Online Puja Services

నిజమైన పండితుడితో అస్సలు పెట్టుకోవద్దు

3.138.141.202

నిజమైన పండితుడితో అస్సలు పెట్టుకోవద్దు ! ఆనక రాసియ్యడానికి ఆస్తులైనా సరిపోవుమరి!
సేకరణ  

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి, గొప్పగా  ఆశీర్వదించాడు. అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు! దీంట్లో ఏముంది ? చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, అందులో మీఅంతటి ప్రతిభ ఉన్నదనుకోవడంలేదు . అయినా ,  మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు. రసవత్తరంగా సాగిన ఆట రాజుకి ఇంపుని కలిగించింది .  రాజు గారు  ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!
రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు. (రాజుతో ఓడినా, గెలిచినా తనకే ముప్పు అని తెల్సినవాడు . )

"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.

“మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!
ఒక గడిలో ఒక గింజ -
రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -
మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -
నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -
.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.

ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది.. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం . చెప్పండి మంత్రివర్యా ! ఎన్ని గింజల ధాన్యం ఆ పిచ్చి బ్రాహ్మానునికి పంపాలి” అని అడిగారు . 

‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’అన్నారు మంత్రి . 

‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.

‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’ వివరించారు మంత్రి . ఆశ్చర్యపోవడం మహారాజు వంతయ్యింది . 

ఆ పండితుడు మహా విజ్ఞాని . ఘనాపాఠి . తనకి ఎన్ని ధాన్యపు గింజలు రావాలో  మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను, ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా !  అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు. మల్లి కొనసాగిస్తూ ఆ పద్యాన్ని ఇలా చెప్పసాగారు మంత్రి . 

శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుం     
జర తుహినాంశు సంఖ్యకు ని
జంబగు తచ్చతురంగ గేహ వి      
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’ అన్నారు తేలిగ్గా చప్పరించేస్తూ !

‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’ అంటూ అందులోని అంతరార్థాన్ని మంత్రి ఇలా విశదపరిచారు . 

 ‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..

ఈ పద్యంలో:

శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 

గగన, వియత్ - 0 (ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1 (చంద్రుడొకడే భూమికి )

షట్కము - 6 

రంధ్ర - 9  (నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7 

అగ్ని - 3 (మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4 

వేద -4 (చతుర్వేదములు)

తర్క - 6 ( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4 (పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8 (అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
        5       9       0         7  3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
 తర్క పయోనిధి పద్మజాస్య కుం
      6         4           4     
జర తుహినాంశు సంఖ్యకు ని
8       1
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల, 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే, 4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి. పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే, సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అదీ సంగతి.” అని వివరించి, ఇలా హితవు చెప్పారా విజ్ఞుడైన మంత్రి వర్యులు .  

“వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది” .

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. అది వారి క్షాత్రానికే అవమానం మరి ! ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పమన్నాడు .

ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి సులువుగా తప్పించాడు.

పద్యం ::పాత గ్రంధాలనుండి

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda