Online Puja Services

ఆ బసవన్న శ్రీశైలం చేరకుండా కృష్ణమ్మ ఒడిలోనే నిలిచిపోవడానికి కారణం

18.217.194.39

ఆ బసవన్న శ్రీశైలం చేరకుండా కృష్ణమ్మ ఒడిలోనే నిలిచిపోవడానికి కారణం ఏమిటి ? 
సేకరణ 

పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు.అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు.ఉత్సాహంతో పని ప్రారంభించాడు.

శిల్పి నక్త వ్రతాన్ని(పొద్దున్నించీ భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏమి లాభం?వెంటనే విచారం లో మునిగి పోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి? అన్నదే అతని బాధ . మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి. నిద్రకూడా పట్టలేదు. అర్ధ రాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కల. కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు.

"భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది.ఇవిగో ఈ పలుపు త్రాళ్ళను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో.." వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపు త్రాళ్ళు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు . వెంటనే త్రాళ్ళను నందుల మెడ లకు తగిలించాడు. త్రాళ్ళను చేత బట్టి శ్రీశైలానికి బయల్దేరాడు. తెల్లవారు ఝాముకు పాతాళగంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాట సాగాడు.

నీటిలో కొంత దూరం వెళ్ళాడు. రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు. ఒక నంది అతని ముందు వున్నది యింకొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ళ మధ్య యిరుక్కొని అది రావడం మానేసింది. శిల్పి కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు . అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి, మళ్ళీ శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నంది తోనే శ్రీశైలం చేరాడు.

ఇప్పుడు. శ్రీశైలం లో వున్న నంది. ఆ శిల్పి చేసిన నందే నని చెప్తారు.. ఇదంతా కర్ణా కర్ణిగా స్థానికుల నుండీ వినపడుతున్న గాధ. మరి ఊబినుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉంటె కదా ఈ ఉదంతం నిజమని నమ్మేది !! అంటే, అందుకు సమాధానం చెప్పడానికి ఉబ్బలి బసవన్న సిద్ధంగా ఉంటాడు .  

"ఉబ్బలి బసవన్న" అని పిలువబడుతూ ఇటీవలి కాలం వరకూ భక్తులకు దర్శన మిచ్చిన ఆ బసవన్న  శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల పాతాళ గంగలో మునిగిపోయాడు. ఇప్పుడు ఆ నంది దర్శనం పాతాళ గంగలో 700 అడుగుల లోతులో చేసుకోవచ్చు . 

              ఓం నమః శివాయ 

Ubbali Basavanna, srisailam, shilpi, pathala ganga, krishna river

 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore