Online Puja Services

ఈ కాళీమాతని పూజించిన వారికి రాజకీయాల్లో తిరుగుండదట .

18.191.216.163

ఈ కాళీమాతని పూజించిన వారికి రాజకీయాల్లో తిరుగుండదట .
లక్ష్మీ రమణ 
 
ఆలయ నిర్మాణమంటే, సామాన్యమైన విషయం కాదు . ఎలాబడితే, అలా చేసే నిర్మాణమూ కాదు . శిల్పశాస్త్రం సూచించిన విధంగా , ఆగమ యుక్తంగా జరగాల్సిన పని. కానీ ఈ ఆలయం మాత్రం అందుకు భిన్నం . ఎక్కడా వాస్తుశాస్త్రంగానీ , శిల్పశాస్త్ర నియమాలు గానీ పాటించిన దాఖలాలు ఉండవు . ఆమాటకొస్తే, కాళీమాతే చాలా విచిత్రంగా ఉంటుంది . ఆలయంలో మూడు నందులుంటాయి . రండి ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం .   

రాజకీయనాయకులంటే , కొన్ని సార్లు విధి వశం చేతనో, స్వంత లాభం కొంతైనా మానుకోలేకనో వక్రమార్గాలు అనుసరిస్తూంటారు .  మరి ఈ కాళీమాత కి ఏమయ్యింది . జగజ్జనని కదా తల్లి ! ఎందుకిలా వక్రంగా ఉన్న ఆలయంలో వక్ర రూపంగా కొలువై వక్ర కాళీ అమ్మన్ గా పూజలందుకుంటోందా అనేది ఒక విశేషం . అమ్మ ఏ పనీ కూడా కారణం లేకుండా చేయదు కదా ! దీని వెనుక కూడా లోకోపకారకమైన ఒక కారణం ఉంది మరి . 

ఈ ఆలయం తమిళనాడులోని  తిరువక్కరైలో ఉంది . చోళులు నిర్మించిన ఆలయాలు శిలాప శిభితంగా చక్కని వాస్తుతో అలరారుతుంటాయి . కానీ , శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం చోళులు నిర్మించినదే అయినప్పటికీ , వాస్తు అనేది మాత్రం ఇక్కడ కనిపించదు . 

విల్లుపురంకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే  "తిరువక్కరై" అనేక విశేషాల నిలయం.పేరుకి ఇది వక్ర కాళీ అమ్మన్ ఆలయంగా పిలవబడుతున్నా, నిజానికిది మూడు ప్రధాన ఆలయాల సమాహారం.
ఇక్కడ ప్రధానాలయంలో శివుడు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిగా కొలువయ్యారు. కాళీమాత , చంద్రమౌళీశ్వరునితో పాటుగా   శ్రీ వరద రాజ స్వామీ వేరువేరు సన్నిధులలొ దర్శనమిస్తారు . ఈ అరుదైన విశేషానికి సంబంధించి రెండు  పురాణ గాధలు చెబుతారు.

పురాణ ప్రశస్తి :
పురాణ కాలంలో "వక్రాసురుడు" అనే అసురుడు శివ లింగాన్ని గొంతులో వుంచుకొని తీవ్ర తపస్సు చేసి సర్వేశ్వర సాక్షాత్కారం పొందాడు. చావు లేకుండా వరం కోరుకున్నాడు . పుట్టిన ప్రాణి గిట్టక మానదు . కాబట్టి అది తప్ప మరో వరం కోరుకోమన్నారు లయ కారుడు.

తన మరణం భగవంతుని మూలంగానే రావాలని, కాకపోతే స్వయంగా ఆయన ద్వారా కాకూడదు అనే ఒక చిత్రమైన వరం కోరి పొందాడు.

వర గర్వంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేయసాగాడు.పరమ శివుని తో సహా దేవతలు, మునులూ వైకుంఠ వాసుని వద్దకు వెళ్లి కాపాడమని వేడుకొన్నారు. సర్వాతర్యామి వరదరాజ స్వామి రూపంలో రాక్షసుని తన సుదర్శన చక్రం తో అంతం చేసారు. అందుకని ఇక్కడి శ్రీ వరదరాజ  అర్చా మూర్తి చేతిలోని చక్రం "ప్రయోగ స్థితిలో "లో అంటే వదలడానికి సిద్దంగా కనపడుతుంది.మరెక్కడా ఇలాంటి భంగిమలో స్వామి కనపడరు.

దుర్ముఖి అన్నకి తగ్గ చెల్లెలు :

వక్రాసురుని వధతో కథ సుఖాంతం కాలేదు . వక్రాసురునికి "దున్ముఖి " అనే చెల్లెలు ఉంది . అన్న మరణానికి కలత చెందిన ఆమె, అనేక ఘోరాలకు పాల్పడసాగింది. లోకానికి తన అన్నలేని లోటుని తీర్చసాగింది .  శ్రీ మహావిష్ణువు - పరమేశ్వర అర్ధాంగి ,తన సోదరి అయిన పార్వతీ దేవిని ఈ పీడనుండీ విముక్తం చేయమని కోరారు. అప్పుడాదేవి  దుష్ట రాక్షసిని దునుమాడటానికి, వక్ర కాళి రూపం ధరించి యుద్దానికి తరలి వెళ్ళారు.

 కాకపోతే సమర సమయానికి దున్ముఖి గర్భవతి. గర్భవతితో పోరు ధర్మ విరుద్దం. కాబట్టి , అమ్మవారు ఆమె గర్భాన్ని చీల్చి పిండస్త శిశువును తన కర్ణాభరణంగా ధరించి, దున్ముఖి ని అంతం చేసింది. దేవతల కోరిక మీద ఇక్కడ అదే రూపంలో కొలువు తీరారు. సుమారు పాతిక ఎకరాల స్థలంలో తూర్పున నిర్మించబడిన అయిదు అంతస్తుల రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే మొదట కనపడే శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది.

శిరోజాలు లేని నలుగురు స్త్రీలు :

గర్భాలయ వెలుపలి గోడల ‘శ్రీ వినాయకునితో పాటు అష్ట లక్ష్ముల మరియు వక్ర కాళీ అమ్మవారి రూపాలను నిలిపారు. గర్భాలయం వెలుపల శిరోజాలు లేకుండా ఉన్న నలుగురు స్త్రీ మూర్తుల విగ్రహాలు కనపడతాయి. వివరాల లోనికి వెళితే ఆ నలుగురూ గొల్ల స్త్రీలు. దురాశతో ప్రజలకు విక్రయించే పాలు, పెరుగు మరియు నెయ్యిని కల్తీ చేసారట. పట్టుబడటంతో రాజు ఆడవారు కాబట్టి గుండు గీయవలసిందిగా ఆదేశించారట. చేసిన తప్పుకు వగచి వారు అమ్మవారి పాదాల మీద పడ్డారట. ఆమె వారిని క్షమించి తన ఆలయ ద్వారం వద్ద నియమించినది. 

వక్రకాళీ అమ్మ :

గర్భాలయంలో సుమారు పది అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో శ్రీ వక్ర కాళీ అమ్మవారు చిత్రమైన భంగిమలో ఆయుధాలు ధరించి ఎడమ పాదం క్రింద దున్ముఖి ని అదిమి పట్టినట్లుగా ఉపస్థితురాలై దర్శనం ప్రసాదిస్తారు. మెడలో పుష్ప మాలలతో పాటు నిమ్మకాల దండ ధరించి ఉంటారు.

ఆరంభంలో అమ్మ ఉగ్రమూర్తి. ఆది శంకరులు ఈ ఆలయాన్ని సందర్శించి లోక సంరక్షణార్ధం అమ్మవారి ఎడమ పాదం క్రింద శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించడంతో, శాంత మూర్తిగా కనపడుతున్నారు.
గర్భాలయంలో వలంపురి వినాయకుడు, లింగ రూపంలో శ్రీ యోగేశ్వర స్వామి కొలువై ఉంటారు.

వక్రలింగేశ్వరుడు, చంద్రమౌళీశ్వరుడు :

ఇక్కడి మరో విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలి పీఠాలు ఉండవు. అమ్మవారి ఆలయానికి కుడి వైపున అదే మండపంలో పెద్ద లింగ రూపంలో శ్రీ వక్ర లింగేశ్వర స్వామి పడమర ముఖంగా ఉంటారు. ఈ లింగం ఎండాకాలంలో చల్లగా ఉంటుందిట.  వర్ష, శీతాకాలాలలో లింగం నుండి నీరు వెలుపలికి వస్తుందట. ఎంతైనా గంగాధరుడు కదా ! స్వామికి ఎదురుగా సగానికి పైగా భూమి లోనికి దిగబడినట్లుగా ఉన్న నందిని, భక్తులు అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా భావిస్తారు. అందుకే తమ కోరికలను నందీశ్వరుని చెవిలో చెబుతారు. అలా చేస్తే అది భక్త సులభునికి శీఘ్రంగా చేరి, నెరవేరుతుందని విశ్వసిస్తారు.

ఈ నంది మండపం వెనుక వంద స్తంభాల కళ్యాణ మండపం సుందర శిల్పాలను ప్రదర్శిస్తుంది. నిర్మాణం బలహీనంగా మారడంతో లోనికి ప్రవేశం నిషేదించారు. ఈ సంఘటన ఈ ఆలయ పురాతనత్వాన్ని , ప్రాచీనతని వెల్లడి చేస్తుంది . 

 శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు కొలువైన  రెండో ఆలయానికి దారి తీసే మండపంలో మరో పెద్ద నంది మండపంలో కొలువై దర్శనమిస్తారు .  శ్రీ గణపతి మరియు శ్రీ కుమార స్వామి ఇరువైపులా కొలువైన గోపురము గుండా రెండో ప్రాంగణం లోనికి వెళితే కుడి వైపున అమ్మవారు శ్రీ వడివాంబికై  సన్నిధి, ఎడమ వైపున సప్త మాతృకలు, దర్శనమిస్తారు. గోపుర పీఠం పైన చాలా తమిళ భాషా శాసనాలు కనపడతాయి. ఇక్కడ ఎన్నో చిత్రాలు కనపడతాయి.

అస్తవ్యస్తం , వక్రం ఆలయ వాస్తు :

ధ్వజస్తంభం, బలి పీఠం, నంది మరియు గర్భాలయం ఒక వరుసలో ఉండవు. శిధిలావస్థకు చేరిన పాత నిర్మాణాన్ని పునః నిర్మించిన ఆదిత్య చోళుడు ఎందుకు వాటిని సరి చేయలేదో తెలియరాలేదు.

కాక పోతే వక్ర శాంతి కోసం, ప్రాంగణంలో ఏడు వినాయక విగ్రహాలను, మూడు జతల ద్వారపాలకులను, మూడు నందులను, రెండు విష్ణు రూపాలను ఏర్పాటు చేసారు.శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామి త్రి ముఖాలతో కూడిన లింగ రూపంలో దర్శనమిస్తారు. భారత దేశం మొత్తం మీద త్రిముఖ లింగం శ్రీ చంద్రమౌలీశ్వర స్వామే! పైగా ఆయన లింగంపైనా పరమేశ్వర ముఖం స్పష్టంగా దర్శనమిస్తూ ఉంటుంది . ఈ మూడు ముఖాలను త్రిమూర్తులకు ప్రతి రూపాలుగా పేర్కొంటారు.

జుట్టు ముడివేసుకున్న నటరాజు :

 ప్రదక్షణా పదంలో ఉగ్ర రూపంలో ఉన్న శ్రీ విష్ణు దుర్గ, శ్రీ కాలభైరవుడు, పెద్ద లింగాల తో పాటు సహజంగా కుడికాలి మీద నిలబడి, ఎడమ కాలిని ఎత్తి కనపడే శ్రీ నటరాజ స్వామి ఇక్కడ దానికి వ్యతిరేకంగా కుడికాలిని పైకి ఎత్తి ఉంటారు. మరో గమనించ వలసిన అంశం స్వామి వారి జటాజూటాలు ముడివేసి ఉంటాయి. విశ్వైకనరుడు విశ్వ చాలనా నాట్యాన్ని పక్కనపెట్టి , రాక్షసంహారానికి పాదం కదిపారేమో మరి ! 

కుండలినీ మహర్షి :

స్వామిని సేవించుకొని వెలుపలికి వస్తే పక్కనే ఉంటుంది శ్రీ కుండలినీ మహర్షి సమాధి. ఇదొక అరుదైన అంశం. సమాధి మీద పెద్ద శివలింగము ప్రతిష్టించారు. ఈ మహర్షి శివ సాక్షాత్కారం పొందిన వారు. ఈ సమాధి మందిరంలో ధ్యానం చేయడానికి కావలసిన ఏకాగ్రత పుష్కలంగా లభిస్తుందని అంటారు. ఎందరో ధ్యాన ముద్రలో కనిపిస్తారు.

చక్రధారి వరదరాజు , దానుద్ధరి వేణుగోపాలుడు :

ప్రదక్షణ చేస్తూ ప్రాంగణ ఉత్తర భాగానికి చేరుకొంటే శ్రీ వరదరాజ పెరుమాళ్ సన్నిదిని దర్శించు కొనవచ్చును. ఆరు అడుగుల విగ్రహ రూపంలో స్వామి స్థానక భంగిమలో శంఖు, చక్ర అభయ వరద ముద్రలతో సుందర పుష్పాలంకరణలో నేత్రపర్వంగా దర్శనం ప్రసాదిస్తారు.
స్వామీ వారికి ఎదురుగా ఉన్న గోడ మీద చెక్కబడిన  శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి చేతిలో  ధనుర్భానాలు ధరించి ఉండటం మరో అరుదైన విషయం. సాధారంగా కృష్ణుడు చేతిలో వేణువు పట్టుకొని దర్శమిస్తారు . కానీ ఇక్కడ శత్రుసంహార స్థితిలో కానరావడం, పాక్కనే రుక్మిణీమాత ఉండడం ఒక విశేషమే !

అరుదైన శని దర్శనం :

స్వామి ఆలయం వెనుక సహస్ర లింగం ఉంటుంది. ఆఖరి అరుదైన అంశం ఇక్కడి నవగ్రహ మండపంలో దర్శనమిస్తుంది. పరిశీలనగా చూస్తే సహజంగా శని భగవానునికి వెనుక కుడి పక్కన వాయసం తల కనపడుతుంది. కానీ ఇక్కడ స్వామి వారి వాహనం యొక్క శిరస్సు ఎడమ పక్కన ఉంటుంది. ఈ వక్ర శని అర్దాష్టమ, ఏలినాటి శని దోషాలను తొలిగించే వానిగా ప్రసిద్ది.ఈ విశేష ఆలయంలో అన్ని శైవ వైష్ణవ పర్వదినాలను వైభవంగా నిర్వహిస్తారు. 

ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో శ్రీ వక్ర కాళీ అమ్మన్ కు చందనాలంకరణ చేస్తారు. పౌర్ణమినాడు అర్ధరాత్రి పంనేడు గంటలకు, అమావాస్య నాడు మధ్యాహాన్నం పన్నెండు గంటలకు "జ్యోతి దర్శనం" ఏర్పాటు చేస్తారు. వేలాదిగా భక్తులు పాల్గొంటారు.

తిరువక్కరై శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం  మానవ జాతకం లోని గ్రహ దోషాలను , గృహ వాస్తు దోషాలను తొలగించే పరిహార క్షేత్రం. మూడు పౌర్ణమి రోజులలో అమ్మవారిని,శని దేవుని సేవించుకొని జ్యోతిని సందర్శిస్తే అన్నిరకాల గ్రహ దోషాలు తొలగి పోయి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయన్న విశ్వాసంతో వేలాదిగా భక్తులు వస్తుంటారు.

ఇలా చేరుకోవచ్చు :

తిరువక్కరై, తమిళనాడు లోని విల్లుపురం పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన రాష్ట్రం లోని ముఖ్య నగరాల నుండి విల్లుపురానికి నేరుగా చేరుకోడానికి రైలు సౌకర్యం కలదు.
విల్లుపురంలో వసతి భోజన సౌకర్యాలు లభిస్తాయి.

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya