Online Puja Services

కార్తీక పురాణము - ఏడవ అధ్యాయము

3.15.6.77

ఓం నమః శ్శివాయ 
కార్తీక పురాణము , ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము
సేకరణ: లక్ష్మి రమణ 

వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు .  ’ ఓ జనక మహారాజా! విను.  కార్తీక మహాత్మ్యమును  ఇంకా వివరిస్తాను . ప్రసన్న చిత్తుడవై విను. కార్తిక మాసములో  ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో ,  వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది .

 ఈ మాసములో భక్తితో, తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ , చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు.
కార్తీక మాసములో  భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి . వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా  చేయజాలడు   .

  కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసలో  బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాని మహాపాతకములన్నీ నశిస్తాయి . బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందగలడు .

        కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయములో  మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకుతుంది . శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి, పూజించిన వానికి  వైకుంఠములో  చిరకాలవాసము కలుగుతుంది . ఈ కార్తీక మాసములో  ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందగలరు .

         హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి వెళ్ళగలరు . ఈ మాసము స్నానము చేసి, తడిబట్టతో ఉన్నవానికి వస్త్రదానము చేసినవాడు  పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్నిపొందుతాడు .

            కార్తీక మాసములో విష్ణువుయొక్క ఆలయ శిఖరముపై  ధ్వజారోహణము చేసిన వాని  పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి లాగా నశించి పోతాయి . ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజిస్తే , పదివేల యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది . ఈ మాసములో బృందావనముని  ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలు కాగలదు .

         కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలాన్నీ వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అంటే, ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులలో  సమర్పించే  దీపము).  ఈ నందాదీపము ఆచరించని వారు  వ్రతభ్రష్టులనిపించుకుంటారు .  కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించాలి .  కార్తీక మాసములో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.

            కార్తీక మందు విష్ణ్వాలయములోని  మంటపంను  భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందగలరు . ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లలాగా  నశిస్తాయి . తులసీ గంధముతో సాలగ్రామమును పూజించినవాని పాపములు దద్గమై ,  విష్ణులోకాన్ని చేరగలడు.

          హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసినట్టయితే, పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశిస్తాయి . ఈ మాసంలో భక్తితో అన్నదానమాచ రించువాని పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బులలాగా తేలిపోతాయి . 

           కార్తీక మాసములో తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అనే  నాలుగు ధర్మములు ఆచరించాలి . ఈ మాసములో  దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడవుతాడు . స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మించి  తరవాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తాడు .

              కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన వారు  సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు చేరుకుంటారు . మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మిస్తాడు .  ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన వారు  సూర్యమండలమందు చిరకాలవాసి కాగలడు . అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.

         స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందులో  హరిని పూజించినట్టయితే,  పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు . ఈ మాసంలో ఆదివారం స్నానం చేసినట్టయితే, మాసమంతా స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది .

          ఈ మాసములో  శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసములో  నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశిస్తాయి 

        ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు కూడా ఏ సందేహములేకుండా నశించిపోతాయి .  ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు . ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు .

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ  మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha