Online Puja Services

అమ్మవారి సౌందర్యాన్ని పోల్చదగినది లేదు

3.137.220.120
శంకరులు, "సౌందర్యలహరి" లోని 12వ శ్లోకాన్ని, అమ్మవారి సౌందర్య ధ్యానయోగం వలన కలిగే వశిత్వ సిద్ధి మరియు శివ సాయుజ్య ప్రాప్తి గూర్చి వర్ణిస్తూ, ఇలా రచించారు, 

త్వదీయం సౌందర్యం - తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే - కధమపి విరించిప్రభృతయః 

యధాలోకౌత్సుక్యా - దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపా - మపి గిరిశసాయుజ్యపదవీమ్.

తుహినగిరికన్యే అనగా మంచుకొండయైన హిమాద్రికన్య అనగా శ్రీ పార్వతీ మాత. త్వదీయం సౌందర్యం అనగా అమ్మవారి యొక్క సౌందర్యమును, తులయితుం సరి పోల్చటానికి,(కవీంద్రాః కల్పంతే - కధమపి విరించిప్రభృతయః) బ్రహ్మ మరియు బృహస్పతి లాంటి కవీంద్రుల వల్లనే కాలేదట.

అసలు కవులు అంటే, వశిన్యాది వాగ్దేవతలు. గురుత్వమైనా, కవిత్వమైనా వశిన్యాది వాగ్దేవతలది.వారే అమ్మవారి యొక్క రూప వైభవాన్ని వర్ణిస్తూ, "అనాకలిత" అనే పదం వాడారు. అనగా, ఉపమానము చెప్పటానికి వారికే సాధ్యము కాలేదు. అనగా అమ్మవారి యొక్క సౌందర్యమునకు పోల్చదగిన మరొక వస్తువు ఎక్కడా లేదు.

(యధాలోకౌత్సుక్యా - దమరలలనా యాంతి మనసా, తపోభిర్దుష్ప్రాపా - మపి గిరిశసాయుజ్యపదవీమ్)

కానీ సౌందర్యవంతులైన దేవతాస్త్రీలు అమ్మవారి యొక్క సౌందర్యమును తెలుసుకునే ప్రయత్నములో శివసాయుజ్యమును పొందారట. కేవలము శివునికి మాత్రమే అమ్మవారి యొక్క సౌందర్యము గూర్చి పూర్తిగా తెలుసు. అందుకే వశిన్యాది వాగ్దేవతలు ఏమన్నారు అంటే, "కామెశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా" దీనిగురించే శంకరులు ఏమన్నారు అంటే, "తదాతే సౌందర్యం పరమశివ దున్మాత్ర విషయం"

అనగా, "అమ్మా నీ సౌందర్యం, పరమశివుని కన్నులకు మాత్రమే తెలుసు" అన్నారు.
అలా సమయాచారముతో కూడిన,అమ్మవారి యొక్క సౌందర్య ధ్యానయోగం కలవారికి వశిత్వ సిద్ధి మరియు శివ సాయుజ్య ప్రాప్తి లభిస్తాయని శంకర ఉవాచ. 

శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.

సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది. 

శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే

- శివకుమార్ రాయసం 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore