Online Puja Services

సుమంగళిగా దీవించే సోమవార వ్రత మహత్యం.

13.58.216.18

భార్యాభర్తల అన్యోన్యతని పెంచి, సుమంగళిగా దీవించే సోమవార వ్రత మహత్యం. 
- లక్ష్మి రమణ 
 
శివునికి సోముడు అని పేరు. ‘సోమ: ఉమయాసహిత: శివ:’ అంటే, సోమ శబ్దానికి పార్వతీదేవితో కలిసి ఉన్న శివుడని అర్థం .  ఈ ఆది దంపతులని వారికి ఇష్టమైన సోమవారంనాడు పూజిస్తే, సకల శుభాలూ కలుగుతాయి . భార్యాభర్తలకి మంచి అన్యోన్యత కలుగుతుంది . సంసారం అనే సాగరాన్ని దాటడానికి కావలసిన శక్తి లభిస్తుంది . పిల్లలు ఆరోగ్యంగా , పూర్ణాయుష్హుతో మంచి నడవడిక గలిగిన వాళ్ళయితారు . పార్వతీ పరమేశ్వరుల ఆరాధనలో విశిష్టమైన ఈ వ్రతాన్ని గురించిన కథని స్కాందపురాణం ఇలా వివరిస్తుంది. నలదమయంతుల మనుమడైన చంద్రాంగదుని ఎడబాసిన అతని భార్యకి మైత్రేయి మాత ఈ వ్రత మహత్యాన్ని వివరిస్తారు. ఆ తర్వాత వారిద్దరూ ఒక్కటై జీవిత పర్యంతమూ ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించారు . విధంగా ఆ దంపతులిద్దరూ కూడా  వ్రతాన్ని ఆచరించినప్పుడు జరిగిన ఒక గొప్ప మహాత్యాన్ని తెలుసుకుందాం. 

సోమవార వ్రత మహిమ - 

విదర్భ దేశములో వేదమిత్రుడు, సారస్వతుడు అని ఇద్దరు బ్రాహ్మణ స్నేహితులుండేవారు . వేదమిత్రుని కొడుకు సుమేధుడు. సారస్వతుని కొడుకు సామవంతుడు. వీరిద్దరు కూడా ఒకే గురువు దగ్గర విద్యలన్నీ  అభ్యసించి పండితులయ్యారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా ! విద్యలకి , పాండిత్యానికీ లోటులేకపోయినా, ఆ పండితులకి సంపదలకు మాత్రం లోటే. కొడుకులిద్దరూ పెళ్ళీడుకి రావడంతో, వాళ్ళని రాజుగారి ఆస్థానానికి పంపి, వలసినంత ధనం సంపాదించుకొనేలా చెయ్యాలని ఆ తండ్రులు ఆలోచించారు .  కొడుకులిద్దరూ వారి తండ్రుల మాటని గౌరవించి రాజాస్థానానికి బయలుదేరారు . 

రాజదర్శనము చేసి, తమ పాండిత్యప్రకర్షను ప్రదర్శించారు. ఆ రాజు గారు, బహుమతిగా మీకేమి కావాలి అని అడిగారు. ‘రాజా !మేము  వివాహము చేసుకోవాలి అనుకుంటున్నాము. కాబట్టి మా సంసారము గడుపుకోవడానికి తగిన బహుమాన మిప్పించండి’ అని అడిగారు. 

రాజుగారు మంచివారే ! కానీ బుద్ధి కొంచెం కొంటెది . అందువల్ల ఆయనన్నారు ,  "మీలో ఒకరు ఆడ వేషము వేసుకొని,  భార్యాభర్తల లాగా నటిస్తూ , నిషధ రాజైన చంద్రాంగదుని దగ్గరికి వెళ్ళండి . ఆయన భార్య సీమంతిని మహాశివభర్తురాలు.  సోమవారమునాడు వ్రతము చేసి, అందులో భాగముగా  దంపతీపూజ చేసి, అపరిమితమైన ధనములను కానుకగా సమర్పిస్తారు. వాటిని తెచ్చుకున్నట్టయితే మీ దరిద్రం తీరిపోతుంది " అని చెప్పారు. 

సుమేధుడు , సామవంతుడు ఇద్దరూ కూడా పండితులే ! యుక్తా యుక్త విచక్షణ తెలిసినవారే ! డబ్బు కోసం ఇటువంటి దొంగపనికి వాళ్లిద్దరూ కూడా ఇష్టపడలేదు . కానీ రాజుగారు ఇది రాజాజ్ఞ . మీరిలా చేయవలసిందే అని వారిని బలవంతపెట్టారు . పైగా  అంత:పుర పరిచారికలను పిలిచి,  సామవంతునికి ఆడవేషము వేయించారు. దాంతో  వారు సంకోచిస్తూనే, నిషధ సామ్రాజ్యం చేరారు . 

చంద్రాంగదుడు, సీమంతిని దంపతులు చేసే వ్రతముకు దంపతులుగా వెళ్లారు. ఆవిడ నిజంగానే మహా భక్తురాలు . వీరిని చూసీ చూడగానే , నిజము గ్రహించారు . అయినా, నవ్వుకొని, పీఠముపై కూర్చుండబెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసి, సమస్తోపచారములతో యథావిధిగా పూజించారు.  షడ్రసోపేతమైన విందు చేసి అపారమైన ధనములను దక్షిణగానిచ్చి సాగనంపారు . 

వాటన్నింటినీ తీసుకొని వారు తిరుగు ప్రయాణమయ్యారు . దారిలో సామవంతుడు, సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలుపెట్టాడు . సుమేధుడు, "ఏమిరా! నిజముగానే అమ్మాయివైపోయానని అనుకుంటున్నావా? విచిత్రంగా మాట్లాడుతున్నావ్ ?” అన్నాడు . అప్పుడు  సామవంతుడు "అవును సుమేథా! నేను ఇప్పుడు నిజంగా నే అమ్మయిగా మారిపోయాను . ఒక్కసారి నన్ను పరిశీలనగా చూడమన్నాడు .  “ సుమేధుడాశ్చర్యపడి ఆమెను నిశితముగా చూశాడు. 

సామవంతుడు నిజముగానే  స్త్రీ అయ్యాడు . సుమేధుడు "నీవు నిజముగా స్త్రీవైతే నిన్ను నేనే పెళ్లిచేసుకుంటాను. పద మనం మన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చెబుదాం అనుకుని ఇంటికి చేరారు . 

సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీయైనందుకు విచారించాడు.  రాజుదగ్గరికి వెళ్లి , "నీ ధూర్తత్వము వల్ల  నా కొడుకు స్త్రీగా మారిపోయాడు . నాకు వంశాభివృద్ధి లేకుండా పోయింది . రాజులకు ఇటువంటి పరాచికాలు తగవని” హితవు చెప్పారు .  రాజు కూడా సామవంతుడు  నిజముగా స్త్రీగా మారినందుకు ఆశ్చర్యపోయాడు .  సోమవారవ్రత మహాత్మ్యమును గ్రహింపలేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తాపము పొంది, వీరందరితో కలిసి దేవాలయమునకు వెళ్లి నియమముతో నిరాహారుడై మూడు రోజులపాటు జగన్మాతని ఆరాధించి, ఆమె శరణు వేడారు . 

దేవి ప్రత్యక్షమయ్యింది.  రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి, తన అపరాధమును మన్నింపుమని ప్రార్థించారు.  "తల్లీ! ఈ స్త్రీగా మారిన యువకుని మరల పురుషునిగా జేయు"మని కోరారు.  ఆ తల్లీ.. "రాజా! నా భక్తురాలి భావనను మార్చే శక్తి నాకు లేదు. ఈమె సుమేధునికి తగిన భార్య.  సారస్వతునికి వంశోద్ధారకుడైన మరో కుమారుడు కలుగుతాడని " వరమిచ్చింది. జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికిచ్చి సారస్వతుడు పెండ్లి చేశాడు . అతనికి తరువాత ఒక కొడుకు పుట్టాడు . 

ఈవిధంగా సోమవారం వ్రతం చేసి, పార్వతీ పరమేశ్వరులని అర్చించడం వలన భార్యాభర్తల మధ్య అనురాగాలు చిగురిస్తాయి.  వంశం నిలబడుతుంది . ముఖ్యంగా మహిళలకి అఖండమైన సౌభాగ్యాన్ని ఆ ఆదిదంపతులు అనుగ్రహిస్తారు . శుభం . 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda