోతూ విదురుడిని ‘మీరు తీర్థయాత్రలు చేశారు. అనేక క్షేత్రములకు వెళ్ళారు. ద్వారకానగరం ఎలా ఉంది? కృష్ణ భగవానుడు క్షేమమేనా?’ అని అడిగాడు. 

కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విడురునికి తెలుసు. కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాదన్న అప్రీతికరమయిన వార్త విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది.

‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం’

సత్యమయినా అప్రియమయిన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు.

కానీ ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తె అవతార పురుషుడై, ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజముల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడయిన కృష్ణుడు శరీరము విడిచి పెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే. నాకు అనుమానంగా ఉంది’ అని బాధపడ్డాడు.

ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు ‘అన్నయ్యా, మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తము అయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా! ముల్లు కాలిలో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్న వాడు ఆ ముల్లు తీయడానికి వేరొక ముల్లును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరించి, శరీరములో ఉన్న ముల్లు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముల్లు, చేతిలో వున్న ముల్లు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి ప్రసంగముల యందు జీవితమును పాడుచేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తానూ శరీరముతో వచ్చి ముల్లును ముల్లుతో తీసినట్లు తాను లోకమునకు గీత చెప్పి నడవడి నేర్పి మనలను ఉద్ధరించి అని అంటూ ఆశ్చర్యం ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకొని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు, కేవలం కడవలో నీళ్ళు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించ్నంత తేలికగా గాండీవము ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణ పట్నులను నావద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకొకటి అర్థం కాలేదు. ఈ గాండీవమునే కదా నేను అప్పుడు పట్టుకున్నది. ఈ రథమునే కదా నేను అప్పుడు ఎక్కాను. 

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః!
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!!

ఏనాడు నీ జీవన రథం లోంచి కృష్ణుని తీసివేశావో ఆ నాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే!

‘అన్నయ్యా, ఇవ్వాళ కృష్ణుడు లేదు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చెప్పాను కొట్టాను. ఖాండవ వనమును దహించ డానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. 18 అక్షౌహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధము చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఈవేలం మనం జీవచ్ఛవాలమై ఉన్నాము’ అన్నాడు.

ఈ మాటలను విని ధర్మరాజు ‘ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడయితే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాతి యుగానికి అవకాశం చూపాడు. కాబట్టి మనం ఉండవలసిన అవసరం లేదు’ అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు.

తానూ కట్టుకున్న సార్వభౌమ లాంఛనమయిన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి, కేశ పాశములకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టాను. మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకు వెళ్ళి అపానమనబడే మృత్యు వాయువు నందు పెట్టాడు. అపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమయిన శరీరమునందు పెట్టాడు. ఈవిధంగా ఇప్పుడు శరీరము పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమయిన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు. ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమయిన శరీరములోకి హోమము చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీ దేవి. తన భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఇంక తను ఉండకూడదని తానూ కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరమును విడిచి పెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను, ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులయిన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో, ఎవరు చదివారో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందములయందు భక్తిని కృప చేస్తాడు’ అని పోతన గారు అభయం ఇచ్చారు. ఆ ఘట్టం అంట మహోత్క్రుష్టమయిన ఘట్టం.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya