Online Puja Services

విభూతి ధారణ ఎలా చేయాలి ?

3.144.252.140

విభూతి ధారణ ఎలా చేయాలి ? ఎప్పుడు చేయాలి ? విభూతి మహిమ తెలుసా !
-సేకరణ 

విభూతిని పెట్టుకోవడాన్ని గురించి దాని ప్రభావాన్ని గురించి మనకి శివపురాణం వివరిస్తుంది . విభూతి పెట్టుకొని, రుద్రాక్షరలని ధరించి, బిల్వదళాలతో శివారాధన చేయమని వివరిస్తుంది. ఎందుకుఆ విధంగా చేయాలి ? విభూతిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలని కూడా చర్చించే ఈ శివపురాణం , అందుకు ఉన్న కారణాలని వివరించిన విధానాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి . 

వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః!!

పూజ చేసుకోవడానికి పూజామందిరం లోకి వెళ్లేప్పుడు పవిత్రంగా ఉండడం అవసరం. అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే, పూజామందిరంలోకి వెళ్లాలని శ్రుతులు చెబుతున్నాయి . అలా పూజ చేసుకునేప్పుడు మనసు మనం చేసే పూజపైన నిలబలాలి. ఏకాగ్రతని పొందాలంటే, భస్మధారణ, రుద్రాక్ష మాల , బిల్వదళార్చన చేయమంటుంది శివ పురాణం .  

భస్మము అంటే, బూడిదే కదా !  దానిని మూడు గీతలుగా లలాటము(నుదుటిపైన ) పైన  పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు.

శాస్త్రములో  శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటముపై  త్రిపుండ్రములను ధరించిన వాడై, బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వస్తే, అలా  పూజామందిరంలోంచి బయటకు రాగానే ఆయన్ని చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితము లభిస్తుందని చెబుతారు .  ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది.

పొడి విభూతి:
విభూతిని ధరించదానికి ఒక పధ్ధతి  చెప్తారు . దీనిని  ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం,  నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదు. కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయగలిగినవారు ఎంతమంది ? అన్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి . ఒక వేళ అలా  స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి వస్తే,  ఆ పాపం గాయత్రి జపం చేయడం వలన  సాధ్యమయినంత తొందరగా పోతుంది.అలా చేయలేనివారు, వారి ఇష్టదేవత పేరున పూజచేసుకోవాలి . స్నానం చేయకుండా బయటికి వెళ్లాల్సి వచ్చిన సందర్భాలలో  పొడి విభూతిని తీసుకుని  దరించవచ్చు. కానీ తడి విభూతిని పెట్టుకోకూడదు . 

ఇలా పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరానికి అశౌచం (శుభ్రత/ పవిత్రత  ఉండదు ) ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా దుష్టమైన శక్తుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా రక్షణ ఇవ్వగలిగింది  విభూతి.  అందువలన విభూతిని  పెట్టుకోవాలి.
 
చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది. అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది.

తడి విభూతిని ఇలా మంత్రం యుక్తంగా ధరించాలి : 
స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి స్మరించుకోవాలి . 

“భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!” 

అని చెప్పాలి.  విభూతి ధారణ సమస్త పాపములని  పోగొడుతుంది .  భూత,ప్రేత,పిశాచ,రాక్షస గణముల నుండీ రక్షిస్తుంది .  తేజస్సు వృద్ధిని పొందుతుంది . విశేషమయిన ఐశ్వర్యమును, మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి ఆ తడి విభూతిని త్రిపుండ్రాలుగా దిద్దుకోవాలి .  బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు

“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” 

అన్న మంత్రం చెప్పి సజలవిభూతిని (తడి విభూతిని)  ధరించాలి.  ఇవేమీ మనకి చేతకావు అనుకుంటే,  తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి

“శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం”

అని చెప్పాలి. భస్మధారణం వలన ఐశ్వర్యం కలుగుతుంది . ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా, దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమును ఇస్తోంది. అందువల్ల పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరిస్తున్నాను అని దీని అర్థం . 

ఒకవేళ ఈ మంత్రం కూడా చెప్పుకోలేకపోతే,  కనీసంలో కనీసం ‘శివా శివా శివా’ అని మూడు మాట్లు అనాలి. ఆటే మంగళము, శోభనము, భద్రము క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది. 

భస్మధారణ చేసే విధానం :
ఈ మంత్రాలు చెప్పుకున్నప్పటికీ,  విభూతిని మూడు వేళ్ళతో పెట్టుకుంటారు. అలా విభూతి ధారణ చేయరాదు. విభూతిని నీటితో తడిపి మృగముద్ర పట్టమని శాస్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ లేడి/జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది. మూడువేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భాస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుటారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటనవేలు పట్టగలినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. అపుడు బొటన వెలికి సజల విభూతి ఉన్నది కదా – ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు.

భస్మము అంటే ఇదీ :
భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను భస్మము చేయగలదు . 

మన పాపములే ప్రతిబంధకములుగా నిలబడి  ఈశ్వరుడి వైపుకి మనం ప్రయాణం చేయకుండా, మన దారిని  క్షణికమైన భోగముల వైపుకి తిప్పుతుంటాయి . అధర్మబద్ధమయిన, క్షణికమైన  భోగముల కోసం వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’.  భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. 

భస్మం ఇలా తయారవుతుంది :
భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం.

విభూతిని లలాటము పైనే ఎందుకు ధరించాలి :
 భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉంది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మనలోని  జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.

విభూతితో చేసే లింగార్చన ఫలం ఎలాంటిది :
శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం చేసిన వారికి దక్కుతుందని శాస్త్రం .  విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందికి జారగానే, అలా అభిషేకం చేసిన వారి పాపాలు హరించుకుపోతాయి .  శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి, మనస్సు  ఈశ్వరాభిముఖ మవుతుంది . 

 స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని  పట్టుకున్నంత మాత్రం చేత,  ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది. దానిని ధరించినవాడు పరమశివుని ఆశీర్వచనా బలంతో ప్రకాశిస్తూ ఉంటాడు . 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore