Online Puja Services

లలితా పారాయణ మహిమ

3.145.156.46

లలితా పారాయణ మహిమ

చాలా కాలం క్రితం జరిగిన ఒక యదార్ధ సంఘటన. 

 తమిళనాడులో ఒక సంపన్న కుటుంబం ,బోలెడంత ఆస్థి.  చాలా కాలంగా సంతానం లేని వారికి వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఒక ఆడబిడ్డ కలిగింది.  వారి పూజ ఫలం అనుకుని ఆనందంగా ఉన్నారు.  ఆ అమ్మాయికి 20 సం వయసు ఉంటుంది.  ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.  తను ఎందుకు అలా చేస్తుందో తనకే తెలియదు అని ఏడుస్తుంది.  ఉన్నట్టుండి అరవడం, జుట్టు పీక్కోవడం, సామానులు పగలగొట్టడం, అన్నం తినకపోవడం, ఒక వేళ తిన్నా ఎంత తింటుందో తెలియకుండా తింటుంది.  డాక్టర్స్ కి చూపించారు.  అన్ని టెస్టులు నార్మల్  గా ఉంది అన్నారు.  మానసిక ప్రశాంతత కోసం మందులు ఇచ్చారు అయినా గుణం కనిపించడం లేదు.  రాత్రిలో గట్టిగా ఏడుస్తుంది.  అందరికి భయం మొదలు అయ్యింది ఆ అమ్మాయికి ఏమైంది అని.  లేక లేక కలిగిన సంతానం . 

ఎదో చెడు ప్రయోగం జరిగింది, ఇలానే ఉంటే తను బతకదు అని చెప్పేసరికి ఆమె తండ్రి ఎందరో తాంత్రికులను పిలిపించి రకరకాల పూజలు చేయించాడు.  ఏవో బలి పూజలు కూడా చేసారట కానీ ఏమీ ప్రయోజనం కనిపించ లేదు.  అలా ఒకసారి ఆశ్రమంలో చెన్నై లో పౌర్ణమి పూజకు వెళ్లిన సమయంలో ఆమె తండ్రి స్వామీజీ  దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు..అక్కడే ఒక అమ్మాయి అమ్మవారి భక్తురాలు ఉన్నారు.  ఆమె వారి దగ్గరకు వెళ్లి ఇంట్లో ప్రతి రోజు లలితా సహస్త్రనామ పారాయనఁ చేయండి, ఆ తల్లి పాదాలను పట్టుకోండి, మీ బిడ్డను ఆమె తప్ప ఎవరూ కాపాడలేరు.  మీ అమ్మాయి చేత కూడా చదివించండి అని ఇంట్లో చేయవల్సిన కొన్ని సూచనలను  చెప్పి వెళ్ళిపోయింది.  పౌర్ణమి పూజ చేసి వచ్చిన ఆమె అతనికి అమ్మవారి లాగా కనిపించిందట.  అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, చివరిగా ఆ పాప చెప్పినట్టు ఆ తల్లిని శరణు వేడుకొ అని స్వామీజీ కూడా చెప్పి పంపేసరికి , ఇంటికి వెళ్లి వెళ్ళగానే పారాయణ మొదలు పెట్టారు.  అతని కూతురు, నాన్న గొంతు నొక్కేస్తున్నారు,  ఊపిరి ఆడటం లేదు అని ఏడుస్తూ ఉన్నపిల్ల.  ఆ బాధ తట్టుకోలేక అందరూ చనిపోవాలి అని కూడా అనుకున్నారు.. పారాయణ మొదలు అవ్వగానే రెండు రోజులకు ఆ పాప దగ్గరకు వచ్చి కూర్చోవడానికి ఒప్పుకుంది.  కొద్దిగా అన్నం తింటుంది.  అరవడం తగ్గించి నిద్రపోతుంది.  అతనికి ఆశ్చర్యం ఆనిపించింది.  ఇది నిజమేనా లేక మందులు పని చేస్తున్నాయా  అని నమ్మలేకపోయారు.  భార్య భర్తల ఇద్దరు కలిసి రోజుకి 9 సార్లు ఇంట్లో పారాయణ చేయడం మొదలు పెట్టారు.  ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు కానీ తను మాములుగా ఉన్నపుడు నేను పారాయణ  చేస్తాను నాన్న, వింటుంటే నాకు హాయిగా ఉంది అనేసరికి ఆమె తల్లితండ్రులు చాలా ఏడ్చేశారు.  పాపం ఆ పిల్ల రోజు అమ్మ ఎవరో కొడుతున్నారు ,చంపేస్తారు, అని భయంతో అల్లాడిపోతుంటే వాళ్ళు ఏడవని రోజు లేదు , తను ప్రయత్నంగా లలితా పారాయణం మొదలు పెట్టింది కానీ ఒక పది వాక్యాలు కూడా చదవలేకపోయింది. ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టు  బాధ ఆమెకు..

తనలో కాస్త మార్పు వస్తుంది అని ఆశ్రమానికి తెలియచేశారు.  ఆ పాప తండ్రి రోజు ఉదయం సూర్యుడు ఎదురుగా నిలబడి లలితా పారాయణం చేయడం మొదలు పెట్టారు.  తన కూతురు కష్టం తలుచుకుని నిగ్రహించుకోలేని బాధతో ఏడుస్తూ పారాయణ చేసేవారట ఆ తల్లి జగన్మాత వారి బాధను చూసి నిలువుగా కరిగిపోయింది అనుకుంటా ఆ అమ్మాయికి మందులు కూడా పనిచేస్తున్నాయి.  రాత్రుల్లో అరవడం, ఏడవడం, ఎవరో చంపుతున్నారు అనడం తగ్గింది.  నిదానంగా పారాయణ చేయడం మొదలు పెట్టింది ఆ అమ్మాయి కూడా.  1 సారి చదవడానికి ఒక రోజంతా పెట్టేది.  అలాటి పిల్ల రోజుకి 9 సార్లు పారాయణ చేయగలిగింది. తన స్నేహితులను గుర్తు పడుతుంది.  ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఆ ఇంట్లో నిత్య పారాయణం చేస్తూ ఉంటారు లేదా ఆడియో అయినా పెట్టుకుంటారు.  రెండు నెలలకు ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుంది.  ప్రేత కళతో నల్లగా మారిపోయిన ఆ పిల్ల ఇది వరకు లాగా బంగారు బొమ్మలా అయిపోయింది.   ఒక్క రోజు కూడా ఆ పాప తండ్రి అమ్మవారి పూజ మానరు.  పౌర్ణమి ,అష్టమి నవమి రోజుల్లో విశేషం గా పూజలు అన్నదానం చేయిస్తారు.  చండి యాగం చేస్తారు... ప్రతి రోజు సాయంత్రం 7గంటలకు  ఇంట్లో పనివాళ్ళతో సహా అందరూ లలితా పారాయణ చేసి హారతి అయ్యాక భోజనాలు చేస్తుంటారు..పౌర్ణమి వస్తే రోజంతా ఇంట్లో జనంతో పారాయణ చేస్తుంటారు..ఆ అమ్మయికి వివాహం అయ్యింది ఇద్దరు సంతానం సంతోషంగా ఉంది..

ఆ పాప తండ్రి దేవి ఉపసాకులు అయిపోయారు ఎందరికో లలితా పారాయణ  మహిమ చెప్తూ వారందరి దగ్గర చేయిస్తున్నారు.  ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకున్నారు . ఆయన వ్యాపారాలు చూసుకుంటూ అమ్మవారి దీక్షలోనే ఉంటారు.  ఆ అమ్మయి కూడా అత్త గారి ఇంట్లో ప్రతి రోజు లలితా పారాయణ  చేస్తుందిట.  ఆ పదాలు పదే పదే పలకడం వల్ల అంతపెద్ద కష్టం నుండి ఆ కుటుంబం బయటపడింది..

వీళ్లకు ఇలా చేయమని ఆశ్రమంలో కనిపించి చెప్పిందే బుడ్డది, ఆ పిల్ల ఆచూకీ  చెప్పమని ఆశ్రమానికి వచ్చి స్వామిజీని బ్రతిమాలడారు వారు.  పౌర్ణమి కి పిలిపిస్తాను అని అన్నా.  ఆ రోజు తనతో మాట్లాడింది అమ్మవారే అని అనుకునే వారు.  తను ఆ పౌర్ణమికి వస్తున్నది అని తెలిసి వారి కుటుంబంతో సహా చాలా మంది చూడటానికి  వచ్చారు. అక్కడ హడావిడి చూసి ఆ జనంలో ఏదో  పెద్ద హోమం జరుగుతునట్టుంది అందుకే ఇంత మంది వచ్చారు అని అమ్మాయి ఒక పక్కన అలంకారం జరుగుతున్న చోట పూలు కడుతూ కూర్చుంది.  ఎవరూ గమనించ లేదు.  అందరూ అమెకోసం ఎదురు చూస్తున్నట్టు తనకు తెలియదు.  స్వామి వచ్చి ఆసనం పైన కూర్చున్నాక అక్కడకి వెళ్లి కూర్చున్నాకే ఆమె వచ్చినట్టు తెలిసి ఒక్కసారిగా అందరూ చుట్టుకున్నారు.  పాపం కొట్టడానికి వస్తునట్టు ఉంది ఆమెకు వారిని చూస్తుంటే.  ఆ పాప వాళ్ళ అమ్మ ఆ బుడ్డదాన్ని(చిన్నపిల్ల) పట్టుకుని బాగా ఏడుస్తుంది, నా బంగారు తల్లి అని.  వాళ్ళ బంధువులు పది మందితో వచ్చారు.  వాళ్ళ అమ్మాయి వచ్చి కాళ్లకు మొక్కింది.  వద్దు అంటే కొట్టేటట్టు  ఉన్నారు.  వాళ్ళు ఏమి ఇచ్చిన ఆమె తీసుకోలేదు, మా అమ్మ కొడుతుంది తీసుకుంటే అని వద్దు అన్నది... అందరూ కలిసి పూజ ఐయ్యాక భోజనం చేశారు..ఆ చెప్పిన అమ్మాయికి కూడా ఆశ్చర్యమే లలితా సహస్త్రనామం చదివితే అంత పెద్ద సమస్య అయినా తొలగిపోతుందా అని.  

అప్పటి నుండి...ఎవ్వరు ఏది కష్టం అన్నా లలితా పారాయణ చేయండి అని ఎందరిచేతో  ఆమె చేయిస్తుంది...ఒక్కటి రెండు కాదు ఎన్నో ఎందరో సమస్యలు లలితా పారాయణం ప్రతి రోజు దీక్ష గా చేయడం వల్ల, వివాహం, సంతానం, వ్యాపారం, కుటుంబ కలహాలు, గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు ఎన్నో సమస్యలు తీరిపోతున్నాయి..ఒకరు నమ్మినా  నమ్మక పోయిన ఇది యదార్థంగా జరిగిన సంఘటన..

ఏదో ప్రయోగం చేశారు అని పరిహారం చెప్పమని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇలా పారాయణ చేయండి.. దుష్ట సంహారం చేయడానికి అన్ని అవతారాలు ఎత్తిన తల్లి మీ కష్టం తీర్చదా.   నమ్ముకుంటే నమ్మకం ఉంటే ఇంత కన్నా గొప్ప పరిస్కారం లేదు మీకు.

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya