Online Puja Services

ఈ మహాపదార్థాలు రహస్యసాక్షులు

3.14.142.115

ఈ మహాపదార్థాలు రహస్యసాక్షులు 
-లక్ష్మీ రమణ 

పిల్లి కళ్ళుమూసుకొని పాలు త్రాగుతూ , దాన్ని ఎవ్వరూ చూడలేదనుకుంటుంది . కొన్నిసార్లు మానవుని ప్రవ్రుత్తి కూడా ఆ పిల్లిలాగే ఉంటుంది . తననెవరూ చూడలేదనుకొని విహితం కాని పనులకి తెగబడుతూ ఉంటాడు . మనసు సహజమైన ప్రవృత్తే అలాంటిది మరి . కానీ మనం ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే మూగసాక్షులు పద్దెనిమిది ఉంటాయి అంటుంది శాస్త్రం . వీటినే అష్టాదశ మహాపదార్థాలని పిలుస్తారు .  

చివరికి మిగిలేది , మనవెంట వచ్చేది మనం చేసిన ధర్మాధర్మాలు , పాప పుణ్యాలు మాత్రమే. అందుకే వాటికి సాక్షీభూతాలైన  నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి  మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి . నీడలా మన ప్రవర్తనని కనిపెడుతుంటాయి . లెక్కల చిట్టాలు చిత్రగుప్తునికన్నా నిశితంగా పరిశీలించిమరీ రాసేస్తుంటాయి . మూగ సాక్షులై మన వెంటే వస్తాయి. ఈ విష్యం తెలిశాక ఎవరికివారు తస్మాత్ జాగ్రత్త అనుకోనుండా  ఉండలేం కదూ !

మనలోకంలోని న్యాయస్థానాల్లో సశరీరమై వచ్చి ఇవి సాక్ష్యం చెప్పక పోవచ్చును గాక, కానీ పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది. బొందితో స్వర్గానికి వెళ్ళాక కూడా ధర్మరాజు నరకద్వారాన్ని దర్శించక తప్పలేదు . ధర్మాచార వర్తనుడు , స్వయంగా యమధర్మరాజు పుత్రుడు , అసత్యం ఆది ఎరుగని వాడైన ధర్మారాజుకి కూడా, నరకకూపంలోని బాధ అనుభవం కాక తప్పలేదు . కాబట్టి , ఈ మౌనసాక్షుల   గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

ఈ ఎఱుకలేకపోతే, ఎరుకలేకపోతావు , ఎరగలేకపోతావు , అదినేనే , ఇదీనేనే అనే ఈ మౌన సాక్ష్యుల ఏరుకుని గమనించడం సాధ్యంకాని విషయమే . ఇవన్నీ జడ పదార్థాలేననే భ్రమ లోనే ఉండిపోవాల్సి వస్తుంది . 

ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 
అందుకే మనిషికి మనస్సాక్షి ఒకటుంటుంది . ఈ అంతరాత్మ మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది . కానీ అరిషడ్వర్గాలకూ బానిసయిన మనిషి  అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. ఆవేశం, కోపం,క్షణికావేశం తో విచక్షణ కోల్పోవడం ఎన్నో అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .

కొన్ని సార్లు  అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు, పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోలేము .  అంతరాత్మ అనేది మనకి ఈ విధంగా  అనుభవపూర్వకంగా తెలిసివస్తుంది . ఇదేవిధంగా మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం . నిజానికి అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, మనం చేసే పనిని ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ దారిలో నడిచేందుకు తెగించడు .

 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు. శుభం 

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha