Online Puja Services

కుబేరునికి ఇష్టమైన ఆకుపచ్చని కుంకుమ గురించి విన్నారా ?

3.19.30.232

కుబేరునికి ఇష్టమైన ఆకుపచ్చని కుంకుమ గురించి విన్నారా ?
-లక్ష్మీ రమణ 

                                 మన భారతదేశంలో "పసుపు-కుంకుమ"లను మంగళకరమైనవిగా, 'సౌభాగ్య'చిహ్నాలుగా పవిత్రంగా భావిస్తారు . వాటికి హిందూ సంప్రదాయం అత్యంత ఉన్నతమైన స్థానాన్ని , గౌరవాన్ని కట్టబెట్టింది . ఎందుకంటె, అవి స్వయంగా ఆ దేవీ స్వరూపాలు కాబట్టి . ఏశుభకార్యానికైనా మనం ముందుగా సిద్ధం చేసుకునేవి పసుపు , కుంకుమలే కదా ! 

పసుపులో పచ్చి పసుపు , కస్తూరి పసుపు,  ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు,అని పలు రకాలున్నాయి. అలాగే కుంకుమలో కూడా పలు రకాలు వున్నాయి.    ఎరుపు, ముదురు ఎరుపు,సింధూరపు రంగు, మీనాక్షీ  కుంకుమ( ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.)మొదలినవి.  

వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ గురించి ఎప్పుడైనా విన్నారా ?  దీనినే "కుబేరపచ్చ కుంకుమ" అంటారు . ఈ కుబేరపచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది. పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ, 'కుబేరునికి చాలా  ప్రీతికరమైనది' . అలాగే, ఇది 'పార్వతీదేవి'కి ప్రీతికరమైన రంగు కూడా. 

ఈ 'కుంకుమ' విశిష్టతని గురించి శివపురాణం యిలా వివరిస్తుంది. 

పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడట. అక్కడ ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడట. ప్రతిరోజూ, దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు 'అంబిక' ను దర్శించగానే,  కామవికారం కలిగిందట . రావణాసురుడికి అన్నకదా ! ఆ మాత్రం ఇంద్రియ భావనలు కలగడంతో ఆశ్చర్యం లేదేమో ! తమ్ముడేమో , ఆ పరమేశ్వరుడిని అమ్మని ఇచ్చేయమని అడిగాడు , అన్నగారేమో , వక్రబుద్ధితో , ఒక్క క్షణం 'పార్వతీ దేవి'ని, తన భార్యగా ఊహించుకున్నారు . 

'సర్వజ్ఞాని' అయినా సర్వేశ్వరునికి, ఇది తెలియకుండా ఉంటుందా ? పరమేశ్వరునికి  కోపం వచ్చింది ! శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది . ఒక్క క్షణం శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు. ఆ చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట ! కుబేరుడు గడగడా వణికి పోయాడు. పరమశివుని కాళ్ళ మీదపడి,మన్నించమని వేడుకున్నాడు . 

మా ఇద్దరి కోపం వలన  ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది. అప్పుడు, ఆ చల్లదనమే  నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది అని  పరమేశ్వరుడు  కుబేరుని, అనుగ్రహించారట . 

స్వామి అనుగ్రహంతో స్వస్థత చేకూరినా ,  కుబేరునికి , శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్ష గా, మచ్చలు శాశ్వతంగా వుండిపోయాయట. 

పరమేశ్వరుని కంఠం చుట్టూ నీలం వర్ణం, పార్వతీ దేవిది  పసిమి ఛాయ {అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చి నప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది .  ఆ స్వర్ణకాంతివంతమైన  తన దేహానికి పసుపు నలుగుపెట్టి, ఆ వచ్చిన పసుపుతో  వినాయకమూర్తిని  చేయడం మనకు  తెలుసు}. ఆ స్వామి నీల వర్ణం, ఆ తల్లి పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు, ఒక అద్భుతం  జరిగిందట.  ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా 'ఆకుపచ్చ రంగు’లోకి మారి పోయిందట !
{నీలం....పసుపు  రంగులను మిశ్రం చేస్తే, ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది కదా } 

కుబేరుడు ఆ 'ఆకుపచ్చ మట్టి'ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహంనుండి విముక్తి పొందారట. అంతే కాకుండా,

ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీరానికి ధరించేవాడట. అలా కుబేరునికి ఈ పచ్చ కుంకుమ ప్రీతిపాత్రంగా మారిపోయిందని ఐతిహ్యం . ఇదే 'పచ్చరంగు కుంకుమ' కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకునేందుకు కారణమయ్యింది .  

కుబేర కుంకుమతో పూజిస్తే, ఆ కుబేరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది . ఆ ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండిత వచనం . 

శుభమస్తు !!

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha