Online Puja Services

బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా ?

3.139.233.43

బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా ? 

 

అవును. కానీ కాదు. 
అవును : బుద్ధ అనే పేరుతో శ్రీహరి అవతారం ఉంది.
కాదు : ఆ బుధ్ధ అవతారం కలియుగంలో గౌతమ బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు మాత్రం కాదు. అసలు ఆ అవతారం పేరునే బౌద్ధమతం స్థాపించేముందు బుద్ధుడు పెట్టుకున్నాడు. తెలియనివాళ్ళు 10అవతారాల్లో ఒకడు గౌతమబుద్ధుడు అని కలిపేస్తుంటారు. వాళ్లకు ఇది వివరంగా చెప్పండి.

అసలు శ్రీమహావిష్ణువు కేవలం 10 అవతారాల్లోనే వచ్చాడా ? కాదు. వివరణకై ఇది చదవండి.

ఏక వింశతి అంటే 21 శ్రీమహావిష్ణువు అవతారాలు :

దశావతారాలు ముఖ్యమైనవి అని మనకు పెద్దలు చెప్పారు కానీ పది అవతారాలు మాత్రమే అని కాదు. ఎన్నోసార్లు ఎన్నో యుగాల్లో శ్రీమహావిష్ణువు తాత్కాలికంగా కూడా లోకకళ్యాణార్ధకార్యాలకై భువిపైకి వేంచేశాడు. 
వివరాలు చూద్దాం :

"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్..!!
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే"

ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును
(జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును.
సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.

భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రకారం భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతారాలు దాల్చాడు..
వాటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి ..
దశావతారాలతో ఏకవింశతి అవతారాలు కలవు వాటి గురించి తెలుసుకుందాం..!!

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

మత్స్యావతారము
కూర్మావతారము
వరాహావతారము
నృసింహావతారము లేదా నరసింహావతారము
వామనావతారము
పరశురామావతారము
రామావతారము
కృష్ణావతారము
వెంకటేశ్వరావతారము
కల్క్యావతారము

బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి.
ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.
(బుద్ధుడు అంటే బౌద్ధ మత ప్రబోదకుడైన బుద్ధుడు కాదు)

మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి.
అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి.
ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు.
ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

౧) బ్రహ్మ అవతారము:
దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.

౨) వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.

౩) నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.

౪)నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.

౫) కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.

౬) దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.

౭) యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.

౮) ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.

౯) పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.

౧౦) మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.

౧౧) కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.

౧౨) ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.

౧౩) మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.

౧౪) వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

౧౫) నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.

౧౬) వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.

౧౭) పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.

౧౮) వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.

౧౯) రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.

౨౦) కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.

౨౧) కల్కి అవతారము : కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.

భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.

వరాహావతారం - భూసముద్ధరణం.

సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం

కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం

దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం

సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం

నరనారాయణావతారం - కామజయం

ధ్రువావతారం - ధ్రువపదారోహం

పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం

ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం

హయగ్రీవావతారం - వేదజననం

మత్స్యావతారం - వేద సంగ్రహం

కూర్మావతారం - మందర ధారణం

ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం

వామనావతారం - బలిరాజ యశోరక్షణం

హంసావతారం - భాగవత యోగోపదేశం

మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం

పరశురామావతారం - దుష్టరాజ భంజనం

రామావతారం - రాక్షస సంహారం

కృష్ణావతారం - లోకకళ్యాణం

వ్యాసావతారం - వేద విభజనం

బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం

కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు.
అచిత్తు ప్రకృతి.
ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది.
శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు.

అవి

అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
అంతర్యామి - సకల జీవనాయకుడు.

జై శ్రీమన్నారాయణ ! ఓం నమః శివాయ !!

 
- సిరివెళ్ల నాగరాజస్వామి
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore