Online Puja Services

బిడ్డకు సంతోషం - స్వామికి తృప్తి

3.144.187.103
బిడ్డకు సంతోషం - స్వామికి తృప్తి
 
1970లలో ఒక రోజు కంచి మఠంలో స్వామి వారు శ్రీ త్రిపురసుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. వేలాది మంది భక్తులు కనురెప్పలు కొట్టడం కూడా మరచి అత్యంత శ్రద్ధతో పూజను తిలకిస్తున్నారు. త్రిపురసుందరీ దేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది.
వేదికకు దూరముగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తోంది. తల్లిఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను చూసింది. చూడటంతోనే ఆ చీరకావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది అమాయకంగా. తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది, మందలించింది, విన్నదికాదు కూతురు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని మంచి పిల్లలు అలా మారాం చెయ్యరాదని, భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. 
 
కాని ఆ పిల్ల ఆ మాటలేవి వినిపించుకోలేదు. అమ్మను వేధిస్తూనే ఉంది ఆ చీర కోసం. ఆవిడ బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆ ఆమె పిల్లని కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఆ పిల్ల భయపడిపోయి, కళ్ళనిండా నీళ్ళతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వేంటనే గుండెలకు హత్తుకొని కళ్ళ నీరు తుడిచి, చిన్ని చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది. ఆ శ్లోకాలు వింటూ అమ్మని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది.
 
పూజ ముగిసిన తరువాత స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఆ తల్లి పిల్లతో సహా తీర్ధం అందుకోవడానికి అందరితోపాటు వేదికమీదకు వచ్చినది. 
 
హఠాత్తుగా స్వామివారు తీర్ధం ఇవ్వడం ఆపేసారు. ఎందుకో ఎవరికి అర్ధం కాలేదు. స్వామివారు లేచి గర్భగృహంలోకి వెళ్ళి, అందరిని ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి, ఆ పిల్లకు ఇచ్చారు. తరువాత తీర్ధం ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి విస్తుబోయింది, ఎక్కడో దూరాన ఒకమూలన కూర్చొని ఉన్న తన పిల్ల యొక్క కోరిక మహా స్వామివారికి ఎలా తెలిసిందా అని స్థాణువై చూస్తున్న ఆ తల్లితో స్వామివారు, “పిల్లలు దైవస్వరూపులు. ఏది అడగాలో అడగకూడదో వాళ్ళకు ఎలా తెలుసు? భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళకోసమే అని వాళ్ళు అనుకుంటారు. పిల్లని ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే. ఆవిడే అందరికి నిజమైన తల్లి” అని అన్నారు.
 
ఇద్దరూ స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత స్వామివారు అక్కడున్న శిష్యులతో, “తన చీరను తీసుకోవడానికి త్రిపురసుందరి అమ్మవారే వచ్చింది. అది ఆవిడది. ఇవ్వను అనడానికి నేనెవర్ని. అందుకే అమ్మవారికే ఇచ్చివేశా” అని అన్నారు.
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
 
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
 
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha