Online Puja Services

చాలా అరుదైన శైవ క్షేత్రాలు

18.218.168.16
ప్రత్యేక విశిష్టతలు కలిగిన అరుదైన శైవక్షేత్రాలు
 
సృష్టిలయ కారకుడైన మహాశివుడికి సంబంధించిన కొన్ని అరుదైన శైవక్షేత్రాలు ఈ భూమండలంలో వున్నాయి. వాటిల్లో ఒక్కో క్షేత్రానికి అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఆ క్షేత్రాలేంటో.. ఎక్కడున్నాయో తెలుసుకుందామా..
 
1* సిద్ధేశ్వరాలయం - నందిలేని శివాలయం :
 
‘శివాలయం’ అనగానే శివుని విగ్రహం ఎదురుగా నంది వుంటుంది. కానీ అనంతపురం జిల్లా అమరాపురం హేమావతి గ్రామంలోని వుండే సిద్ధేశ్వరాలయంలో మాత్రం శివుడి ఎదురుగా నంది వుండదు. ఇదే ఆలయంలోని ప్రత్యేకత! ఇక్కడ శివుడు ఉగ్ర రూపుడిగా దర్శనమిస్తాడు. ఇందుకు ఓ పురాణగాధ కూడా వుంది. అదేమిటంటే... దక్షయజ్ఞం జరిగిన సమయంలో భర్త (శివుడు) వద్దన్నా తండ్రి చేసే యాగానికి సతీదేవి వెళ్తుంది. అప్పుడు సతీదేవి వెంట తన వాహనమైన నందిని తోడుగా పంపుతాడు శివుడు. అయితే అక్కడ జరిగిన అవమానానికి సతీదేవి తన ప్రాణాలను అర్పిస్తుంది. సతిని కోల్పోయిన శివుడు ఉగ్రతాండవం చేశాడు. ఆ ఉగ్రశివుడి రూపమే ఇక్కడ మనకి కనిపించేది. సతి వెంట నంది వెళ్ళినందున ఈ శివాలయంలో నంది విగ్రహం వుండదు. ఈ ఆలయాన్ని ఈ ప్రాంతాన్ని పాలించిన శివభక్తుడు నాళంబరాజు కట్టించాడు.
 
2* ముక్తేశ్వరాలయం - ఆరు నెలలు మాత్రమే తెరిచే శివాలయం :
 
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు, కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామాల మధ్య కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడిగా పూజలందుకునే శివుడు.. సంవత్సరంలో ఆర్నెల్లపాటు కృష్ణమ్మ ఒడిలో దాగుంటాడు. ఆ సమయంలో స్మామిని దేవతలు ఆరాధిస్తారని ప్రతీతి. కృష్ణమ్మ వరద తగ్గినప్పుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం కూడా వుంది. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం. ఇక్కడ అమ్మవారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారు. అంటే, ఇక్కడ రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.
 
3* శ్రీ ఉమా కొప్పులింగేశ్వరుడి - శివలింగానికి ఝటాఝూటం :
 
సాధారణంగా శివుడిని ఝటాఝూటంతో చూస్తాం. కానీ.. లింగరూపంలో వున్న స్వామిని ఝటాఝూటంతో వుండే ఆ స్వామి దర్శనం కావాలంటే, తూర్పుగోదావరి జిల్లాలోని పలివెల వెళ్ళాల్సిందే! అక్కడ శివుడు శ్రీ ఉమా కొప్పులింగేశ్వరుడిగా దర్శనమిస్తాడు.
 
4* లింగోద్భవ క్షేత్రం - తేజోలింగ స్వరూపం :
 
తేజోలింగ రూపంలో ఆ శివుడిని దర్శించుకోవాలనుకుంటే గుంటూరు జిల్లా చందోలు వెళ్ళాలి. లింగోద్భవ క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రంలో 11 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వైశాల్యం కలిగిన నల్లరాతి శివలింగం వుంది. లింగంపై హంస రూపంలో బ్రహ్మ, అడుగుభాగాన వరాహ రూపంలో విష్ణుమూర్తి రూపాలు కనిపిస్తాయి.
 
5* కపోతేశ్వరాలయం - శివలింగంపై పావురాలు :
 
శివలింగం పైభాగంలో రెండు పావురాలు, మంటపంలో నంది వెనుక భాగంలో వేటగాడు.. ఇలా ఈ విధంగా వుండే శివుడి ఆలయం తూర్పుగోదావరి జిల్లా కడలిలో వుంది. కపోతేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకమైంది.
 
6* లింగరూపంలో పార్వతీ పరమేశ్వరులు :
 
లింగరూపంలో పార్వతీ పరమేశ్వరుల కొలువై వున్న పుణ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రం దక్షణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని సూర్య గ్రామంలో వుంది. ఇక్కడ శివరుద్ర స్వామి లింగ రూపంలో వెలిశాడని ప్రతీతి. దేవాలయానికి సమీపంలో ఒక ఉద్యానవనం వుంటుంది. ఇందులో రెండు శిలారూపాలుంటాయి. వీటినే శివపార్వతులుగా భావించి పూజిస్తారు భక్తులు. ఇక్కడి విశేషం.... మనం కోరిన కోర్కె తీరితే ఆ కోర్కెని బొమ్మ రూపంలో స్వామికి మొక్కుగా చెల్లించాలి.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore