Online Puja Services

రాళ్ళు చేపలుగా మారే గుండం

18.191.236.174

రాళ్ళు చేపలుగా మారే గుండం - మహా మహిమోపేతమైన దైవ క్షేత్రం . 
- లక్ష్మి రమణ 

ఈ భారతీయ నేలమీద ఉన్న క్షేత్రాలు సామాన్యమైనవి కావు. కేవలం దైవశక్తి సమన్వితాలు మాత్రమే కావు . అవి ఎన్నో సిద్ధ ఔషదాలకూ ఆలవాలాలు . ‘’నిత్య నాద సిద్ధుడు ‘’అనే యోగి ‘’రస రత్నారం ‘’అనే తన గ్రంధంలో ఇటువంటి వాటిని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలని చెప్పారు . పురాణ ప్రాశస్తి కలిగిన అటువంటి ఒక దివ్యక్షేత్రాన్ని గురించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు సవివరంగా సేకరించి ఇక్కడ మీకు అందిస్తున్నాం . ఈ క్షేత్ర విశేషాలని తెలుసుకున్నాక మనసు భక్తితో మాత్రమే కాక, బోలెడంత ఆశ్చర్యంతో కూడా నిండిపోతుంది . యోగులకి ఇందులో దాగిన ఎన్నో యోగ రహస్యాలు కూడా బోధపడతాయి . ఇంకా ఆలస్యం ఎందుకు, వెళదాం పదండి .

   త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం

ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది .శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం లో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ‘’ అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం .మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది . ఇక్కడ అయ్యవారు త్రిపురాంతకుడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి . 

త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాలు నిలయం .రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి .స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి . ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయం గా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని ‘’తత్పురుష లింగం ‘’అంటారు. 

స్థల పురాణం –త్రిపురాసుర సంహారం

తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని చేదించి వాడిని సంహరించాడు .ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘’ఆదిశైలం’’ అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన’’ కుమార గిరి ‘’ అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు .వీరినే త్రిపురాసురులు అంటారు .తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్న తోబ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు .ఆయన ప్రత్యక్షం కాలేదు.పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యశమై వరం కోరుకోమన్నాదు. ఎవరి చేతిలోనూ చావు కలాగ కూడదని వరం కోరుకొన్నారు. పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు .తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణం తో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలో నే తమకు మృత్యువు రావాలనికోరుకొన్నాడు .సరే నన్నాడు బ్రహ్మ .

తారాక్షుడు బంగారం ,విద్యున్మాలి వెండితో ,కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు .వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం ,అపూర్వ బాణాలు అవసరమనీ చెప్పాడు .వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు .విశ్వకర్మ జగత్తు తత్త్వం తో రధాన్ని ,వేదం తత్త్వం తో గుర్రాలను ,నాగ తత్త్వం తో పగ్గాలను ,మేరు శఖర తత్త్వం తోధనుస్సును ,వాసుకి తత్త్వం తో వింటి నారిని ,సోమ ,విష్ణు ,వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రధ సారధి అయ్యాడు ..అ దివ్య రధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు .

త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం

ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన ,మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రధం భూమి లోకి కుంగి పోయింది .గుర్రాలు నిలవ లేకపోయాయి ధనుస్సు పని చేయలేదు .రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించ లేక పోయి నందుకు కోప పడ్డాడు .ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు . పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు . పర దేవతను ఆత్మలో ధ్యానించాడు .లీలా వినోదిని బాలా త్రిపురాసుందరి గా ఆమె ఆవిర్భవించింది .శివుని ధనుసులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదం లో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది .

‘’అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ ‘’.అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం యెక్కు పెట్టాడు .దేవతలు అప్పుడు ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ‘’అని స్తుతించారు .త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్రబాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి . దేవమునులు సంతసించారు. 

బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది .శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు .ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది .రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు.ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది .పెద్ద గుంట  ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన ‘’వైడూర్య లింగం ‘’గా ఆవిర్భవించాడు .దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది –‘’స్తుతి శ్రుతం గర్త సదం యువానం –మృగన్నభీమ ముప హత్తు ముగ్రం –మ్రుడా జరిత్రే రుద్రస్తవానో –అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’’ . వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు .ఇక్కడ జలలిన్గానికి చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది .

త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి .ఆదిశైలం ,అరుణాచలం ,కుమారాచలం లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి .తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు .

ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కు మారుడైన కుమారస్వామిని చూసి పోతూఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది . 

‘’అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’ పిలిస్తే పలికే దైవం. 

పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట .పాల్కురికి సోమ నాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కథే ఇందుకు  తార్కాణం .ఈ ఆలయానికి నలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి .ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచి ఉంది . దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూల స్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది .ఈయన మహా మహిమ కల దైవం .అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు .దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవా లయం ఉన్నది .పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు .మూల స్తానేశ్వరునికి ఆగ్నేయం గా పంచ బ్రాహ్మల చే ప్రతిస్టింప బడిన ‘’పంచ లింగ దేవాలయం ‘’ఉన్నది .ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి .పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి .దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది .ఇంకొంచెం పైకి ఎక్కితే ఇస్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది దీనికి దక్షిణం గా అద్భుత మహిమలున్న ‘’అగస్త్య లింగం ‘’ఉన్నది దీనినే ‘’ విన్ధ్యేశ్వర లింగం అనీ అంటారు . 

ముఖ్యదేవాలయం దగ్గరే ‘’అపరాజితెశ్వరుడు ‘’ఉన్నాడు మన్యు సూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది .ఆగ్నేయం లో సూక్ష్మ తేజోమయ ‘’యజ్ఞేశ్వర లింగం ‘’వాయవ్యం లో హనుమంతుడు నెలకొల్పిన ‘’మారుతి లింగం ‘’, ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుస్సు బలం యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరం లో చండీశ్వరుడు ,పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిస్తితమైన ‘’ఉగ్రేశ లింగం ‘’ఉన్నాయి .ఉత్తరాన ‘’భేక సోమేశ్వరుడు’’దర్శన మిస్తాడు ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగాచేయాలి. ఆలయం లోని బలిహణలను భక్షిస్తాడు ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకలాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది . ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది . 

గర్భాలయానికి నైరుతి దిశలో ‘’చీకటి మిద్దె ‘’అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది .వృశ్చిక మల్లెశ్వరాలయానికి దగ్గర ‘’లో మఠం ‘’ఉంది .శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చిన్చాటానికి సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు .ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది .దాని మూలం లో భైరవుడు ఉంటాడు .దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది .అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండం లో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట .ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు .ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని ‘’నిత్య నాద సిద్ధుడు ‘’అనే యోగి ‘’రస రత్నారం ‘’అనే గ్రంధం లో రాశాడు .చీకటి మిద్దె ప్రకనే ‘’మహా గణపతి మండపం ‘’ఉంది .విగ్రహం శిదిలమైతే ప్రక్కన కింద పెట్టారు.

శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది శివాలయం

ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు అలాటి అరుదైన దేవాలయం ఇది .’’శ్రీ చక్రం శివ యొర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం .స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట .అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి .లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు .జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండడ కిందఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిస్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేత్రులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం ,డమరుం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది .అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది .

స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది ఇందులో స్నానిస్తే పుణ్యం మోక్షం .త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది .చెరువులో కలిసిపోయింది .మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది .దీనికి ‘’పాప నాశనం ‘’అనిపేరు .నాలుగు కొండల మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని .కుమార గిరికి పడమర దూర్వా నది లేక దువ్వలేరు ఉన్నది .ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు .దీనికి దక్షిణం లో ‘’ముక్త గుండం ‘లో స్నానం చేస్తే మోక్షమే .

తీర్దాలు-మిగిలిన గుడులు

త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం .కుమార గిరికి దక్షణాన భైరవ గిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం .పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు పడమరలో శ్రీ రామ నాదేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు .ఉత్తరాన ఉన్న కొండడను పూల కొండ అంటారు ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది .ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట .దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది .దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది .ఇది సర్వ రోగ నివారిణి .తూర్పున పంచ బ్రాహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి .వాయవ్యం లో లింగాల కొండ ఉంది .ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట .ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట .ఇకడే దివ్యౌ షది’’సంజీవిని ‘’ఉన్నాడని జ్ఞానులు చెబుతారు .

ఈ క్షేత్ర దర్శనం వలన కామ్యములన్ని తీరడమే కాకుండా యోగోన్నతి, మోక్షము సిద్ధిస్తుంది. 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore