Online Puja Services

నిండునూరేళ్ళూ ఆరోగ్యకరంగా జీవించాలంటే

18.117.152.251

నిండునూరేళ్ళూ ఆరోగ్యకరంగా జీవించాలంటే, ఇలా చెయ్యమంటుంది ఆయుర్వేదం . 
 -సేకరణ: లక్ష్మి రమణ  
 
మారుతున్న కాలంతో పాటే, మన సంస్కృతిలో అనేక మార్పులు చోటుచేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం . అది మంచిదా చెడుదా అనే తర్కాన్ని కాసేపు పక్క పెడితే, ఆరోగ్యకరమైన జీవన అలవాట్లని మాత్రం ఇప్పటి మన సమాజం అధికంగా ఇష్టపడుతోందనేది వాస్తవం. తృణధాన్యాలనీ , ఆరోగ్యకరమైన ఆహారాలవాట్లనీ అలవరుచుకుంటున్నాం. యోగాభ్యాసాలతో మనల్ని మనం సంస్కరించుకుంటున్నాం . అదే విధంగా ఉదయం నుండీ మన జీవన శైలి, దినచర్య  ఎలా ఉండాలని ఆయుర్వేదం చెప్పిందనేది ఒకసారి పరిశీలిద్దాం . 

తెల్లవారుజామున నిద్రలేవాలి:
 
సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు సమయాన్ని బ్రాహ్మీమూహూర్తమంటారు. ఆ సమయంలో నిద్ర నుండి మేల్కొనడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెంది, అగ్ని, క్షమత్వం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయి.

 ‘‘బ్రాహ్మేముహూర్తే ఉత్తిష్ఠేత్ జీర్ణాజీర్ణోనిరూపయన్‌
 రక్షార్థమాయుషః స్వస్థో’’

 (అష్టాంగ సంగ్రహం, సూత్రస్థానం)
 

దంత ధావనం:

వివిధ కాలకృత్యాలు తీర్చుకున్నాక ( మలవిసర్జనానంతరం) దంతధావనం (పళ్లు తోముకోవడం)చేసుకోవాలి. దీనికోసం వేప, కానుగ వంటి చేదు, కారం, వగరు గల పుల్లలను మెత్తగా నమిలి ఉపయోగించుకోవాలి. చిగుర్లను గాయపర్చకుండా పళ్లు తోముకోవాలి. ఈప్రక్రియను ఆహారం తిన్న తర్వాత కూడా అమలుపరచాలి.

 ‘‘.....ప్రాతః భుక్త్వాచ మృద్వగ్రం కషాయ కటు తిక్తకమ్,
 భక్షయేత్ దంతధావనం దంతమాంసాని అబాధయన్’’

 (అష్టాంగ హృదయం)
 

వ్యాయామం: 

వ్యాయామం వల్ల దేహం తేలికగా, శక్తిమంతంగా తయారవుతుంది. జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. కొవ్వు కరగడం వల్ల స్థూలకాయం ప్రాప్తించదు.  మంచి దేహసౌష్ఠవం ప్రాప్తిస్తుంది. చిన్నపిల్లలూ, వృద్ధులు, అజీర్ణరోగులు వ్యాయామం చెయ్యకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి .

 ‘‘లాఘవం, కర్మసామర్ధ్యం దీపోర్తగ్నిః మేదసఃక్షయః
 విభక్త ఘన గాత్రత్వం వ్యాయామాత్ ఉపజాయతే’’
 ‘‘...వాతపిత్తమయీ బాలోవౄద్ధో అజీర్ణీచతంత్యజేత్.’’

 
యోగసాధన: 

యోగసాధన వల్ల (ఆసనాలూ, ప్రాణాయామం, ఆత్మజ్ఞానసముపార్జన) మనిషికి ఆరోగ్యసిద్ధి (మానసిక, శారీరక, ఆత్మానుగత) లభిస్తాయి.

 ‘‘యోగేన చిత్తస్యపదేన వాచాం మలం శరీరస్యతువైద్యకేన
 యోపా కరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి- రానతోస్మి’’

 (చరక సంహిత)
 

శరీరానికి నలుగు పెట్టుకోవడం, స్నానం :

 కొన్ని చూర్ణాలతో శరీరానికి చేసే మర్దనను (నలుగు పెట్టడాన్ని) ‘‘ఉద్వర్తనం’’ అంటారు. దీని వల్ల కఫం హరించుకుపోయి, స్థౌల్యం (స్థూలకాయం) తగ్గి, చర్మం ప్రకాశిస్తూ, అంగసౌష్ఠవం కలుగుతుంది.  (ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేసినా ప్రయోజనకరమే)

 ‘‘ఉద్వర్తనం కఫహరం మేదసః ప్రవిలాయనం
 స్థిరీకరణం అంగానాం త్వక్ ప్రసాదకరం పరం’’

⇒ నిత్యం స్నానం చేయడం వల్ల అగ్నిదీప్తి, శుక్రవృద్ధి, ఓజస్సు, బలం, ఆయువృద్ధి సిద్ధిస్తాయి. శరీరం మలిన రహితమవుతుంది. దురద, చెమట, కునికిపాట్లు, దప్పిక, మంట హరించుకుపోతాయి. వ్యాధిగ్రస్తునికి సైతం తాను రోగిననే భావన దూరమవుతుంది.

 ‘‘స్నానం దీపనం ఆయుష్యం వృష్యం ఊర్జాబలప్రదం
 కండూ మలశ్రమస్వేద తంద్రా తృట్ దాహ పాప్మజితం’’

 
నిత్యం తలకు నూనె రాసుకోవడం వల్ల:  

ప్రతిరోజూ తలకు నూనె రాసుకుంటే శిరశ్శూల, బట్టతల, వెంట్రుకలు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. కపాలానికి బలం చేకూరుతుంది. కేశ మూలములు దృఢంగా ఉంటాయి. కేశాలు నల్లగా, పొడవుగా అవుతాయి. శిరస్సునకు తైలమర్దనం చేసుకోవడం వల్ల ఇంద్రియ నైర్శల్యం, చక్కటి చర్మకాంతి, సుఖ నిద్ర కలుగుతాయి.

 ‘‘నిత్యం స్నేహార్ద్ర శిరసః శిరఃశూలం నజాయతే
 నఖాలిత్యం నపాలిత్వం నకేశాః ప్రపతంతి చ,
 బలం శిరః కపాలానాం విశేషేణ అభివర్ధతే
 దౄఢమూలాశ్చ దీర్ఘాశ్చ కౄష్ణాః కేశాభవంతి చ,
 ఇంద్రియాణి ప్రసీదంతి సుత్వక్ భవతి చామలమ్
 నిద్రాలాభః సుఖంచ స్యాత్ మూర్ధ్ని తైల నిషేవణాత్’

 

ఏయే వేళల్లో తినాలి?

మధ్యాహ్నం, సాయం సంధ్యవేళల్లో తినటం ఉత్తమం. భోజనానికి, అల్పాహారానికి మధ్య కనీసం నాలుగైదు గంటల వ్యవధి ఉండాలి. ఆకలి కానప్పుడు, తిన్నది జీర్ణం కానప్పుడు మళ్లీ తినకూడదు. అదేపనిగా ఉపవాసాలూ చెయ్యకూడదు. ప్రతిరోజూ నియమిత వేళల్లోనే తినాలి. వారానికొకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది.
 
అన్నాన్ని సేవించడం ‘అశనం’ అంటారు. పథ్యా పథ్యాల్ని గమనించి సేవించడం ‘సమశనం’ అంటారు.  అతిగా తినడాన్ని ‘అధ్యశనం’గా చెప్పారు. అధిక ప్రమాణంగాని, అల్ప ప్రమాణంగాని వేళకాని వేళల్లో తింటే ‘విషమాశనం’గా వర్ణించింది ఆయుర్వేదం. వీటివల్ల అజీర్ణ వ్యాధి కలగడమే కాకుండా, అతిదారుణమైన వ్యాధులూ సంభవించవచ్చు.
 

కాలానుగుణంగా ఆహారంలో మార్పు (రుతువులను బట్టి):

శిశిరం (ఫిబ్రవరి, మార్చి)- తీపి, పులుపు, ఉప్పు రుచులు, వేడిగా, స్నిగ్ధంగా ఉండాలి  వసంతం (మార్చి, ఏప్రిల్, మే): చేదు, కారం, వగరుగా ఉండేవి, పొడిపొడిగా, వేడిగా ఉండాలి  గ్రీష్మ (మే, జూన్, జూలై): తీపి, చల్లవిగా ఉండే స్నిగ్ధ (జిడ్డుగా) పదార్థాలను, ద్రవాహారాన్ని సేవించాలి  వర్ష (జూలై, ఆగస్టు, సెప్టెంబర్): తీపి, పులుపు, స్నిగ్ధ పదార్ధాలు, వేడివేడిగా  శరత్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్): తీపి, చేదు, వగరు, రూక్ష (పొడిగా ఉన్నవి - అంటే జిడ్డులేనివి), చల్లగా ఉండాలి  హేమంత (నవంబరు, డిసెంబరు, జనవరి): తీపి, పులుపు, ఉప్పు, స్నిగ్ధ, ఉష్ణ పదార్థాలు.
 

‘పథ్యం’ అంటే?:

సరిపడేది, హితకరం అని అర్థం. దీనికి వ్యతిరేకం ‘అపథ్యం’. ఇది శరీర స్వభావాన్ని బట్టి, అగ్నిబలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి, వాడే ఔషధాన్ని బట్టి తినగదినవి, తినకూడనివి అయిన ఆహార పదార్థాల్ని వివరించింది ఆయుర్వేదం. ఉదా: అజీర్ణంలో తేలికయైన (లఘు) ఆహారం తీసుకోవాలి. జ్వరంలో కూడా; మధుమేహవ్యాధిలో - మధుర, స్నిగ్ధ ఆహారం అపథ్యం; చేదు పదార్థాలు పథ్యం.

 ‘‘పథ్యాన్ని సక్రమంగా పాటిస్తే ఔషధమే అవసరముండదు. పాటించకపోతే ఔషధం పనిచేయదు’’ - అని వాగ్భటాచార్యులు నొక్కి చెప్పారు.
 

నిషేధాలు

⇒ ప్రధానంగా కొవ్వు పదార్ధాలను విసర్జించాలి. అంటే నూనె, నెయ్యిలతో వండిన వంటకాలన్న మాట. శరీరానికి కావలసిన కొవ్వులు మనకి ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్ధాలలో (ఉదా: పాలు, పెరుగులలో) లభిస్తాయి. నువ్వులనూనె, ఆవునెయ్యి - వీటిని కొంచెం ప్రమాణంలో నెలకు రెండుసార్లు సేవిస్తే మంచిది. అవి హానికరం కావు. మనం చేసే శారీరక శ్రమ, వ్యాయామాన్ని బట్టి వీటి ప్రమాణాలను సరిచేసుకోవాలి.
⇒ ఐస్‌క్రీములు, శీతల పానీయాలు, చాక్లెట్లు, బేకరీ సరుకులు, ఫాస్ట్‌ఫుడ్స్‌ల వల్ల పోషకవిలువలు శూన్యం.
⇒ సాత్వికాహారమైన శాకాహారం అత్యుత్తమం. అలవాటుంటే మత్స్యమాంసాలను అరుదుగా మాత్రమే తినడం శ్రేయస్కరం.
⇒ రోడ్డుపక్కన లభించే పళ్లరసాలు, చెరకురసాలు సేవించడం ప్రమాదకరం. ఇన్‌ఫెక్షన్ల వల్ల మహాకోష్ఠం దెబ్బతింటుంది. అలాగే బజ్జీలు, దోసెల లాంటివి కూడా. నూనెలను పదేపదే మరిగించడం చాలా హానికరం.
⇒ ఆహార నియమాలను ఉల్లంఘిస్తూ, వేళాపాళా లేకుండా ఇష్టానుసారంగా తినడం వల్ల లివర్ దెబ్బ తింటుంది.
 

నిద్ర

నిద్ర: మనసు బడలికనొందగనే ఇంద్రియాలు కూడా అలసిపోయి తమతమ నిర్ణీత కర్మల నుంచి దూరమవుతాయి. దాంతో మనిషికి నిద్రవస్తుంది. ఒక్క వేసవికాలంలో తప్ప పగటి నిద్ర నిషేధం.

 ‘‘యదాతు మనసి క్లాన్తే కర్మాత్మానః క్లమాన్వితాః
 విషయోభ్యో నివర్తంతే తదా స్వపితి మానవః’’

             (చరక సంహిత)

మద్యనిషేధం: మద్యాన్ని తయారుచేయడం, విక్రయించడం, తాగడం, ఇతరులకు ఇవ్వడం శస్త్రనిషేధం.
 

 ‘‘సర్వధా ఈక్షేత్ న ఆదిత్యం, న భారం శిరసావహేత్
 నఈక్షేత ప్రతతం సూక్ష్మదీప్తా మేధ్యాప్రియాణిచ
 మద్య విక్రయ సంధాన దానపానానిన ఆచరేత్’’

 
దీంతో పాటు సూర్యకాంతిని నేరుగా చూడవద్దు. తలపై అధికభారం మోయవద్దు. అత్యంత సూక్ష్మం, అత్యంత తీక్షణమైనవీ, మనసుకి అప్రియాలైన వస్తువులను తదేక దృష్టితో చూడకూడదు.

మన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం సూచించిన పైన పేర్కొన్న అన్ని నియమాలనూ క్రమం తప్పక పాటిస్తే నిండు నూరేళ్ళూ ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha