Online Puja Services

కాశీ-రామేశ్వరం సంపూర్ణ యాత్ర ఎలా చేయాలి ?

3.14.70.203

కాశీ-రామేశ్వరం సంపూర్ణ యాత్ర ఎలా చేయాలి ? దీని విశిష్టత ఏమిటి ? 
సేకరణ 

కాశీ యాత్ర మహాపుణ్యం అని చెబుతారు. కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళి, తిరిగి కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే అది ' సంపూర్ణ కాశీ యాత్ర ' అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి విధి విధానాలు ఉన్నాయి. ముందు కాశీ వెళ్ళి అక్కడ గంగాజలంతో విశ్వేశ్వరుని అభిషేకము చేయాలి. ఆ తర్వాత కాశీలోని గంగాజలంతో రామేశ్వరం లోని ఈశ్వరునికి అభిషఏకము చేయాలి.ఆ తర్వాత రామేశ్వరం లోని ఇసుక తీసుకొని తిరిగి కాశీ వెళ్ళి శివునికి అభిషకం చేయాలి.ఇలా చేస్తే దీనిని సంపూర్ణ తీర్ధయాత్ర అంటారు. పెద్దలు చెప్పిన ప్రకారం ఈ దివ్యమైన యాత్రని ఎలా చేయాలో పరిపూర్ణంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం . 

యాత్రా విధానం

మొదట వారణాశికి  వెళ్ళాలి. అక్కడ గంగలో స్నానం చేసి, కాశీ విశాలాక్షిని, విశ్వనాధుణ్ణి దర్శించాలి. కాశీ క్షేత్రంలో  9 రోజులు నిద్ర చేయడం విధి అని చెబుతారు. ఇది హడావుడిగా ఒక్క రోజులో పూర్తయ్యే యాత్ర కాదు అని గుర్తుంచుకోవాలి .  పవిత్ర గంగా నది జలం, గంగా మృత్తికని సేకరించాలి. ఈ రెండింటినీ భద్రపరచుకొని, రామేశ్వర యాత్రకి ఉపక్రమించాలి . 

అక్కడ రామేశ్వర తీర్థంలో రామేశ్వర లింగాన్ని దర్శించాలి. కాశీ నుంచి భద్రంగా తీసుకువచ్చిన  గంగా జలాలతో స్వామికి  అభిషేకం చేయాలి . ఇక గంగమ్మ ఒడి నుండీ సేకరించిన మట్టిని రామేశ్వరంలోని  సముద్రంలో నిమజ్జనం చేయాలి . ఇందులో ఏ ప్రకృతీ పురుషుల సమాగమం నిబిడీకృతమై ఉన్నదో మరి . ఇదొక గొప్ప సంప్రదాయంగా మన పెద్దలు అనుగ్రహించారు . 

రామేశ్వరంలో సముద్ర స్నానం ఆచరించాలి. రామేశ్వర స్వామి ఆలయంలో  21 బావులు ఉంటాయి . వీటిల్లో దంపతులు స్నానాలు చేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో స్త్రీలు చేసిన అపచారాలు తొలగి పోతాయని నమ్మిక.

ఇంతటితో కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది అనుకుంటే పొరపాటే.  ఇప్పుడు అమ్మని అయ్యకి చేర్చినట్టే, తియ్యని అమ్మ ఒడికి చేర్చాలి . చూడండి ,  రామేశ్వరం సముద్రంలో నుండీ  ఇసుక, మట్టి సేకరించి భద్రపరుచుకొని తిరిగి వారణాశి చేరాలి. అక్కడ గంగానదిలో స్నానం ఆచరించి ,  ఇసుకను, మట్టిని గంగలో కలపాలి. 

ఇలా చేస్తే, యాత్ర కాశీ సంపూర్ణ యాత్రగా పరిగణించబడుతుంది . అయితే, ఈ యాత్రంతా ముగించుకొని ఇంటికి వచ్చాక, స౦తర్పణ చేయాలి. ఇందులో భాగంగా కాశీ క్షేత్రపాలకుడు, మన శరీరమనే క్షేత్రాన్ని రక్షించే భైరవ స్వరూపుడు, కాలభైరవ పూజ, గంగపూజ చేయాలి. గారెలు వండి, దండగా గుచ్చి, కాలభైరవుని ( కుక్క ) మెడలో వేయాలి.

సంపూర్ణ యాత్ర చేసిన వారికి కుటుంబ సభ్యులు ఎదురేగి, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు . బిడ్డలుగానీ, చిన్నవారు గానీ కాళ్ళు కడిగి, పాదపూజ చేయాలి. ఇలా ఎదురేగి, స్వాగతం చెప్పడం మన సంప్రదాయం.  పూర్వం అడవులు దాటుకుని, ప్రయాస పడి కాశీ యాత్ర చేసేవారు. అలా వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకం వుండేది కాదు. అందుకే  ' కాశీకి పోయిన వాడూ, కాటికి పోయిన వాడూ ఒకటే! ' నానుడి కూడా పుట్టింది . 

ఇలా చేస్తే, కాశీ యాత్ర సంపూర్ణమవుతుంది . శుభం భూయాత్ !! 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda