Online Puja Services

ఏటి సూతకంలో చేయతగినవి, చేయకూడనివి ఏమిటి ?

13.59.218.147

ఏటి సూతకంలో చేయతగినవి, చేయకూడనివి ఏమిటి ?
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  గారి దివ్య ప్రవచనం నుండీ కృతజ్ఞతలతో …  

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే ఓ వ్యక్తి కర్మ చేయవలసి ఉంటుందో అట్టి కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు.అంటే వ్యక్తి మరణాంతర కర్మ చేసే వ్యక్తి అంటే కొడుకు ,కూతురు, పౌత్రులు లేదా బంధువులు ఎవరైనా సరే చనిపోయిన వారి శ్రాద్ధ కర్మ జరిపించే వారికి, అలాగే సాధారణంగా తల్లి లేదా తండ్రి వీళ్ళిద్దరిలో ఎవరైనా చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు శ్రాద్ధకర్మ నిర్వహించే కాలాన్ని ఏటి సూతకం అంటారు. 

తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ జీవి అభ్యున్నతికి సంబంధించిన కర్మలు వారి కొడుకులు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తాడు దేవుడు. ఎందుకంటే పురుషునికి మనస్సులో ఆనంద భావం కలిగితే కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. మనస్సులో ఆనందభావం కలిగిన ప్రతిసారి ఆనంద ధాతువు కదిలినా, శరీరంలోని హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని.అలా కాకుండా శరీరంలో వేరే ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని శాస్త్రం, అందువలన ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్న వేదోక్తి ప్రకారం తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుంది అని నమ్మకం.ఆ కొడుకుకి ఉన్న అధికారం/బాధ్యత ఏమిటంటే,జన్మనిచ్చిన తండ్రికి మరణాంతర కర్మ క్రియ చేయటం తన విధిగా భావించి చేయాలి. 

 వాస్తవానికి జీవితంలో తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు.అందుకే  "పుత్రగాత్ర పరిష్వంగము" ను మించిన సుఖం లేదన్నారు. కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనంద పడిపోతాడో!అది మాటల్లో చెపోటం అసాధ్యం, అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతారు దంపతులు. అంటే కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకొమ్మని కాదు. కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురుకి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే.

కొడుకు ఉన్నవారికి మరణం పిమ్మట కూడా ఆ తండ్రి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం, కొడుకు శరీరంలో ఉన్న ఆత్మ తనదే కనుక భౌతికంగా లేక పోయినా ఉన్నట్టు భావించుతారు. ఓ వ్యక్తి శరీరం విడిచిపెట్టే ముందు తన కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే.అంటే కొడుకు ఒడి తండ్రికి అంత గొప్ప స్థానం అన్నమాట, అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని. 

అటువంటి తండ్రి తన కాయం విడిచి పెట్టేస్తే, మరి ఆ తండ్రికి మనం చేయవలసినది ఏమిటీ,మన కోసం ఆయన సమయం,ధనం,కష్టం సుఖం అన్నీ మనకోసమే వెచ్చించాడు మన చిన్నప్పటి నుంచి. అలాంటి కన్నతండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి ఎనలేని శాంతి లభిస్తుంది. అందుకే పెద్దలు ఒకే చూరు క్రింద తండ్రి కొడుకులు కలిసి ఉన్నవారు ఎవరో వారు మహద్భాగ్యవంతులు అన్నారు. రోజూ తన కళ్ళముందు తన కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే, కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అనే సంతోషం, నా వెంట వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాదిపాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క భాద్యత. 

ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తాడు దేవుడు. అందువల్ల వీడు వెళ్ళి అన్నదానం చేస్తే వారి నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. చేసిన వాడికి కూడా అంత కన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. ఈశ్వర స్వరూపమైన తండ్రికోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి ఉండదు తండ్రీకొసం చేసే ప్రతీది ఈశ్వరునికి చేసినట్టే లెక్క.

అంతేకానీ కనపడ్డ ప్రతి వారితో నేను మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను, అని ప్రచారం చేసుకోవటం, నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు, ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోవడం కూడదు.అలా ఆలోచించటం కన్నా దుర్మార్గమైన తప్పు ఇంకొకటి ఉండదు. తండ్రికోసం విధిగా చేయాలి, అది కొడుకుల బాధ్యత,ఇంకా అవకాశం ఉంటే భూదానం,గోదానం,సువర్ణ దానం వంటివి చేయాలి.

అలా ఏడాదిపాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి లేదా తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు. ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. షోడశోపచారములు చేయాల్సిందే అధవా పంచోపచారములు అయినా జరిగి తీరాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు స్మశానం లాంటిది, దానిలో ఉండడానికి వీలులేదు. ఈశ్వరుడి పాదాల చెంత చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.

చేయకూడనివి:-

ప్రత్యేకంగా చేసే నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం నిషేధం, కానీ నిత్యపూజలో దంపతులు ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు. వ్రతాలు/పర్వదినాల్లో చేసే పూజలు మాత్రం ఆచరించకూడదు.

పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆత్మీయుడు వెళ్ళిపోయాడే! కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ/నాన్న జీవి యొక్క అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా పంచెల చాపు దానం చేసయండి. నాకు పండుగ అని తన సంతోషం కోసం చేసుకోకుండా సంతాపం ప్రకటించుకోవడం కోసమే పండుగ చేసుకోవద్దు అంటారు.

బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో చుట్టాలింటికి పంపి పెద్దలు మాత్రం బాధతో కూర్చోవటం ఎందుకది, ఎందుకా ఏటి సూతకం, అలా ఉండకూడదు. మనం మన పిల్లలకి నేర్పాలి. ఒరే బాబు మీ తాత, నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ, తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. వారిని కోల్పోయిన దుఃఖం,వారికి సంతాపం ప్రకటించటం వలన తగ్గించుకుంటున్నాం, అని అర్థం అయ్యేలా చెప్తే మీరు మానేయండి మేం వెళ్తాం అంటారా పిల్లలు, అందుకే పండుగలు చేసుకోకండి, నోములు, వ్రతాలు, కొండలు ఎక్కకండి, ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి.

అంటే వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిగ ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి, తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి...

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi