Online Puja Services

వేదములలో విజ్ఞానమంతా సూత్రప్రాయమేనా ?

18.189.22.136

వేదములలో విజ్ఞానమంతా సూత్రప్రాయమేనా ?
-సేకరణ 

వేదములలో విజ్ఞానమంతా సూత్రప్రాయమే అని దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నేటి శాస్త్రవేత్తల వాదన. అయితే 50 నుండి 60కోట్ల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు వేదములందలి సారమును అనేక విధములుగా గ్రహించి, గ్రంథస్థం చేయడమే కాక వినిమయం గావించారు. మన పురాణగాథల్లో ఉన్న ఎన్నో వైజ్ఞానిక ప్రస్తావనలు కల్పితాలో, ఊహలో కావు. అవి అన్నీ సాంకేతికంగా ఆనాడు ఉపయోగింపబడినవే.

ధృతరాష్ట్రుని వీర్యాన్ని 100 కుండల్లో భద్రపరిచి, కౌరవసంతానంగా రూపుదిద్దిన శ్రీవ్యాసమహర్షి వాడిన సాంకేతిక పరిజ్ఞానం నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ఒకటే. సూర్యునిద్వారా కుంతీదేవి కర్ణుని కన్న వైనం, నేటి ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ కాదా! ఆనాటి మాయాదర్పణం నేటి టి.వి…. ఇలా చెప్పుకుంటూపోతే ముఖ్యమైనది పుష్పకవిమానం. రామాయణకాలంలోనే విమాన ప్రస్తావనలు కలవు.

భరద్వాజ మహర్షి రాసిన ‘యంత్రసర్వస్వము’ అనే ఉద్గ్రంథములోని 40 అధికరణమైన ‘వైమానిక ప్రకరణము’లో ఆనాటి పనిముట్లు, యంత్రముల చిత్రాలేకాక విమాన డిజైన్ లు కూడా పొందుపరిచారు. దాదాపు 600 పేజీలతో వైమానిక శాస్త్రము రూపుదాల్చింది. ఇది తొలి వైజ్ఞానిక గ్రంథము.

భరద్వాజ మహర్షి పేర్కొన్న వైమానికశాస్త్రంలో యంత్రాలు, పరికరాలు, లోహాల వినియోగం, వాటి నిర్వహణపై పరిశోధనలు జరిపి తెలుగులో గ్రంథంగా రూపొందించారు డాక్టర్ ఆమంచి బాలసుధాకరశాస్త్రి. అందులో పైలట్ తెలుసుకోవలసిన 32 రహస్యాల గురించి వివరించారు. పైలెట్స్ తీసుకోవలసిన శిక్షణ ఎలా ఉండాలనేది కూడా భరద్వాజ మహర్షి చెప్పారు.

విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా చెప్పారు. ఇది నేటి టెక్నాలజీ కంటే చాలా అధునాతనమైనదని, ఇప్పుడు విమానంలో తీసుకుంటున్న న్యూట్రిషియన్ టాబ్లెట్స్ వంటివి ఆ కాలంలోనే ఉన్నవని భరద్వాజ మహర్షి తెలియచేశారు. వంద శతఘ్నులు పేల్చినా దెబ్బతినని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారు. మెరుపులలో నుంచి ఎనర్జీ తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చేర్చబడింది. నేల మీద, నీటిమీద, ఆకాశంలో సంచరించగలిగే త్రిపుర విమానం గురించి కూడా పేర్కొన్నారు.

ఈనాటి ఏరోనాటిక్స్ లో ఉన్న యంత్రసర్వస్వమంతా వైమానికశాస్త్ర గ్రంథంలో ఉంది. విమానసిబ్బంది ఎటువంటి వస్త్రాలను ధరించాలో వివరించారు. ఆహారాధికరణంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, లోహాధికరణంలో విమానాల తయారీలో ఉపయోగించే వివిద రకాల లోహాలు, అద్దాలు, లెన్స్ లు, పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి వంటి అనేక అంశాలు స్పష్టంగా భరద్వాజ మహర్షి తెలియచేశారు. ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు వేదవిజ్ఞాన పరిశోధనా ప్రయత్నాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతున్నారు. తగిన ఆధారగ్రంథాలు లేకపోవడం, వసతుల కొరత, ప్రభుత్వాలకు, అధికారులకు ఇవేమి పట్టకపోవటం, పండితుల మధ్య సమన్వయం కొరవడడం దీనికి కారణం. ఎంతోకాలాన్ని కోట్లరూపాయల ధనాన్ని ఆధునిక పరిశోధనలకి వెచ్చిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందులో వెయ్యోవంతు ప్రయత్నం… ఇందుకోసం వెచ్చిస్తే మానవాళికి పనికొచ్చే ఎన్నో ఆవిష్కరణలు, నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో దుష్పరిమాణాలకి పరిష్కారాలు దొరకకపోవు.

వేదమనగా మతం కాదని, అది ఒక అద్భుతవిజ్ఞాన భాండాగారమని, విశ్వమానవ జీవనశైలి అని గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ వేద విజ్ఞాన పరిశోధనా ఫలములను అందిపుచ్చుకోవడంలో చాలా ముందుకు వెళుతుండగా, వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ పరిస్థితులు ఉండడాన్ని ‘ఫ్రాంటెయర్ గాటెయర్’ అనే అమెరికన్ ‘ఓ భారతదేశమా రోదించు!’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన వాఙ్మయ సంపదంతా జర్మనీలో ఉంది. అలాగే బ్రిటీషువారు వెళుతూ వారి భావాల్ని వారి విద్యావిధానాన్ని (మెకాలే), వారి జీవనశైలిని, భారతీయులకిచ్చి, భారతీయ వైజ్ఞానిక గ్రంథ సంపదని వారు తీసుకొని పోయి బ్రిటీషు లైబ్రరీలో భద్రపరిచారు. జర్మనీతరువాత గ్రంథాల చిరునామా బ్రిటీష్ లైబ్రరీనే.

1920 ప్రాంతంలో జర్మనీలో పుట్టిన ప్రతి జర్మన్ విధిగా సంస్కృతాన్ని అభ్యసించాలని ప్రభుత్వం శాసనం చేసింది. 1927వ సంవత్సరంలో వేదవాఙ్మయ కేటలాగ్ జర్మనీలో ప్రింట్ అయింది. వైమానిక శాస్త్రం ఒక నిర్దుష్టమైన ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్, 8 అధ్యాయాలలో 100 అధికరణాలలో 500 సూత్రాలతో “విమాన నిర్మాణము”ను సమగ్రంగా అందించిన ఒక అద్భుత ప్రాచీన వైజ్ఞానిక సత్యం. ఊహలే తప్ప ఆధారాలు లేవనే వాదానికి ఇక స్వస్తి పలకవచ్చు. ఈ ఒక్క తీగతో సనాతన ఋషిప్రోక్త విజ్ఞాన కోశానికి దారి వెదకవచ్చు.

ఆధునికయుగం పేరు చెప్పగానే మనకు విమానయానం గుర్తుకు వస్తుంది. నవీన విజ్ఞాన శాస్త్రం మనిషికి విమానాన్ని కానుకగా ఇచ్చింది. 1903 డిసెంబరు 17న రైట్‌ సోదరులు ప్రపంచంలోనే తొలి విమానాన్ని నడిపినట్లు నేటి చరిత్ర. కాని వీరికన్నా ఎనిమిది సంవత్సరాల ముందు శివకర్‌ బాపూజీ తలపడే అనే ఆయన బొంబాయి సముద్రతీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులున్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్‌ వినాయక సావర్కార్‌ ప్రత్యేకంగా వ్రాసారు. వీరందరి కన్నా అతి ప్రాచీనకాలంలోనే భారతీయ శాస్త్రవేత్తల విమానయానం గురించిన ఊహలు, ప్రవచించిన సిద్ధాంతాలు కొన్ని వున్నాయి. 

వాటిలో కొన్ని :

భరద్వాజ మహర్షి వ్రాసిన ”యంత్ర సర్వస్వం” ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం.ఈ గ్రంథం బరోడా మహారాజావారి గ్రంథాలయంలో వుంది. దీని ఆధారంగానే బోధానందుని వ్యాఖ్యానంతో ”వైమానిక ప్రకరణం” వెలువడింది. దాదాపు ఏభైవరకు విమాన గ్రంథాలసూచిక ఈ ప్రకరణంలో లభిస్తుంది. అగస్త్యుని ”శక్తిసూత్రం”, ఈశ్వరుని ”సౌదామినీకళ”, ”భరద్వాజుని ‘అంశుతంత్రం”, శాకటాయనుని ”వాయుతత్వ ప్రకరణం”, నారదుని ”వైశ్వానరతంత్రం”, ”ధూమప్రకరణం”, వీటిలో ముఖ్యమైనవి.అన్నింటిలో ”యంత్ర సర్వస్వం”, ఎనిమిది అధ్యాయాలు, వంద కాండలు, ఐదువందల సూత్రాలతో విశిష్టంగా పేర్కొనబడింది.

ఆకాశంలోనేకాక గాలిలోను, నీటిలోను, పక్షితో సమానమైన వేగంతో పయనించే దానిని ”విమా నం” అంటారని భరద్వా జుడు పేర్కొన్నాడు. 36 రహస్యాలు (సాంకేతిక పరిజ్ఞానం) తెలిసినవాడు విమానాన్ని నడపగలడని అతన్నే ”చోదకుడు” పైలెట్‌ అంటారని ఆయన వివరిం చాడు. ఈ ”యంత్ర సర్వస్వం” ఆధునిక, పాశ్చాత్య వైమానిక విద్యావేత్తల్ని ఆశ్చర్యపరు స్తున్నారని భరద్వాజుడు పేర్కొన్న వైమానిక సాం కేతిక పద్దతుల్లో నాల్గు ముఖ్యమైనవి వున్నాయి.

1. కృతకరహస్యం : విశ్వకర్మ, మయుడు, మనువు చెప్పిన రీతిలో విమానాలు నిర్మించే పద్ధతిని ఇది వివరిస్తుంది.

2. గూఢ రహస్యం: విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు, వాటి చలనాల గురించి వివరిస్తుంది. ఆ వాయువుల పేర్లివి. వాస, వైయాస, ప్రయాస- ఈ మూడు వాయువుల్ని వశపర్చుకున్నట్లయితే విమానాన్ని ఎవరికీ కనిపించకుండా నడుపవచ్చునట!

3. అపరోక్షరహస్యం : పిడుగులవల్ల జన్మించే ఒక రకం ‘విద్యుత్తు’ గురించి ఈ ప్రకరణం వివరిస్తుంది.ఈ విద్యుత్తును వశపర్చుకుంటే విమానం ముందుగల వస్తువుల్ని పైలెట్‌ స్పష్టంగా చూడగలుగుతాడు.

4. సర్పగమన రహస్యం : సౌరశక్తిని ఉపయోగించి విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతిని ఈ ప్రకరణం వివరిస్తుంది. ఇలా యంత్ర సర్వస్వం ప్రాచీన భారతీయుల విమాన విద్యా ప్రావీణ్యం గురించి వివరిస్తుంది.

అంతేకాక అతి ప్రాచీనమైన ఋగ్వేదం కూడా విమాన విద్యారహస్య సూక్తాలున్నాయి.
ఋగ్వేదం (5- 41-6) చెప్పిన ”
ప్రావోవాయుం రధ యుజం కృధ్వం” అనే సూక్తం వాయు శక్తితో నడిచే వాహ నాలను సూచిస్తుంది. అలాగే సాగర తరం గాలపై సంచరించే వాహనాలు (ఓడలు) గురించి

”సింధోర్‌ ఊర్శ వధి శ్రితఃకరం విబృత్‌ పరిస్పృం” అనే సూక్తం వివరి స్తుంది.
ఋహుడు మూడు చక్రాల వాహనాన్ని ఉపయోగించేవాడని గాలిలోనేకాక సముద్రంలో సంచరించే జలాంత ర్గాములు వాడకంలో వున్నాయని ఋగ్వేదం పేర్కొన్నది. ఆవిరి యంత్రాలను వేదకాలపు దాక్షిణికులు ”అగ్నిరథాలు” అనేవారు. త్రిపుర విమానం గురించి పురాణాల్లో వివరణ ఉంది.
అలాగే రామాయణంలో పుష్పకవిమానం గురించి భారత, భాగవతాల్లో సౌభకం వంటి విమానాల గురించి విశేష వర్ణనలు ఉన్నాయి.

మొత్తంమీద మన ప్రాచీన వాన్మయంలో విమాన నిర్మాణ విద్య గురించిన విశేషాలు ఎక్కువగానే ఉన్నాయి. నేటి ఏరోనాటిక్స్‌ నేపథ్యంగా ఈ విశేషాలను విశ్లేషించుకోవాలి.

-సేకరణ

Aeronautics, Rigveda, technology, Vedas, Knowledge

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore