Online Puja Services

ఈ సూర్యదేవాలయంలో స్థలవాసం చేస్తే, శనిదోషాలు తొలిగిపోతాయి.

18.188.152.162

ఈ సూర్యదేవాలయంలో స్థలవాసం చేస్తే, శనిదోషాలు తొలిగిపోతాయి. 
లక్ష్మీ రమణ  

అడుగడుగున గుడి ఉంది అని తమిళనాడు గురించే వర్ణించారేమో కవులు . తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న సూర్యదేవాలయం అటువంటి గుడులలో ఒకటి. అసలు ఈ కుంభకోణమే ఒక ప్రత్యేకమైన ప్రదేశం అంటే తప్పుకాదేమో ! ఇక్కడున్న మహత్యం ప్రపంచంలో మరే  ప్రాంతంలోనూ లేదు . అంతటి గొప్ప విశేషం మన తెలుగు ప్రాంతం పక్కనే ఉంది. రండి ఆ విశేషాలు తెలుసుకుందాం . 

తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు వేర్వేరుగా తొమ్మది దేవాలయాలు ఉన్నాయి. ఈ నవఆలయాలూ కూడా ఆయా ప్రదేశాలలో స్వయంగా ఆ గ్రహాధిపతులు శివుని గురించి తపస్సు చేసిన ప్రదేశాలు. అక్కడ ఆలయం ఆయా గ్రహాల పేర్లతో ప్రసిద్ధిని పొందినా, ప్రధానాలయంలో పూజందుకునేది మాత్రం శివలింగమే ! 

అయితే ఈ నవగ్రహాల్లో ప్రత్యేకమైనది సూర్య దేవాలయం. మిగిలిన అన్ని నవగ్రహ ఆలయాల్లో పూజలందుకునేది పరమేశ్వరుడేనని చెప్పుకున్నాం కదా! కానీ, సూర్యదేవాలయంలో మాత్రం సూర్యుడే ప్రధాన దైవం. ఆలయంలో భయంకరమైన వేడి ఆవరించి ఉంటుంది. ఏకాలమైనా ఈ వేడిని మనం ఆ భానుని ఆలయంలో గుర్తించవచ్చు. ఇక తాపమైనా , ప్రతాపమైనా గురుని అనుగ్రహముతోటే కా సరైన దారిలో ప్రయాణించి లోకోపకారానికి ఉపయోగపడుతుంది ! అందువల్ల ఇక్కడ సూర్యభగవానుడి వేడిని తగ్గించడానికి నవగ్రహాల్లో ఒకటైన గురుడు, భానునికి ఎదురుగా నిలిచి ఉంటారు. అదేవిధంగా శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. గుఱ్ఱమేకదా ఆ భానుని రథాన్ని నిత్యం దారిలో నడిపించేది  మరి ! 

ఇక్కడ సూర్య భగవానుడి ఆలయంతో పాటు , ఇతర నవగ్రహాల ఆలయాలు నెలకొని ఉండడానికి , ఒక ప్రాశస్త్యమైన గాథ ప్రచారంలో ఉంది . పూర్వం కలవ మహర్షి బ్రహ్మ శాపం వల్ల కుష్టురోగంతో బాధపడేవాడు. నారదుడి సూచనమేరకు ఆ మహర్షి నవగ్రహాలని ప్రార్థించి తన వ్యాధి నుంచి విముక్తుని పొందుతారు . తానిచ్చిన శాపాన్ని వమ్ము చేసిన  నవగ్రహాలపై తీవ్రంగా ఆగ్రహించిన బ్రహ్మదేవులు వారిని శపిస్తారు . ఇకపై వారు కుష్టురోగాన్ని పొంది , భూలోకవాసం చేయాలని, వారికి వరాలిచ్చే శక్తి నశిస్తుందని శపిస్తారు . 

బ్రహ్మ శాపం ప్రకారం నవగ్రహాలు భూమి పై వెల్లురుక్కవనం అంటే తెల్లని అడవి పూలు ఉన్న ప్రాంతంలో వేర్వేరు చోట్ల ఉంటారు. ఈ వెల్లురుక్కవనం తమిళనాడులోని కుంభకోణం చుట్టు పక్కల ఉంది. ఇలా భువిచేరిన నవగ్రహాలూ , కుష్ఠురోగంతో బాధపడుతూ , వెయ్యి సంవత్సరాలపాటు ఆ ఈశ్వరుని అర్చిస్తారు . 

ఆయన కృపవల్ల రోగ విముక్తులవుతారు. వారిపేర్లతో ఈశ్వరుడుకోలువై పూజలందుకునేలా వరాన్ని పొందుతారు . అంతేకాకుండా, ఆయా ఆలయాలకు వచ్చే వారి ఏలినాటి శనిని కూడా పోగొట్టేలా వరాన్ని కూడా పొందుతారు . అలా అనుగ్రవృష్టిని కురిపిస్తూ , కుంభకోణం లోని ఈ ఆలయాలు ప్రసిద్ధమయ్యాయి . 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha