Online Puja Services

క్షీరసాగరమథనం

3.138.69.45
అమృతోత్పత్తికి మూలమయిన కథ ఇది. శ్రీహరి మోహినీ అవతారం ఎత్తిన అద్భుత వృత్తాంతం ఇది.పూర్వం దేవతలకూ, రాక్షసులకూ పెద్ద యుద్ధం జరిగింది.

ఆ యుద్ధంలో దేవతలు అనేకమంది మరణించారు. అదలా ఉంచితే...ఐరావతాన్ని అధిరోహించి ఇంద్రుడు రావడాన్ని ఒకనాడు దుర్వాస మహర్షి చూశాడు. ఆ వైభవానికి ఎంతో సంతోషించి అతనికి పుష్పహారం కానుకగా ఇచ్చాడు. పుష్పహారాన్ని తేలికగా చూసి, దానిని ఏనుగు కుంభస్థలం మీద పడవేశాడు ఇంద్రుడు. ఏనుగు తొండంతో తీసి కింద వేసి, నుగ్గు నుగ్గు చేసింది దానిని. అది గమనించిన దుర్వాసునికి తట్టుకోలేనంత కోపం వచ్చింది. ఇంద్రుణ్ణి ఇలా శపించాడతను.

‘‘నన్ను అవమానించిన కారణంగా నీ సర్వసంపదలూ త్వరలోనే నశిస్తాయి. నీ త్రిలోకాధిపత్యం పోతుంది. నువ్వు భ్రష్టుడివయిపోతావు.’’దుర్వాసుని శాపంతో ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. సకల ఐశ్వర్యాలనూ పోగొట్టుకున్నాడు. దరిద్రుడయ్యాడు. యజ్ఞయాగాదులు లేకుండాపోయాయి. దానవులతో ఓడిపోయి, పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని కూడా భరిస్తున్న దేవతలు ఇంద్రుడు దరిద్రుడు కావడంతో మరింతగా కుంగిపోయారు. దిక్పాలకులకు కూడా దిక్కు తోచలేదు. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. బ్రహ్మను ఆశ్రయించారంతా. తమ దుస్థితి తెలియజేసి, ఆదుకొమ్మన్నారు. దుర్వాసుని శాపంతో ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. దరిద్రుడయ్యాడు. ఆసరికే చాలా మందిని కోల్పోయిన దేవతలు, ఇంద్రుడు దరిద్రుడు కావడంతో మరింతగా కుంగిపోయారు. ఏం చెయ్యాలో దిక్కు తోచలేదెవరికీ. ఆదుకోమని బ్రహ్మను ఆశ్రయించారు. ఆదుకొనగలిగేది ఒక్కడే, ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పి, దేవతలందరినీ వెంటబెట్టుకుని, జగన్నాథుణ్ణి సందర్శించాడు బ్రహ్మ.అంతా శ్రీహరిని వేయి విధాల స్తుతించారు. కాపాడమని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి చెప్పాడిలా.‘‘దేవతలకు మంచిరోజులు కావవి. చెడురోజులు. మంచిరోజులు వచ్చేదాకా మీరంతా ఓపిక పట్టాలి. అందుకోసం నిరీక్షిస్తూ కూర్చోకుండా ముందు మీరో పని చెయ్యాలి, రాక్షసులతో సంధి చేసుకోవాలి. అదే మీ తక్షణ కర్తవ్యం.’’రాక్షసులతో సంధా? జరగని పని అన్నట్టుగా దేవతలంతా ఒకరినొకరు చూసుకున్నారు.

గ్రహించాడది శ్రీహరి, నవ్వుతూ ఇలా అన్నాడు మళ్ళీ.‘‘రాక్షసులతో సంధి మీకు చాలా అవసరం. ఎందుకంటే మీకు అమృతం కావాలి. అమృతాన్ని మీరొక్కరూ సాధించలేరు. అందుకు రాక్షసుల సహాయం కావాలి. అందుకే సంధి చేసుకోండి అంటున్నాను. వారితో సంధి చేసుకుని, అమృతాన్ని సాధించేందుకు వారిని సమాయత్తం చేయండి.


సమస్త ఓషధులకూ నిలయమయిన మందరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు వాసుకుని తాడుగానూ చేసి, మీరూ, రాక్షసులూ కలసి పాలసముద్రాన్ని మథించండి. మథిస్తే అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని మీకు మాత్రమే అందేట్టుగా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను.

అమృతం అందింది దేవా, ఉపయోగం?’’ అడిగారు దేవతలు. నవ్వాడు శ్రీహరి.‘‘అమృతాన్ని పానం చేస్తే చావు అనేదే ఉండదు. మీరు అమరులవుతారు.’’ అన్నాడు.దేవతలు ఆనందించారు. అక్కణ్ణుంచి నిష్క్రమించారు. శ్రీహరి చెప్పినట్టుగా ముందుగా రాక్షసులను మచ్చిక చేసుకున్నారు దేవతలు. తర్వాత వారితో సంధి చేసుకున్నారు.

ఓ మంచి ముహూర్తం చూసుకుని రాక్షసులతో ఇలా అన్నారు.‘‘మనం మనం అన్నదమ్ములం. పెత్తల్లి పిన్తల్లి బిడ్డలం. మనలో మనకి గొడవలనవసరం. కలసి ఉంటే కలదు సుఖం అన్నారు. అందుకని అంతా కలసి ఉందాం. కలసి ఉండి, అమృతాన్ని సాధిద్దాం. మందగిరితో క్షీరసాగరాన్ని మథిద్దాం. అమృతం పుడుతుంది. దాన్ని సరిసమానంగా పంచుకుందాం.

అమృతాన్ని సరిసమానంగా పంచుకున్నాం, ఏమిటి లాభం?’’ అడిగారు రాక్షసులు.‘‘అమృతపానం చేస్తే చావన్నదే రాదు. చావు లేదంటే శత్రు భయం లేనట్టే! అప్పుడు ముల్లోకాలూ మన అధీనంలోనే ఉంటాయి.’’ అన్నారు దేవతలు.


రాక్షసరాజు బలి, దేవతలు చెప్పిందంతా ఒకటి రెండుసార్లు ఆలోచించాడు. ఇదెంత వరకూ సాధ్యం అనుకున్నాడు. ఆఖరికి ఒప్పుకున్నాడు. రాక్షసుల్ని కూడా ఒప్పించాడు. హమ్మయ్య అనుకున్నారు దేవతలు, ఊపిరి పీల్చుకున్నారు. ఎలాగయితేనేం రాక్షసుల్ని తమ వైపునకు తిప్పుకున్నామనుకున్నారు. దేవదానవులు క్షీరసాగరాన్ని మథించి, అమృతాన్ని సంపాదించేందుకు ఉద్యమించారు. మందరపర్వతాన్ని పెళ్ళగించి, మోసుకుని రాసాగారు. పర్వతం బరువుని తట్టుకోలేకపోయారు.

కాస్సేపటికి కిందపడవేశారు. అప్పుడు అటు రాక్షసులు, ఇటు దేవతలు కూడా చాలా మంది ఆ పర్వతం కింద పడి, చనిపోయారు. మిగిలిన వారు మందరాన్ని మోసుకుని వెళ్ళడం అసాధ్యం అనుకున్నారు. తలలు పట్టుకుని అక్కడే చతికిలబడ్డారు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. దీనంగా కూర్చున్న దేవతలనూ, రాక్షసులనూ చూసి, వారికి అభయం ప్రసాదించాడు. పర్వతం కింద పడి చనిపోయిన వారందరినీ బతికించాడు. బతికిన వారితో పాటుగా పర్వతాన్ని మోసేందుకు అంతా సిద్ధమవుతుంటే, మీకెందుకు శ్రమ అన్నట్టుగా శ్రీహ రే కల్పించుకున్నాడు. ఒంటి చేత్తో మందరాన్ని ఎత్తి పట్టాడు. దాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు.

‘‘తీసుకుని వెళ్ళి క్షీరసాగరంలో జాగ్రత్తగా ఉంచు.’’ ఆజ్ఞాపించాడు. సరేనన్నట్టుగా పర్వతంతో పాటుగా రివ్వున ఎగిరిపోయి, పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచాడు గరుత్మంతుడు. ఇక తాడుగా వాసుకి కావాలి. అందుకని అతన్ని ప్రార్థించారు దేవదానవులు. కరుణించాడు వాసుకి. మందరాన్ని తాడుగా చుట్టుకున్నాడు.‘‘అటూ ఇటూ పట్టుకోండి.’’ అని శ్రీహరి ఆజ్ఞాపిస్తే వాసుకి తల దిక్కున దేవతలూ, తోక దిక్కున రాక్షసులూ పట్టుకున్నారు. సర్పం తల దిక్కున పట్టుకోమని దేవతలను ముందే హెచ్చరించాడు శ్రీహరి. ఆ హెచ్చరికను గమనించిన రాక్షసులు అందుకు ఒప్పుకోలేదు. పైగా తోక దిక్కున సర్పాన్ని పట్టుకోవడం తమకి అవమానంగా భావించారు. దేవతలతో గొడవ పడ్డారు. సర్ది చెప్పాడు శ్రీహరి.


తోక వైపున దేవతలు పట్టుకుంటారన్నాడు. తనతో పాటుగా దేవతలంతా వాసుకి తోకని పట్టుకున్నారు. రాక్షసులు తలని పట్టుకున్నారు. క్షీరసాగరాన్ని మథించసాగారు. మందరపర్వతానికి అడుగున ఆధారం లేదు. దాంతో మథిస్తుంటే పట్టుతప్పి, పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. ఏం చేయాలిప్పుడు? మళ్ళీ తలలు పట్టుకున్నారు దేవదానవులు. శ్రీహరి మళ్ళీ కలుగజేసుకున్నాడు. కూర్మావతారం ఎత్తి పాలసముద్రంలోకి ప్రవేశించాడు. మందరపర్వతాన్ని వీపున ధరించి, లేవనెత్తాడు. తాబేలు ఏమిటి, మందరాన్ని మోయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?! మామూలు తాబేలు కాదది. మహాతాబేలది! దాని వీపు లక్ష యోజనాల విస్తీర్ణం అంటే ఆలోచించుకోండి. అలాంటి వీపు మీద మందరాన్ని మోస్తూ, క్షీరసాగరాన్ని మథించేందుకు దేవదానవుల్లోనూ, మందరగిరినీ, వాసుకునీ ఆవహించి శ్రీహరి బలాన్నీ, ధైర్యాన్నీ కలుగజేశాడు. దాంతో మథనం సులభతరమయింది. ఎప్పుడయితే శ్రీహరి కూర్మావతారం ఎత్తాడని తెలుసుకున్నారో అప్పుడు బ్రహ్మ రుద్రాదులు అది చూసేందుకు అక్కడకు వచ్చారు. చూసి తరించారు. పుష్పవృష్టి కురిపించారు. దేవదానవులు మథిస్తుంటే క్షీరసాగరం అల్లకల్లోలమయింది. అందులోని మత్స్య, కూర్మ, మకరాది జలచరాలన్నీ నలుదిశలా పరుగులుదీశాయి. మథించగా మథించగా ముందుగా హాలాహలం పుట్టింది. పుట్టిన మరుక్షణమే అది దిక్కులన్నిటా వ్యాపించసాగింది. దాన్ని చూసి భ యకంపితులయినారంతా. దిక్కుతోచలేదెవరికీ. పరమశివుణ్ణి ఆశ్రయించారప్పుడు. తపోయోగంలో ఉన్న ఆ మహాశివుణ్ణి స్తోత్రం చేశారు. కళ్ళు తెరిచి చూశాడు శివుడు. అభయాన్ని ప్రసాదించాడు. విషయాన్ని గ్రహించి, విషం తాను మింగుతానన్నాడు. అన్నాడే కాని, అర్థాంగి అనుమతి కావాలన్నాడు. పార్వతిని అడిగాడు. ఆమె అంగీకరించడంతో దిక్కులకు వ్యాపిస్తున్న హాలాహలాన్ని చేతిలోకి తీసుకుని, గొంతులో పెట్టుకున్నాడు. గొంతుని దాటనీయలేదు. గుండెల్లోకి పోనీయలేదు. కారణం చరాచర జీవరాశి అంతా ఆయన గర్భంలోనే ఉంది. హాలాహలాన్ని గొంతును దాటనిచ్చి, గుండెల్లోకి పోనిస్తే జీవరాశి అంతా నశిస్తుంది. అందుకే పోనీయలేదు. గొంతులో హాలాహలాన్ని దాచిన కారణంగా శివుని కంఠం నల్లగా మారింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అన్నారు.సాగరాన్ని మథిస్తునే ఉన్నారు దేవదానవులు. కామధేనువు పుట్టిందప్పుడు. మహర్షులు స్వీకరించారు దాన్ని. తర్వాత ఉచ్చైశ్రవం అని తెల్లటి గుర్రం పుట్టింది. దాన్ని బలి స్వాధీనం చేసుకున్నాడు. ఐరావతం పుట్టింది. దానిని ఇంద్రుడు కైవసం చేసుకున్నాడు. పారిజాతవృక్షం పుట్టింది. అప్సరాంగనలు పుట్టారు. లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవిని చూడగానే దేవదానవులకు ఆమె మీద మనసు పుట్టింది. నన్నంటే నన్ను వరించమంటూ అంతా ఆమె ముందుకొచ్చారు. అందరినీ పరిశీలించిందామె. అందరిలో ఏదో ఒక లోపాన్ని క నిపెట్టింది. శ్రీహరిని చూసింది. అతనిలో ఆమెకు ఎలాంటి లోపమూ కనిపించలేదు. అతన్ని వరించిందామె.
తనని అంత ఇష్టంగా వరించినందుకు ఆమెను తన గుండెల్లో వక్షస్థలం మీద ఉంచుకున్నాడు శ్రీహరి.దేవదానవులు క్షీరసాగరాన్ని ఇంకా మథిస్తూనే ఉన్నారు. ధన్వంతరి పుట్టాడప్పుడు. చేతిలో అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృతకలశాన్ని చూడడం ఏమిటి, ఒక్కదుటన దాన్నందుకుని దానవులు దూరంగా పారిపోయారక్కణ్ణుంచి. పరిగెత్తిపోయిన దానవుల్ని వెంబడించలేక నిస్త్రాణంగా కూలబడ్డారు దేవతలు. ఎంత కష్టపడ్డాం, ఎంత ఆశపడ్డాం, ఫలితం లేకపోయిందనుకున్నారు. శ్రీహరిని వేడుకున్నారు మళ్ళీ. అభయం ప్రసాదించి ఇలా అన్నాడు శ్రీహరి.‘‘అమృతాన్ని మీకు అందజేసే బాధ్యత నాది. అయితే మీరు కూడా మీ శాయశక్తులా దానవులతో పోరాడాలి.’’శ్రీహరి చెప్పడంతో శక్తిని సమకూర్చుకుని దేవతలంతా దానవులపై దాడి చేశారు. అమృతంలో మాకు భాగముందంటూ పోట్లాటకు దిగారు.
వాళ్ళలా కొట్లాడుకుంటుంటే...ముల్లోకాలనూ మోహంలో ముంచేసే విధంగా మోహినీరూపం దాల్చాడు శ్రీహరి. దేవదానవుల ముందు మెరుపుతీగలా వయ్యారంగా నిలిచి కేకేశాడందర్నీ. అమృతాన్ని పంచుకోవడంలో వాటాలు తెగక కొట్లాడుకుంటున్న దేవదానవులంతా ఆ కేకకి ఇటు చూసి, జగన్మోహిని వలలో చిక్కుకున్నారు. అమృతాన్ని పక్కనపెట్టి, నాకంటే నాకంటూ ఆమె కోసం పోట్లాడుకోసాగారు. తప్పు అంది మోహిని. అన్నదమ్ముల మధ్య వైరం కూడదంది.‘‘నాకోసం కొట్లాడుకున్నారు సరే, ముందు ఎందుకు కొట్లాడుకుంటున్నారు?’’ ఏమీ తెలియని దానిలా అమాయకంగా అడిగింది.‘‘ముందు ఎందుకు కొట్లాడుకున్నామంటే అమృతం సమస్యయి కూర్చుంది. దాన్ని మేం పంచుకోవాలి. ఎలా పంచుకోవాలో తెలియడం లేదు.’’ అన్నారు.‘‘మీకు అభ్యంతరం లేకపోతే నేను పంచి పెడతాను.’’ అంది మోహిని.అమృతాన్ని పంచి పెట్టేందుకు ఈమె ఎవరు? అంటూ దేవతలు ఒకరినొకరు చూసుకున్నారు. అనుమానంగా మోహినిని కూడా చూశారు. అప్పుడు వారికి తన అసలు రూపం గోప్యంగా చూపించాడు శ్రీహరి. మోహిని మోహినీ కాదు, శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుని, మనసులోనే ఆ మహాదేవునికి నమస్కృతులు అర్పించి, మిన్నకున్నారు దేవతలు.‘‘ఏమంటారు? నేను మీకు అమృతాన్ని పంచిపెట్టడంలో మీకెవరికయినా అభ్యంతరాలు ఉన్నాయా?’’ రెట్టించింది మోహిని.రాక్షసులతో పాటుగా దేవతలంతా ‘లేదు లేదు’ అన్నారు. అదే అవకాశంగా మోహిని ఇలా అంది.‘‘అయితే ఓ షరతు.’’ ‘‘చెప్పు’’‘‘నేను ఎలా ప్రవర్తించినా మీరు కాదనకూడదు.’’‘‘కాదనం’’ ఒప్పుకున్నారు. అమృతకలశం అప్పగించారామెకు. కలశాన్ని చంకన బెట్టుకుని, వయ్యారాలు పోయింది మోహిని. ఆమె వయ్యారాలకు వంకరలు తిరిగారు దానవులు.అమృతాన్ని స్వీకరించాలంటే అశుచి పనికి రాదు. దాంతో దేవదానవులంతా ఉపవాసం ఉన్నారు. స్నానాలు చేశారు. పంచభూతాలనూ పూజించి, కుశాసనాలు పరచుకుని తూర్పు ముఖంగా బారులు తీర్చి కూర్చున్నారంతా. ఒక వరుసలో దేవతలు కూర్చుంటే మరో వరుసలో దానవులు కూర్చున్నారు. మధ్యలో అమృతకలశాన్ని చంకన ఉంచుకుని మోహిని నిలిచింది. ఎందుకయినా మంచిదని రాహువు అనే రాక్షసుడు, దేవతల వరుసలో కూర్చున్నాడు. దేవతలకి అమృతాన్ని పంచసాగింది మోహిని. దోసిళ్ళతో తాగసాగారు వారు. దేవతలకే ముందు ఎందుకు పంచుతున్నావని దానవులు అడగలేదు. కారణం ముందు చేసుకున్న ఒప్పందం. తానెలా ప్రవర్తించినా కాదనరాదన్నది మోహిని. సరేనన్నారప్పుడు. ఇప్పుడు కాదంటే పద్ధతి కాదని ఊరుకున్నారు దానవులు. చుక్క కూడా మిగలకుండా అమృతాన్నంతా దేవతలకి పంచేసింది మోహిని.
దేవతల వరుసలో కూర్చున్న రాహువు కూడా దోసిట పట్టి అమృతాన్ని జుర్రుకున్నాడు. వాణ్ణి గమనించి, సూర్య చంద్రులిద్దరూ సైగలతో రాహువు సంగతి మోహినికి చెప్పారు. శ్రీహరి ఆలస్యం చేయలేదు, అమృతం కడుపులోనికి చేరకుండా, చక్రాయుధంతో రాహువు శిరస్సును ఖండించాడు. ఖండించినా అమృతం తాగిన కారణంగా రాహువు శిరస్సు అమరమయింది. గ్రహమయ్యాడతను. గ్రహమయ్యి, తన శిరచ్ఛేదనకు కారణమయిన సూర్య చంద్రుల మీద పగబట్టాడు. వారిని మింగుతూ వస్తున్నాడు. అవే సూర్య చంద్ర గ్రహణాలు.అమృతాన్నంతా దేవతలకు పంచిపెట్టి, మోహినీ అవతారాన్ని చాలించాడు శ్రీహరి. నిజరూపం ధరించి, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. జరిగిన మోసాన్ని దానవులు అప్పుడు తెలుసుకున్నారు.

తమ శ్రమంతా వృధా అయిందనుకున్నారు. బాధపడ్డారు. విచారించి లాభం లేదనుకున్నారు అంతలోనే. దేవతలతో యుద్ధానికి దిగారు. భయంకర యుద్ధం జరిగిందప్పుడు. ఆ యుద్ధంలో అమృతపానంతో అమిత బలవంతులూ, అమరులూ అయిన దేవతలు, రాక్షసుల్ని లెక్కకు మిక్కిలిగా చంపి వేశారు. రాక్షసరాజు బలిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో సంహరించాడు. చనిపోయిన వారు చనిపోగా మిగిలిన రాక్షసులు, దేవతలకు భయపడి, రణక్షేత్రం నుంచి పారిపోయారు. ఎక్కడెక్కడో దాగారు.మోహినీ అవతారాన్ని చూసి, జితేంద్రియుడూ, పరమయోగీ, తపోనిష్ఠాగరిష్ఠుడూ శివుడే ఆమె వెంటపడ్డాడని వ్యాసుడు రాశాడు. అదంతా వేరే కథ. అసలు విషయానికి వస్తే సాక్షాత్తూ శివుణ్ణే మోహావేశంలో బంధించిన శ్రీహరి మాయాప్రభావం తెలుసుకోవడం చాలా కష్టం. ఆఖిల ప్రపంచాన్నీ ఆ మాయే నడిపిస్తోంది. దానిని గుర్తించగలిగినవారే గొప్పవారు.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore