Online Puja Services

అగ్ని ఎన్నో రకాలు . వీటిని గురించి విన్నారా ?

18.119.253.93

అగ్ని ఎన్నో రకాలు . వీటిని గురించి విన్నారా ?
-లక్ష్మీ రమణ 

అగ్ని లేనిదే జీవం, జీవి మనుగడ లేనేలేదు . అయితే ఈ అగ్ని స్వరూపం అనేది ఆధ్యాత్మిక దృష్టితో అర్థం చేసుకున్నప్పుడు చాలా విభిన్న రూపాలలో మనకి కనిపిస్తుంది . అన్నింటికీ సాక్షీభూతుడై , దేవతలకి పురోహితుడై , సర్వ జీవులకీ , హితుడై, సన్నిహితుడైన  అగ్ని దేవుని విశ్వరూపం కనులకి కడుతుంది . అసలు ఆయన లేనిచోటులేదని అర్థం అవుతుంది . అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది. 

సృష్టిని వెలుగులతో నింపుతున్న సూర్యుడు అగ్నిగోళమేకదా ! ఆయనే లేకపోతె, తినడానికి ఒక్క మొక్కయినా ఈ భూమిమీద మొలిచేనా ? యజ్ఞాలలో మనం సమర్పించే హవిస్సులు ఆ అగ్ని స్వయంగా ఆయా దేవతలకి చేరవేరుస్తాడు . అంటే ఇక్కడ అగ్ని దేవుడు భగవంతునికి - భక్తునికీ మధ్య  మాధ్యమంగా ఉన్నారన్నమాటేగా !  పైగా వివాహాలకీ , శుభాశుభ సందర్భాలకీ ఆయనే ప్రత్యక్ష సాక్షి . అటువంటి మహానుభావుడు తానాశ్రయించిన చోటుని బట్టి , సందర్భాన్ని బట్టి వివిధ రూపాలలో మనకి దర్శనమిస్తున్నారు . వాటిల్లో కొన్నింటిని గురించి చెప్పుకుందాం . 

క్రోధాగ్ని:

కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం కావడం  తధ్యం.

బడబాగ్ని:

ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.

జఠరాగ్ని:

ఇది ప్రతీ ప్రాణిఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం”

అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసే ముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల (ఇవి నాలుగు రకాలు – జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి మరియు ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి) దేహములో (శరీరములో) ఉన్నాడు. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములయిన పదార్థాలు [అవేమనగా భక్ష్యం (కొరికి తినేవి), భోజ్యం (నమిలి తినేవి), లేహ్యం (నాకి తినేవి), చోష్యం (పులుసు, మొదలయినవి)] మన భోజనములో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమయ్యి మన ప్రాణాన్ని నిలపెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతయ్యి ఆ అగ్ని (హవ్యా వాహనుడు) శరీరమంతా ప్రాణ వాయువు రూపములో వ్యాపిస్తుంది. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. త్రాగిన వాటినీ, తిన్న వాటినీ రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా మార్చి శరీరానికి సమానముగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం.

ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికి ఇచ్చే హవిస్సు క్రింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్య ఫలము లభించును. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి.

జ్ఞానాగ్ని:

ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యముగా రామాయణము లో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది.

సీతాదేవి జీవుడికీ, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మకీ ప్రతీకలు. సీతాదేవి బంగారు లేడిని కోరటం వలన రాముడికి దూరమయ్యింది. అంటే జీవుడికి కోరికలు కలుగుట వలన పరమాత్మ నుండీ దూరమవుతాడు. ఇక్కడ ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక చిన్న కథను చెప్పుకోవాలి.

శరీరము అనే మామిడి చెట్టు మీద జీవ పక్షి, ఈశ్వర పక్షి ఉన్నాయిట. చెట్టు నిండా ఉన్న మామిడి పండ్లను చూసిన జీవ పక్షి తింటాను అంటే ఈశ్వర పక్షి వద్దని వారిస్తుందిట. అయినా వినకుండా జీవ పక్షి ఆ చెట్టుకి ఉన్న పండ్లన్నీ తినేస్తుందిట. తిన్నాక ఆ వనంలో ఉన్న మరొక చెట్టు, మరొక చెట్టు అలా తినాలి అన్న కోరిక వలన ఎన్నో చెట్లు మారుతూ ఈశ్వర పక్షికి దూరమవుతుంది. అదే విధముగా జీవుడు కూడా కోరికలని పెంచుకుంటూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్మకి దూరమవుతున్నాడు. ఇలా దూరమయిన జీవుడు పంచభూతాలకి మాత్రమే వశమవుతాడు.

“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే” అని భగవద్గీతలో చెప్పినట్టు అసలు నేను ఎవరిని? ఎక్కడ నుండి వచ్చాను అన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు కైవల్యం పొంది పరమాత్మ వద్దకు తిరిగి చేరగలడు. ఈ జ్ఞానం సన్యాసాశ్రమంలో తురీయావస్థలో పొందగలరు. సన్యాసాశ్రమం లోకి ప్రవేశించే ముందు వీరి సర్వ కర్మలు, కోరికలు అన్నీ భస్మం చేయటం కోసం విరజా హోమం చేస్తారు. అదే విధముగా సీతాదేవి రూపములో ఉన్న జీవుడు, రాముని రూపములో ఉన్న పరమాత్మను చేరటానికి విరజా హోమమనే జ్ఞానాగ్నిలో అగ్ని ప్రవేశం చేసి, సర్వ కర్మలూ, కోరికలనూ భస్మం చేసి పరమాత్మ అయిన రాముని వద్దకు వచ్చింది అని అంతరార్థం. దీనిని॥స్వయముగా చేసి జనానికి చూపించటమే సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టంలోని ఆంతర్యం.

దావాగ్ని:

ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. 

ఆరణి :

ఎండు పుల్లల రాపిడితో పాటూ, కవ్వంతో మజ్జిగ చిలికినట్టు అరణిలో మధించి అగ్నిని పుట్టించేవారు. ఇది పవిత్రమైనటువంటిది . ఈ రకముగా తయారయినటు వంటి, యజ్ఞ యాగాదులకి ఉపయోగించే అగ్ని మూడు రకాలు. అవి దక్షిణాగ్ని, ఆహవనీయం (ఆహుతులిచ్చేది), గారహపత్యం (గృహస్థాశ్రమంలో ఉన్నవారు చేసేది). ఈ మూడిటినీ కలిపి త్రేతాగ్నులు అంటారు. ఇది వరకు నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. అటువంటివారు ఈ త్రేతాగ్నులనీ ఖచ్చితముగా వెలిగించేవారు. యజ్ఞము వలన ఉద్భవించిన అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సప్త జిహ్వాయనుడు (ఏడు నాలుకలు కలవాడు) అని ఈయన పేరుకి తగ్గట్టుగా హోమం చేసిన ఆహుతులని ఏడు నాలుకలతో ఈయన స్వీకరిస్తాడుట.

వజ్రాగ్ని:

ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి. మెరుపులు, పిడుగులు అగ్ని స్వరూపాలే కదా! మన పురాణాల ప్రకారం మెరుపు ఇంద్రుని వజ్రాయుధ మనీ, పిడుగు వజ్రాయుధా ఘాతమనీ ఉంది. 

సూర్యాగ్ని:

సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం. 

యోగాగ్ని:

అంటే కేవలం యోగము వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. 

ప్రేతాగ్ని:

దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. మానవ దేహం పంచభూతా లతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.

మన మంత్రపుష్పంలో ఈ అగ్ని గురించిన ప్రస్తావన ఉంది. ప్రతీ మనిషిలోనూ భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక అగ్నిశిఖ రూపములో, నల్లని మబ్బులో విద్యుల్లత (మెరుపు) వెలిగినట్టు, సూక్ష్మంగా, పచ్చగా ఉన్నాడుట. ఆ అగ్నిశిఖ మధ్యలో ఉన్న ఈయనే శివుడు, ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు అని చెప్పబడింది.

మనది పవిత్రమయిన భారత దేశం. భా అంటే వెలుగు లేదా కాంతి. “భాయాం రతః” భారతః అన్నారు. ఎవరయితే ఈ అగ్ని రూపములో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ (“భా” అంటే భావం అనగా మనసు, “ర” అంటే రవం అనగా వాక్కు, “త” అంటే తనువు అనగా కాయం) కర్మలలో ఏకత్వాన్ని పొందుతారో వారే భారతీయులు అని చెప్పబడింది. అంతటి గొప్ప ప్రఖ్యాతలు ఉన్న మనం వీటన్నిటినీ ఆచరించి, ఆలంబించినప్పుడే ఈ జన్మకి, మన పుట్టుకకి ఒక సార్థకత

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha