Online Puja Services

అయ్యనార్ జననం

3.145.2.184

హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.3.

 
అయ్యన్, అయ్యనారు, కావల్ దైవం,  అనునవి అన్నియు ఒక్కటే అర్థం వచ్చు పేర్లు. వేదములు సైతము భగవంతుని అయ్యా! అని గౌరవింపబడుటచే వెదనాయకుడైన శాస్తా అయ్యన్, అయ్యా అను నామమునుపొందిన వాడయ్యెను. అయ్యన్ అను నామముతో పాటు, మర్యాదపూర్వకంగా ఆర్ ని చేర్చుకొనబడి అయ్యనార్ అంటూ(ఆయ్య గారు) పొగడ బడుచున్నారు. ఇదే రీతిలో కేరళ లో కూడా శాస్తాను అయ్యాన్ + అప్పన్ (తండ్రి) కలిపి అయ్యప్పన్ గా పిలిచినట్లుగా భావించ వచ్చును. 
అయ్యనార్ జననం ఎలా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.(నిన్నటిరోజు చిదంబరం కథను గుర్తుకు తెచ్చుకోండి). 
 
పూర్వము, భూలోకమును "తారుకా వనము" అను ప్రదేశము మిక్కిలి ప్రసిద్ధి గాంచినది. అందు కల మునులు జపతాదులు చేయుటలో మమ్ము మించినవారెవ్వరు లేరు అను అహంకార భావముతో మెలిగెడు వారు. వారి భార్యలను వారికీ ఏమాత్రము తీసిపోని విధముగా, తమను మించిన శీల వతులు లేరని భ్రమతో తిరిగే వారు. ఆ మునులు ఏది  జరిగినా కర్మాను సారము జరుగునే తప్ప అందులకు భగవంతుడు వచ్చి అవతారము దాల్చవలసిన అవసరము లేదన్నియు, దైవం యొక్క అవకశ్యత లేనే లేదు అని తలంచుతూ హరుడు, హరి ని పూజించడం మానుకున్నారు. అహంకారం పరాకాష్టకు చేరుకున్నది. ఇది గాంచిన పరమేశ్వరుడు వారికి దైవలీల, అవకశ్యతను తెలుపుటకు, హరి యొక్క సహాయమును అర్థించెను. 

ఒకనాడు వారిరువురును దారుకావనం ప్రవేశించిరి. మోహిని రూపమున విష్ణువు ఆ మునుల చెంత చేరి వారిని తన విష్ణు మాయతో ఆకర్షితుల గావించుకొనెను. అనుకున్నట్లుగానే మునులు మోహిని రూపలావణ్యములకు  అచ్చెరువొంది ఆమె వెంట బడ్డారు. వారు ఉచ్చరించు మంత్రముల మరచిరి. యజ్ఞ యాగాదులు నిలిపి వేసి అలక్ష్యవైఖరిలో మోహినియే తమకు సర్వస్వమను బ్రాంతికి లోనైనారు. 
మరొక్క వైపు శివుడు ఒక అందమైన బిక్షువుగా మారి ఋషి పత్నులు ఉన్న చోటున, వీణ ను మీటుతూ, దేవగానము అలాపించుతూ ఇంటిoటికి పోయి భిక్ష అడుగసాగెను. అతడి సోయగములను గాంచిన ఋషిపత్నులు రెప్ప వేయుట మాని భిక్షువు పట్ల ఆకర్షితులైనారు. మొహావేశమున తమ ఒంటిపై దుస్తులు, ఆభరణములు స్థాన భ్రంశము చెందుట కూడా పట్టించుకొనక ఉన్మత్తులై భిక్షువు వెంట పడినారు.

ఇది గాంచిన మునులు ఇదంతయు భిక్షువు యొక్క పన్నాగమని, మోహిని భిక్షువుకు తోడు అని అభిచారహోమము చేసి వివిధ రకములుగా భిక్షువు పై పయోగములు చేసినారు. అన్నియు విఫలములు కాగా, ఋషులకు జ్ఞానోదయము కలిగినది. ఇదంతా దైవలీల అని గ్రహించారు. భిక్షువు ఎవరోకాదు సాక్షాత్తు శివుడే అని తెలుసుకొని ఆయన పాదాలు ఆశ్రయించారు. అంత పరమేష్టి వారికి తనపై ప్రయోగించిన ఆయుధములను ఆభరణములుగాను, వస్త్రములుగాను ధరించి నటరాజ స్వామిగా వారి ముందు ప్రత్యక్షమైనాడు. 

అంత ఋషి పుంగవులు తాము చేసిన నెరములకు సిగ్గుతో ఎలుగెత్తి  "కైలాసవాసా! హర హరా పాహిమాం పాహిమాం, మాతప్పులను మన్నించి, మమ్ము కాపాడుము లేకున్న మీ పాదకమలములు విడువము" - అంటూ ప్రాధేయ పడ్డారు. భోళా శంకరుడు వారి ప్రార్థనలకు కరిగి పోయి, ఋషిపుంగవుల్లారా! మీకు కనువిప్పు కలిగించుటకే మేము ఇరువురం ఈ నాటకం ఆడితిమి. మీలోని ధైవం కన్నా  కర్మ అన్న భావం తొలగించి మిమ్ము మామార్గమునకు రప్పించితిమి. ధర్మము తప్పక ఇక మీ మీ తపజపాదులు కోన సాగించండి"- అని సెలవిచ్చెను.

ఈశ్వరుని అనుసరించిన మోహిని రూపదారి విష్ణువు, శివుని జూచి, హరా! శీలవతులైన ఋషి పత్నులనే మోహింప చేసిన నీ సుందర రూపము చూడ మనస్సు ఉవ్విళ్లూరుచున్నది. ఒక్క మారు ఆ భిక్షువు రూపము చూపుము - అని కోరెను. వల్లే- అని శంకరుడు తిరిగి భిక్షువుగా మారెను. ఆ సుందరరూపమును చూచిన మోహినికి సైతము మోహము పుట్టెను. 

పరమేశ్వరా! మీ సుందరరూపుము చూచిన క్షణమే,  మోహిని రూపు దాల్చిన నాకు సైతము మోహము కలుగుచున్నది. శివశక్తి లోని ఒక స్వరూపమే నేను, మీరు హరుడైన నేను హరిని అనెను.    అంత హరిహర సంగమ ఫలితముగా లోకమును ఉద్ధరించ స్వయముగా పరబ్రహ్మస్వరూపమే ఒక ఉత్తమునిగా అవతారము దాల్చ బోతున్నదని గ్రహించిన, పరమశివుడు మోహిని యొక్క తాపము తీర్చెను. ఇవ్విధముగా ఈ పావన ధరణి పై  హరిహర పుత్రుడొకడు అవతారము దాల్చి, జనియించెను. తమిళులు ఆయనను అయ్యనార్ అని అంటారు.మాసాత్తనార్ అనికూడా అంటారు. తమిళ ఉద్గ్రంధమైన "సిలప్పదిగారం" ఈ విషయం రూఢిగా చెబుతున్నది.

*********** 

హరి హర సంగమము, బాలుని జననం,మరొక గాథ. ఈశానుడు అను రాక్షస రాజుకు శ్రీపద్ముడు  అను ఒకకుమారుడు ఉండెను.   శివుని - తపోనిష్ఠతో మెప్పించి, తాను ఎవరి తలపై చేయి పెట్టిన వారు భస్మముగు నట్లు శివునిచే వరము పొంది, ఆ వరము యొక్క ఫలితమునెఱుంగ శివునిపై ప్రయోగించ ప్రయత్నిoచగా , వెరచిన శివుడు పారిపోయి ఒక స్వర్ణ గన్నేరుకాయలో దాగి ఉండెను. ఈశ్వరుని కానక వెతుకు, అతని ముంగిట మోహిని రూపమున విష్ణువు ప్రత్యక్షమై తన ఆటపాటలతో వాడి చెయ్యి వాడి తల పైనే  పెట్టించి భస్మీ పటలము గావించెను. ఆవిధముగా శ్రీపద్ముడు భస్మాసురుడుగా పెరు గాంచెను. 

స్వర్ణ గన్నేరు కాయలో దాగిన శివుడు బయటకు వచ్చి మోహిని రూపదారి విష్ణువును గాంచి స్తుతించి, ఆమె పట్ల ఆకర్షితుడై మొహావేశము ఉప్పొంగ ఆమెను ఆలింగనం చేసుకొనెను. వారి సంగమ ఫలితం... లోకొద్దరణ గావించు భూతనాథుడు ఆవిర్భించెను.  

*********

పరంజ్యోతి స్వరూడైన శాస్తా లీలలు మానవ మాత్రులమైన మన ఊహలకు అందనివి. శాస్తా యొక్క అవతార మహిమలు పలు చరితములు పలు విధములుగా వివరించు చున్నవి. అవి 1. అమృతమధనమోహిని. 2. శాస్త్రు ఉద్భవము.3. లలితోపాఖ్యానము. ఇవి గాక పాద్మము, శైవపురాణము. ముఖ్యముగా భూతనాదోపాఖ్యానము.

దారుకా వనమున జరిగిన వృత్తాoతము  తెలియజేయునది 
శ్యుతపురాణము అను వళ్లువర్  మహాత్యము, "కాడంతేత్తి మహాశాస్తా "పురాణము" వంటి గ్రంధముల ఆధారంగా.  తెలియునగును. 

పై వన్నియు వేరు వేరు కల్పములలో  జరిగినవి. పురాణకర్తలు తమ దివ్యధ్రిష్టితో వారు గాంచినవి వ్రాసి వున్నారు. అంత మాత్రము చేత అవన్నియు  సత్య దూరములు అనుట మనలాంటి వారికి దుస్సాహసమే అని అనవచ్చును. 
 
పరబ్రహ్మస్వరూపుడైన మహశాస్తా  ఒక్కొక్క కల్పమున ఒక్కొక్క హరిహర పుత్రునిగా జన్మించారని తెలియ వచ్చు చున్నది. అదేవిధముగా వినాయక జననం, సుబ్రహ్మణ్యుడి జనన విశేషములుకూడా వేరు వేరు గా నుండుట మనం మరువరాదు. 
 
విజ్ఞాపన:- పై విషయములపై ఎటువంటి తర్జనభర్జనలు చేయరాదు. మీకిష్టమున్న చదివి గుర్తు పెట్టుకొనండి లేకున్న ఒక నవల చదివి మరచి పోయినట్లు ఉండండి. లేదా చదవనే చదువు లేదను కొనండి.
 
 శ్రీధర్మశాస్తా వే శరణం     
  శరణం శరణం ప్రబద్దే!
 
సేకరణ
ఎల్.రాజేశ్వర్
 
 

 

 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore