Online Puja Services

చిత్రగుప్తుడికి చెందిన గూఢచారుల గురించి విన్నారా ?

3.147.205.154

చిత్రగుప్తుడికి చెందిన గూఢచారుల గురించి విన్నారా ?
లక్ష్మీ రమణ 

శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి నరకం గురించి , యముడు, ఆయన పరివారాన్ని గురించి అక్కడి శిక్షల గురించి అనేకమైన విశేషాలని వివరించారు . అదే మనకి గరుడ పురాణంగా లభ్యం అవుతూ ఉంది . ఇందులో నరకలోకం గురించిన పూర్తి వివరాలు పొందుపరచబడి ఉన్నాయి . యమధర్మ రాజు ఎలా ఉంటాడు? అసలు చిత్రగుప్తుడు ఎవరు?ఆయన పనేమిటి?మరణానంతరం మనతో పాటు వచ్చేవి ఏవి? వంటి విషయాలన్నీ ఇందులో వివరించబడ్డాయి . ఇందులోనే  చిత్రగుప్తునికి సంబంధించిన గూఢచారి వ్యవస్థని గురించి కూడా వివరించారు . ఆ విశేషాలు తెలుసుకుందాం . 

శ్రీ గరుడ పురాణంలోని మూడవ అధ్యాయము లో శ్రీహరి గరుడునికి యమపురంలో ప్రవేశించిన జీవులు అనుభవించే నరక బాధలు వింటే నువ్వు భయపడతావు అంటూనే, వివరిస్తారు . ఆ వివరణలో బహుభీతి పురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంది. అక్కడ నరక బాధలు అనుభవించే పాపుల హాహాకారాలు వింటూనే ప్రేత ఏడుస్తాడు. యమపురంలో భటులు ఆ ఏడుపు విని,దక్షిణద్వార కావలి వాడు అయిన ధర్మధ్వజుడనే వానితో’ పాపాత్ముడు వచ్చాడు’ అని చెప్తారు.

అలా నరకద్వారందాకా వచ్చిన  జీవుడు తన వెంట తెచ్చేది ఏదీ ఉండదు . తానూ చేసిన పాపంలో భాగం పంచుకునే వారు ఎవరూ ఉండరు . ఎవరికోసమైతే, ఎవరి సుఖం కోసమైతే అతను పాపకర్మములు చేసి , నరకద్వారాన్ని చూడాల్సివచ్చిందో , వారెవరూ ఊదా అతని పాపాన్ని పంచుకోరు . కానీ , పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. 

యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రాగుప్తునకు పాపి వచ్చాడు అనే సమాచారం చేరగానే,అతడా విషయాన్ని యమధర్మ రాజుతో చెప్తాడు. యమధర్మ రాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులో౼ ఎవరు మహాపాపాత్ములో తెలుసు! అయిన చిత్రాగుప్తుడిని అడుగుతాడు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడే ! అయినా ఆయన తన బంట్లయిన  శ్రవణులని అడుగుతాడు.

మనం చెప్పుకునే, ఈ శ్రవణులే , చిత్రగుప్తుని చారులు . వీరు  బ్రహ్మ పుత్రులు. ఆ మాటకొస్తే, చిత్రగుప్తుడు కూడా బ్రహ్మ పుత్రుడే ! వీరు స్వర్గలోక,మనుష్య లోక,పాతాళ లోకాల్లో ఎక్కడైనా ఏ ఆటంకం లేకుండా సంచరించే వాళ్ళు. దూరశ్రవణ౼దూరదర్శనాది విద్యలున్నవారు. వీరి భార్యలు అలాంటి వారే. వీరిని శ్రవణీ అంటారు. వీరు ముల్లోకాల్లో ఉన్న స్త్రీ చేష్టలను బాగా గమనించగలరు.ఈ శ్రవణీ౼శ్రవణులు ప్రత్యేకంగా ౼ పరోక్షంగా జీవులు ఏయే పాపాలు చేశారో,  చిత్రాగుప్తునకు చెప్తారు. 

యమధర్మరాజు కు గూఢచారి వంటి వారైన ఈ శ్రవణులుకు మనుషుల త్రికరణ శుద్ధి తో చేసిన పాపాలన్నీ తెలుస్తాయి .  వీరు యదార్ధావాదులు. దాన వ్రతాధి పుణ్యకర్మలు చేసినవారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే , సత్యవాదులు అయిన వీరివల్ల పాపుల చరిత్ర కూడా యమునికి తెలిసిపోతుంది . జీవులు  చేసే సమస్త కార్యాలు కనిపెట్టడమే వీరి పని. సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి ౼ నీరు, రాత్రింబగళ్లు ౼ రెండు సంధ్యల ధర్మము ౼ మానవుని ప్రవర్తన వీరు తెలిసి ఉంటారు .  ధర్మరాజు, చిత్రాగుప్తుడు, శ్రవణులు తదితరులు  అణుక్షణంకూడా జీవులు చేసేటటువంటి  పాపపుణ్యములను లెక్కగడుతూ ఉంటారు . 

యముడు ఇలా శ్రవణ, చిత్రాగుప్తాదుల సహాయం వల్ల మనుషుల పాపాపుణ్యములు తెలుసుకుని వారిని పిలిచి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఆతర్వాత వారికి ఉచితమైన శిక్షలు విధిస్తాడు . ఆ విధంగా శ్రవణి, శ్రవణులు చిత్రగుప్తునికి నమ్మిన బంట్లుగా గూఢచారులుగా ఉంటారు . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore