Online Puja Services

శివ స్వరూప సత్యమిది!

3.144.212.145

శివరాత్రినాడు తెలుసుకోవలసిన శివ స్వరూప సత్యమిది!
సేకరణ: లక్ష్మి రమణ  

శివుడంటే ఎవరు? ఎందుకా దేవతా సర్పం సోమసూత్రం నుండీ ప్రవేశించి, గ్రహణ సమయంలో  బిల్వదళాన్ని స్వామికి అర్పించి, అదే సోమసూత్రం నుండీ గ్రహణ సమయానంతరం బయటికి వెళ్ళింది? శివరాత్రినాడు తెలుసుకోవలసిన శివ స్వరూప సత్యమిది . 

‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో ఒకానొక ప్రత్యేకత, విశిష్టత ఉంది. పరమ శివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం.

‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసేవాడు, శివుడు. ‘శీతే సజ్జన మనస్సు ఇతి శివః’ - సజ్జనుల మనస్సులలో శయనించి ఉండేవాడు, శివుడు. ‘శివం వేదః తద్యోగాత్’ శివమంటే వేదము. ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపజేసే వేదము - శివమవుతుంది. దాని యోగము గలవాడు శివుడు. శివప్రదత్వాత్ శివః మంగళములను, శుభములను ఇచ్చేవాడు - శివుడు. ఇలా అనేక వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ముఖ్యమయినది మరోటుంది. ‘శం నిత్య సుఖమానంద మికారః, పురుషః స్మృతః వకారః శక్తిరమృతా మేళనం శివ ఉచ్యతేః’ అన్నది శివపురాణమే. ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారం - పరమ పురుషుడు. ‘వ’కారం అమృత స్వరూపిణి అయిన శక్తి. ఈ ముగ్గురి కలయికయే ‘శివం’ అవుతుంది. ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థం.

పరమశివుని కంఠం నుండి బయల్వెడిలింది ఓంకారము. దాన్ని విడదీస్తే ‘అ ఉమ్’ అయింది. ‘అ’ను ‘మ్’ ప్రక్కన చేరుస్తే ‘ఉమ’ అయింది. ఉమ అంటే బ్రహ్మ విద్య. ఓంకారం బ్రహ్మవిద్య. అందుకే ‘ఉమ’ను పరమశివుడు ఎప్పుడూ తన దేహార్ధ భాగంలో ఉంచుకొంటాడు. వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది. వారి భార్యాభర్తృ సంబంధము నిత్యము, శాశ్వతము. దీనిననుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడింది. పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు, ఆదిదంపతులు. ‘సనాతన’ అంటే ఎల్లప్పుడూ, నిత్యనూతనం అని అర్థం.

కాళిదాస మహాకవి తన రఘువంశ, కుమార సంభవములనెడి కావ్యముల ద్వారా భారతీయ దాంపత్య వ్యవస్థను పార్వతీపరమేశ్వరుల ద్వారా చెప్పాడు.

వాగర్థా వివసంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ - పార్వతీ పరమేశ్వరులు వాగర్ధములలాగా శాశ్వత సంబంధం కలవాళ్లు. సప్త మహర్షులు హిమవంతుని దగ్గరకు, పరమశివుని తరఫున రాయబారంగా వెళ్లి, ‘తమర్థ మివ భారత్యాసుత యోక్తు మర్హసి’ వేద వాక్కుతో పరమార్థము జత చేసినట్లు, యోగము చేసినట్లు, నీ కూతురైన పార్వతితో, శివుని యోగము చేయమన్నారు. అందుకే, శివరాత్రి రోజున లింగానికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటే, ఇటు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇదే మహా శివరాత్రి మహోత్సవమంటే.

వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం. కనిపించనిదంతా - అవ్యక్తం. ఆ అవ్యక్తం - శివస్వరూపం. ‘వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అర్ధనారీశ్వర తత్త్వం. ఉమాశంకరుల యోగమునకు విష్ణువని పేరున్నదని రుద్ర హృదయోపనిషత్ చెబుతోంది.

బాగా వికసించిన పుష్పములుగల వృక్షము నుండి చాలా దూరము వరకు సుగంధ పరిమళము వ్యాపిస్తుంది. పుణ్యకర్మలు చేసేవాడి నుంచి మంచి సుగంధము వస్తుంది. పరమశివుడు అనే తీగకు వేద రూప పుష్పములు పూయటం వలన, ఆ తీగె నుండి మంచి విద్యాగంధము వీస్తుందిట. ఆ గంధము ప్రజలకు పుష్టిని, వృద్ధిని సమకూరుస్తుంది. ఇహపరముల నిస్తుంది. అందుకే శివుణ్ణి ‘సుగంధి’ అని వేదము వర్ణించింది.

‘త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షేయ మామృతాత్’

- ‘యజుర్వేదం త్రినేత్రుడు, పరిమళమును వెదజల్లువాడు, మంచి పుష్టిని చేకూర్చువాడు అయిన రుద్రుణ్ణి మేము ఆరాధించుచున్నాము. దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లు ఆ రుద్రుడు, మమ్మల్ని మృత్యువు నుండి వేరుచేసి, కాపాడి అమృతత్త్వాన్ని చేకూర్చుగాక’ అని అంటూ, మహాశివునికి లింగోద్భవకాలంలో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం.

ప్రతిమాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. ‘శివరాత్రి’ అనే పదానికి, శుభప్రదమైన, మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి ‘చీకటి’ కదా.. అజ్ఞానానికి సంకేతం. ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, లింగోద్భవ కాల జ్ఞాన జ్యోతి దర్శనం, బిళ్వార్చన, నామసంకీర్తన, శివపార్వతుల కళ్యాణం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగింపబడుతుంది.

శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ‘చంద్రమా మననో జాతః’ మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుని కళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి, చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే. మనసుకు చేరిన 16 మాలిన్యములు (అష్టమదములు, అరిషడ్వర్గములు, మనస్సు అహంకారం) ఒక్కటే శేషించి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసేది - శివపూజ, శివాభిషేకం, శివనామ సంకీర్తనం.

ఇక్కడే మనం మార్కండేయుడి కథను, ఆధ్యాత్మికతను జ్ఞప్తి చేసుకోవాలి. ‘మనుష్యాణాం సహస్రేషు’ అన్నట్టు, కోటికొకడుంటాడు. పట్టుదలగల సాహసికుడు, సాధకుడు. పట్టుదలుంటే చాలదు, పట్టుకోవటానికొక ఆలంబనముండాలి. అదే శివాకార వృత్తి. ‘లీనంగమయ తేతి లింగం’ అఖండమైన జ్ఞానం. మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకొన్నాడంటే ఏమిటి అర్థం? 16 ఏళ్ల వయసుకే మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు కాలధర్మం చెందవలసి ఉంది. దీనికి ప్రతీకారం చేయాలని శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడు వచ్చి కాలపాశం వేశాడు. కానీ, శివలింగం వాటేసుకున్నాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమైనాడు, కాలుణ్ణి పంపించి, అజరామరుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి.

పదహారేళ్లవోకావు - షోడశ కళాత్మకమీ ప్రపంచం. కాలం వల్లనే దానితో సంబంధం. అది కాలంతోటే తిరుగుతుంది. అదే మృత్యువు. అదే కాలపాశం. కాలమనే పాశం. దాన్ని జయించే మార్గం - శివాకార వృత్తి. మృత్యుభయం లేదు. మానవుడికి, అమృతత్త్వానే్న ప్రసాదిస్తుంది.

అసలు అమృతమనేది ఎక్కడుంది? అది సంసారంలోనే ఉంది. విషం లాంటి మృత్యువూ ఉంది. మన జీవిత సాగరాన్ని మధించాలి, అపుడు రెండూ దర్శనమిస్తాయి. హాలాహలం లాంటి కాలాన్ని కబళించి, కాలాతీతమైన శివతత్త్వమే నా స్వరూపమని గుర్తు చేసికొంటే అమృతత్వం లభిస్తుంది. త్యాగగుణం అలవడుతుంది. త్యాగం - నిశ్చల నిర్మల మనస్సునిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్త్వ మనసుః’ అన్నది శ్రుతి. దీనే్న బోధిస్తుంది మహాశివరాత్రి.

శివుణ్ణి సాకారంగా అనగా మూర్తమైన విగ్రహంగా తీసికొంటే- ఆయన భస్మానులేపనం, పృథివికి, గంగాజటాజూటం - జలానికి, ఫాలనేత్రం - అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే, చంద్ర శేఖరత్వం మనస్సుకి, వృషభ వాహనం బుద్ధికి, గజచర్మ ధారణం అహంకారానికి, త్రిశూల ధారణం - త్రిగుణాలు తన కధీనమై ఉన్నాయని, త్రిగుణాతీతుడని వివరిస్తాయి. అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉందంటే ఏమిటి అర్థం? చిద్రూపం శివ తత్త్వమైతే, సద్రూదం శక్తితత్త్వం. సచ్చిత్తులు అవినాభూతమయినవని చెప్పేది అర్ధనారీశ్వర తత్త్వం. 

‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నారు.

ఈ సంకేతాలతో పంచభూత లింగ క్షేత్రములుగ శివయ్య వెలుగొందుతున్నాడు .  
 
పంచభూతములనగా - ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. శివునికి భూతపడి అనే నామము ఉంది. అందుకే ‘ఈవావాస్య మిదం సర్వం’ అన్నది శ్రుతి. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమ శివుడు దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. అవి, చిదంబరంలోని ఆకాశలింగం, శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగము, అరుణాచలములో తేజో (అగ్ని), లింగము, జంబుకేశ్వరములో జలలింగము, కాంచీ క్షేత్రములో పృధివ లింగ రూపములు. ఇవే పంచభూత లింగ క్షేత్రములు.

మాఘ మాసంలో చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఈ రోజు శివుడు తేజోమయంతో లింగాకారం నుండి ఆవిర్భవించాడు. ‘అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్, అహేగ్‌ంశ్చ సర్వాజ్ఞమ్భయస్థ్య ర్వాశ్చయాతు ధాన్యః’ దేవతలకు ప్రప్రథమ వైద్యుడు రుద్రుడు. అందు శివునికి అభిషేకం చేస్తే సర్వరోగములు నశిస్తాయి. ఆయన గొప్ప శస్త్ర చికిత్సా నిపుణుడు. మనిషికి ఏనుగు తలను పెట్టినవాడు. అందుకే వైద్యులు లోపల శస్త్ర చికిత్స చేస్తుంటే జయప్రదంగా జరిగి, స్వస్థత చేకూరాలని, మానసికంగా రుద్రనమకాన్ని ముఖ్యంగా ఈ మంత్రాన్ని ‘అఘారేభ్యో...’ అనే మంత్రాన్ని పఠించి, దైవ బలాన్ని కూడా అర్థిస్తారు.

ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్త్వానికి ‘నంది’ అలా గుర్తు. జీవతత్త్వములోని పశుతత్త్వం. పశుతత్త్వముతో కూడిన ఈ జీవతత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది. నందిని, ఈశ్వరుడిని రెండుగా విభజించి చూస్తారు. నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డు తగలకూడదు. అంటే జీవునికి, పరమాత్మకు అడ్డం ఉండకూడదు. నంది ధర్మానికి ప్రతీక. జీవుడు నంది శృంగముల మధ్య నుంచి లోపలున్న పరమాత్మను దర్శిస్తాడు. తనలో ఉన్న పశుతత్త్వాన్ని అణచివేసుకొని, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు. అప్పుడు నంది, ఈశ్వరుడు అని రెండుగా ఉండవు. ‘నందీశ్వర’ అని రెండూ ఏకమై పోయినాయి. అప్పుడు అన్నీ ఒకే తత్త్వంగా భాసిస్తాయి. ఇదే శివరాత్రి మనకు అందించే ఆధ్యాత్మికత.

బిళ్వార్చన విశిష్టతను, ఆంతర్యాన్ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయ. బిల్వపత్రం మూడు దళములతో కూడి ఉంటుంది. మానవులను ప్రభావితం చేసే త్రిగుణములకు, త్రికాలములకు, త్రితాపములకు ప్రతీక ఈ పత్రం. ఈ శరీరమే బిల్వదళం. త్రిగుణముల ఏకత్వమును సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఆ ఏకత్వమును సూచిస్తుంది బిల్వదళార్చన.

తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గరలో ఉన్న చిన్న శివాలయంలో గ్రహణ సమయంలో ఒక దేవతా సర్పం ఆలయంలోని బిల్వ వృక్షం మీదకు ప్రాకి బిల్వదళాల్ని తుంచి, సోమ సూత్రం గుండా శివాలయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచి, లింగాన్ని చుట్టుకొని, గ్రహణ సమయమంతా లింగం దగ్గరే ఉండి, గ్రహణం విడిచిన తరువాత, అదే సోమసూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వార్త, ఫొటోలు కూడా పత్రికలలో వచ్చినాయి. ఇది బిల్వపత్రార్చన విశేషం.

మనలోని కామ పిశాచాన్ని, పశు రాక్షస తత్త్వాన్ని, దహింప చేసికోవాలి. పాశుపతమైన ఈ దీక్ష మనకుంటే, పశుపతి అనుగ్రహం మనకు లభిస్తుంది. తిరోధన అనుగ్రహాలు రెండూ పరమ శివుని చేతిలో ఉంటాయి. తిరోధానంతో శివుడే జీవుడయ్యాడు. అనుగ్రహంతో మరలా జీవుడైన తానే శివుడే భాసించాడు. ఇదే మహా శివరాత్రినాడు మనం తెలిసికోవలసిన శివలీలా వైభవం.

నాదతనుమ నిశం- శంకరం, నమామియే మనసా శిరసా అని చిత్తరంజని రాగంలో త్యాగరాజ స్వామి కీర్తించిన కృతి, మహాశివరాత్రికి సంపూర్ణ స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది.

కాబట్టి ఆ సర్వేశ్వరుడైన శివస్వరూపాన్ని యధోచితంగా ప్రార్థించి, ఆయన తత్వాన్ని అర్థం చేసుకొని , స్వామీ కృపకి పాత్రులవుదాం . శుభం . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore