Online Puja Services

శ్రీ లలిత అమ్మ ఆవిర్భావం

3.146.221.52

లలితా సహస్రనామం ఎలా పుట్టింది...తెలుసా....?

అమ్మవారు వశిన్యాది దేవతల ద్వారా చెప్పినటువంటి సహస్రనామం లలిత సహస్రనామము.

లలిత సహస్రనామము వెనుక చాల పెద్ద నేపధ్యము వున్నది.

శివ మహా పురాణాంతర్గతముగా తారకాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు, పార్వతి పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. అప్ప్పుడు మన్మధుడు పార్వతి దేవి యందు అనురక్తిని కలిగించేటందుకుగాను పరమేశ్వరుని మీదకు పుష్పబాణములను విడిచిపెట్టాడు.

క్రుద్ధుడు కోపోద్రిక్తుడు అయినటువంటి పరమశివుడు తన మూడో కన్నును తెరిచాడు. ఆ మూడో నేత్రములోనించి వచ్చిన అగ్ని జ్వాలలలో మన్మధుడు దహించుకు పోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఏదైతే అనుకుని దేవతలు మన్మధుని పంపించారో ఆ కార్యము జరగలేదు సరి కదా అనుకోనటువంటి హఠాత్పరిణామము సంభవించింది. పరమేశ్వరుని మీద మన్మధ బాణములు పడితే పార్వతి పరమేశ్వరులయందు అనురాగము కలుగుతుంది పొందురులకు అని దేవతలు మన్మధుని పంపితే అక్కడ మన్మధ దహనము జరిగింది. దానితో దేవతలందరు బాధతో ఆ భస్మ రాశిని అక్కడే వదిలి వెళ్లిపోయారు.

భండుని జననము:-

ఒక్కొక్క సారి జరిగినటువంటి కార్యములు కాకతాళీయములు కాదు. ఎక్కడో భగవంతుని సంకల్పము ఉంటుంది. ఆ భస్మరాశి ఉన్నటువంటి ప్రదేశానికి చిత్ర కర్మ అని పిలవబడే గణపతి (గణములకు నాయకుడు) వచ్చాడు. ఆయన ఆ తెల్లని భస్మరాశిని చూసి ఒక బొమ్మ చేస్తే బావుంటుంది అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ చిత్ర కర్మ ఒక అందమైన బొమ్మను ఆ బూదితో తయారు చేసాడు. ఆయనకు ఆ బొమ్మ చాల అందముగా కనిపించింది. ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. అప్పుడు అందులోనించి ఒక వ్యక్తి లేచాడు. ఆ బూది పరమశివుడు కోపముతో మూడో కంటిని తెరిచినప్పుడు మన్మధుడు భస్మమైనటువంటి బూది. ఆ బూది నించి తయారు అయిన వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడి వున్నాడు. అలంటి ఆ వ్యక్తిని చూసిన చతుముఖ బ్రహ్మగారు "భండా భండా" అని పిలిచారు. అంటే ఆ వ్యక్తికి అనుకోకుండానే నామకరణం జరిగింది. అప్పటినించి ఆ వ్యక్తికి భండాసురుడు అంది పేరు స్థిరపడిపోయింది.

భండుని ప్రవృతి:-

అసురుడు ఆయనకు బ్రహ్మగారు పెట్టిన పేరు కాదు. బ్రహ్మగారు పెట్టింది భండా అని. ఆ వ్యక్తి చేసినటువంటి చేష్టలు వలన రాక్షసుడు అయ్యాడు. ఈ భండాసురునితో ఇంకో ఇద్దరు సోదరులు కూడా జన్మించారు. వారు విశుక్రుడు మరియు విషంగుడు. భండాసురునికి ఒక వరం ఈశ్వరుని నించి వచ్చింది. ఈ భ్రహ్మాండములో వున్నవారు ఎవరైనా సరే తనముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం భండాసురునికి వెళ్తుంది. ఆ వరప్రభావంతో, ఈ ముగ్గురు కలిసి లోకములన్నింటిని బాధపెట్టడం మొదలుపెట్టారు. దానితో రాక్షసులు అందరు కలిసి భండాసురుని నాయకుడిగా ఎన్నుకుని మూర్ధాభిషిక్తుడిని చేశారు.

భండుని భోగము:

ఈ ముగ్గురు అపారమైనటువంటి శక్తివంతులు. శక్తీ వుంది కాబట్టి వారు భోగములు అనుభవిస్తూ లోకములో మరియెవ్వరును భోగము అనుభవింపకుండా చూసేవారు. అదే రాక్షస ప్రవృత్తి. శరీరములో బలమువున్నప్పుడు భగవంతుని చేరుకునే ప్రయత్నము ఎవరు చేస్తారో వారు ఈశ్వరానుగ్రహము వున్నవారు. శరీరములో బలము ఉండగా అది కేవలము భోగమునకే వాడుకొనేవాడు వచ్చే ఆపదని చూసుకోలేకపోతున్నాడు. కాలము వెళ్ళిపోతోంది అని తెలుసుకోలేకపోతున్నారు.

ఈ భండాసురునికి నలుగురు భార్యలు :- సమ్మోహినీ, కుముదిని, చిత్రాంగి, సుందరి.

ఆ నలుగురు భార్యలతో పరమ సంతోషంతో కాలం గడుపుతున్నాడు. ఒక రోజు ఆ ముగ్గురు రాక్షసులు ఒక చోట సమావేశమయ్యారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ సంభాషణని మన ప్రతి నిత్యముతో అన్వయించుకోవాలి. భండుడు మన అందరిలోనూ వున్నాడు అనుకోవాలి.

వారు సుఖములను ఎందుకు అనుభవించాలి?

ఎలా పుట్టామో మనకే తెలియదు. మనం సుఖ భోగాలను అనుభవించామంటే బావుంది. మనని ఆశ్రయించిన వాళ్ళు సుఖాలని భోగాలని అనుభవించారు అంటే కూడా బావుంది. మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు కొంతమంది వున్నారు ఈ బ్రహ్మాండంలో. వారు యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, గాంధర్వులతో మొదలుపెట్టి మనుష్యులతో కుడి ఎన్నో జాతులు వున్నాయి. మన నాయకత్వముని అంగీకరించని వారు సుఖములను ఎందుకు అనుభవించాలి? భండుడు మనలోకూడా వున్నాడు. ఒక్కొక్కసారి ఈ భావం మనలోకూడా వస్తూ ఉంటుంది.

భండాసురుని ఆలోచన:-

సృష్టి లో బహుశా ఎవరు చెయ్యని ఆలోచనని భండాసురుడు చేసాడు. మన ముగ్గురం అన్ని లోకాలకు సూక్ష్మ శరీరాలతో వెళదాం. వెళ్లి అక్కడ పురుషులకు పుంసత్వం లేకుండా చేద్దాం అలానే స్త్రీలకూ రసోత్పత్తి లేకుండా చేద్దాం. అప్పుడు పురుషునికి పురుష సహజమైనటువంటి స్త్రీలకు స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ ఉండదు. అప్పుడు మనసుకు సంతోషం ఉండదు. ఆ సంతోషం కొరవడిన నాడు లలిత కళలు నశిస్తాయి. సంగీతం వినరెవ్వరు. నాట్యం చూడరు. అందరు నీరస పడిపోతారు. అప్పుడు ఎక్కడ ఏమి జరగవు. భోగేచ్ఛ లేనప్పుడు ఉత్పత్తి ఉండదు. అప్పుడు ఆ జాతులు తమంతట తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకి దేవతలు, మనుష్యులు, జంతువులు అందరు నశించిపోతారు. కేవలం రాక్షసులు మాత్రమే మిగులుతారు.

భండుని కార్యాచరణ:-

అనుకున్నదే తడవుగా ఆ మువ్వురు అన్ని లోకాలకు వెళ్లి పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు. స్త్రీలయందు రేతస్సు లేదు. అది లేని నాడు సమస్త జాతులు నీరసించి పోయాయి. ఆఖరికి రసాతలం లో వుండే సర్పజాతి కూడా పడగలు ఎత్తడం మానేశాయి. సంతోషం లేదు. ఎవరికీ కూడా మనము ఎందుకు ఇలా వున్నాము అని ప్రశ్న వేసుకునే ఉత్సాహం కూడా లేదు. జాతులు నశించిపోవడం ప్రారంభం అయిపొయింది. అన్ని లోకములలో రాక్షస గణాలు పెరిగిపోతున్నాయి. భండాసురుని నాయకత్వం వర్ధిల్లసాగింది.

రసఎవ పరం భ్రహ్మ రస ఎవ పరాగతిహి
రసోహి కాంతిధపుంసాం రసో రేత ఇతి స్మృతః

యుద్ధం లేకుండా భండాసురుడు అన్ని లోకములలో కామ ప్రళయాన్ని సృష్టించాడు.

ఇది లలిత సహస్రనామమునకు నేపధ్యం. 
అమ్మ ఆవిర్భావానికి కారణం.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore