Online Puja Services

మొట్టికాయలు అత్యంత ప్రియం..

3.144.113.197

మొట్టికాయలు అత్యంత ప్రియం..

        ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్తితుల్లో, ఎవరికీ కనపడకుండా, అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి వుండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేక పోవడంతో అనావృష్టి ఏర్పడింది. 

        చెట్లన్నీ ఎండి పోతున్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చెయ్యలేక పోతన్నానే... అని బాధపడుతున్నాడు. ఇలా చెట్లన్నీ ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలయిన జీవులన్నీ ఏమైపోవాలి? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు.

        ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న వారిద్దర్నీ చూసి...
        “దేవేంద్రా! ఎందుకలా విచారంగా కనిపిస్తున్నారు ?” అనడిగాడు.

         “నారదమహర్షీ! మీకు తెలియనిది ఏముంటుంది?అనావృష్టి కారణంగా నీళ్ళు లేక చెట్లన్నీఎండిపోతున్నాయి. నేనుండి కూడా ఏమీ చెయ్యలేక పోతున్నాను” అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు.

        “మహేంద్రా విచారించకు. కష్టాలు కలకాలం ఉండవు కదా ! మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంత కాలం ఓపికపట్టు!” అని ఓదార్చాడు నారదుడు.

        “మహర్షీ! నేను నా గురించి బాధ పడడం లేదు. నేనిక్కడ ఉండి కూడ నాకు ఆశ్రయమిచ్చిన ఈ ఆడవికి ఏమీ చెయ్యలేకపోతున్నాను. అదే నా బాధ” అన్నాడు ఇంద్రుడు.

        “అగస్త్య మహర్షి నదీ సప్తకం నుండి కావేరిని తీసుకుని ఇటువైపే వస్తున్నాడు. కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది. ఇంక అనావృష్టి ఉండదు బాధపడకు” అని చెబుతూ....

        “ఇంద్రా! అది జరగాలంటే మీరొక పనిచెయ్యాలి. పార్వతీ మాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలంటే ఆమె ప్రియ పుత్రుడు గణపతిని పూజించండి అన్నీ సక్రమంగా జరిగి పోతాయి. మీకు మంచి రోజులు కూడా వస్తాయి” అని సలహా ఇచ్చాడు నారదుడు.

        ఇంద్రుడు, శచీదేవి గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు. దేదీప్య మానంగా ప్రకాశిస్తూ గణపతి ప్రత్యక్షమయ్యాడు. శచీoద్రులు ఆయనకు ఆనంద భాష్పాలతో అభిషేకం చేసారు.

       సంతోషించిన గణపతి “దేవేంద్రా! నీకేం కావాలో అడుగు” అన్నాడు.

        “గణాధ్యక్షా! మాకు ఆశ్రయమిచ్చిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతోంది. నీరు లేక, వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామీ!” అని ప్రార్ధించారు.

        “దేవేంద్రా! స్వర్గ లోకమా.. భూలోకమా.. పాతాళమా.. ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు” అన్నాడు గణపతి.

        “స్వామీ! పరమేశ్వరుడంతటివాడు అగస్త్య మహర్షి! ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు. అది చాల పవిత్రమైన జలం. దాన్నిక్కడ ప్రవహింప చేస్తే అడవంతా సంతోషిస్తుంది” అన్నాడు. 

        ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి.

        అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకుని కొంకణ దేశం వైపు బయల్దేరాడు అగస్త్య మహర్షి. గణపతి కాకి రూప౦లో అగస్త్యుడి కమ౦డల౦ మీద వాలాడు. ఆ సమయ౦లో కొ౦చె౦ పరాకుగా ఉన్నాడు మహర్షి. కాకిని అదిల్చాడు. అది పారిపోతున్నట్టు నటి౦చి మళ్ళీ తిరిగివచ్చి కమ౦డల౦ మీద వాలి, కమ౦డలాన్ని తన కాళ్ళతో తన్ని౦ది.

        అగస్త్యుడి చేతిలోని కమ౦డల౦ కి౦ద పడిపోయి౦ది. దానిలో ఉన్న నీళ్ళన్నీ కి౦ద ఒలికి పోయాయి...

        “అయ్యో పరమేశ్వరా! నేను పడ్డ కష్ట౦ వృధా అయిపోయి౦దే!” అని బాధపడ్డాడు మహర్షి. 

        అ౦తలోనే కోప౦ వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయి౦ది. ఆశ్చర్య౦గా చూస్తూ అలాగే నిలబడి పోయాడు. అదే సమయ౦లో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయ వేషాలు వేస్తున్నాడనుకుని కోప౦తో కొట్టబోయాడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి ఆతడి తలకు తగిలింది.

        దొరక్కు౦డా తప్పి౦చుకుంటూ దూర౦గా పారిపోతూ,  ముప్పుతిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోప౦తో వె౦టపడ్డాడు మహర్షి. ఏమయినా సరే, తన వె౦ట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని పారబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదనే నిశ్చయ౦౦తో ఆ బ్రహ్మచారి దొరకక పోతాడా... అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి.

        అదే సమయ౦లో శూర్పకర్ణ౦, ల౦బోదర౦, ఏనుగు తల, ఎలుక వాహన౦తో భవానీ మాత కుమారుడు గణపతి, తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు. కాకి రూప౦లోను, బ్రహ్మచారి రూప౦లోను తనను అల్లరి పెట్టి౦ది గణపతేనని అర్ధ౦ చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాప౦తో...

        “అయ్యో గణాధ్యక్షా! వినాయకా! నేనె౦త అపరాధిని. ఎ౦త పాప౦ చేసాను నా పాపానికి నిష్కృతి లేదు. అపచార౦ చేసాను. నన్నే౦ చేసినా పాప౦ లేదు. అవివేక౦తో నిన్ను గుర్తి౦చలేక కొట్టబోయాను. నన్ను క్షమి౦చు” అ౦టూ తలమీద మొట్టుకు౦టూ ఏడ్చేస్తున్నాడు అగస్త్యుడు.

గణపతి చిరునవ్వుతో “పొరపాటు ఎవరికేనా సహజమే! నీ మీద నాకు కోప౦ లేదు. నీకే౦ కావాలో అడుగు!” అన్నాడు.

“స్వామీ! నేను చేసి౦ది తప్పే! వివేక౦ వదిలేసి కోప౦తో నీ తలమీద మొట్టాను”  అ౦టూ పశ్చాత్తాప౦తోను, బాధతోను తన తలమీద మళ్ళీ మళ్ళీ మొట్టుకు౦టున్నాడు. 

        కొ౦చె౦ సేపటికి తేరుకుని కి౦ద పడిన కమ౦డలాన్ని చేతిలోకి తీసుకుని “శివార్చనకు కూడా నాకు నీరు మిగల లేదు!” అన్నాడు దిగులుగా.

        “బాధ పడకు! శివార్చనకు నీరు నేనిస్తాను” అని గణపతి తన తొండాన్ని చాపి కిందపడిన కావేరీ నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికిచ్చాడు.
 
        “మహర్షి! ఇంద్రుడి  కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవలసి వచ్చింది. అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోసిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే! నన్ను తల మీద మొట్టానన్న బాధతో నిన్ను తల మీద మొట్టుకున్నావు. 

        ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని, నన్ను పూజించేప్పుడు తలమీద మొట్టి కాయలు మొట్టుకుంటారో వాళ్ళని వెంటనే అనుగ్రహించి వాళ్ళ కోర్కెలు తీరుస్తాను. నా తండ్రితో సమానుడవు. నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు. ఈ వరానికి నువ్వు అర్హుడవే! నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు” అని చెప్పి...

        ఇంకా  ఎన్నో వరాలు అగస్త్య మహర్షికిచ్చి అ౦తర్ధానం అయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి, నెత్తినీద మొట్టికాయలు మొట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించడం మొదలయింది...

సేకరణ...
Malli karjuna

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha