Online Puja Services

కాలమేఘమే తానైన పెరుమాళ్,

18.118.200.136

కాలమేఘమే తానైన పెరుమాళ్, మానసిక వ్యాధులకి మందైన చక్రత్తాళ్వార్ .  
- లక్ష్మి రమణ 

మోహినిగా ఉన్న మహావిష్ణువు రాక్షసులని మాత్రమే మైమరపించలేదు, ఆ రూపంలో పరమేశ్వరుడు కూడా మైమరపుకి గురయ్యేలా చేసి , పరమ ప్రకృతిని తానేనని రుజువుచేశారు.  ఆ దివ్యమైన రూపం ఒక కారుమేఘమే. నీలమేఘశ్యాముని ఆ దివ్యరూపం సందర్శన భాగ్యాన్ని పొంది, ఆ కారుమేఘము వర్షించే అనుగ్రహ వృష్టిలో తడిసిపోవాలనుకుంటే , ఈ ఆలయాన్ని  తప్పక దర్శించాలి. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న చక్రత్తాళ్వార్ (సుదర్శనుడి) ఆలయాన్ని దర్శిస్తే, శత్రుబాధలు నివృత్తవుతాయి. మానసిక  నయమవుతాయి. అంతకు మించి ఈ ఆలయ దర్శనం మనకి అమితమైన ఆశ్చర్యాన్ని, దివ్యఅధ్యాత్మిక సౌరభాన్ని పంచుతుంది . రండి ఈ ఆలయాల దర్శనానికి వెళదాం . 

  శ్రీమన్నారాయనుణు ఎన్నో రూపాలలో, దివ్య అవతారాలతో ఈ భువిని పావనం చేశారు. వరాహునిగా, వామనుడిగా , రామునిగా, కృష్ణుడిగా, నారసింహునిగా ఇలా ఎన్నోరూపాల్లో తన అనుగ్రహాన్ని, మానవలోకానికి మార్గ నిర్దేశకత్వాన్ని ప్రసాదించారు. తానె స్వయంగా కలియుగంలో భక్తులని అనుగ్రహించడానికి 108 దివ్య దేశాలలో కొలువై ఉన్నారు .  

ఆ విధంగా శ్రీమన్నారాయణులు  వెలసిన పవిత్రమైన దివ్య దేశాలు లేక మంగళాశాసనాలలో సుమారు 60 కోవెలస్థానాల్లో స్థానకభంగిమలో అంటే నిల్చున్నభంగిమలో దర్శనమిస్తున్నారు. ఆ 60 దివ్య దేశాలలో ఒక దివ్యదేశమే  తమిళనాడులోని మదురై పట్టణానికి దగ్గరున్న తిరుమోగూరు. మూర్తి, తీర్థం, స్థలం అంటూ మూడు విధాలుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో దర్శనమిస్తున్నహరిని  కాలమేఘ పెరుమాళ్ గా భక్తులు కొలుచుకుంటున్నారు.

 కాలమేఘ పెరుమాళ్ళుగా స్వామి వెలసిన గాథ ఇదీ :

అమృతమథనం జరిగిన తరువాత దొరికిన అమృత భాండాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళిపోవడంతో దేవతలంతా వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. ఈలోపు అమృతభాండాన్ని లాక్కుపోయిన రాక్షసులు ఒకరితో ఒకరు పోట్లాడుకోసాగారు. బలంగల వాళ్ళ మధ్య అమృత భాండం చేతులు మారుతోంది.

సరిగ్గా ఆ సమయంలో వారి మధ్య శ్రీహరి మోహనాకారంతో మోహినీరూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ మోహినిని చూడడంతోటే  రాక్షసులు మదనోద్రేకంలో మునిగిపోయారు. ఆ మాయలో మోహినీని సమీపించి దేవతలూ దానవులూ ఇద్దరూ కశ్యప సంతతే అనీ, అన్నదమ్ములైన తమకు అమృతాన్ని పక్షపాతరహితంగా పంచి పెట్టాల్సిందిగా ఆమెని కోరారు. తన చూపులతో రాక్షసులను వశం చేసుకున్న మోహినీ, వాలుచూపులతో ఆ అమృతభాండాన్ని పట్టుకొని గజ్జెల మోతలతో, తాను అమృతాన్ని పంచాలంటే అందరూ వరుసల్లో కూర్చోవాలని ఆనతిచ్చింది. రెండు వరసులుగా కూర్చున్న రాక్షసులకు మాటలనే అమృతంగా కురిపించి, అమృతం ఆశ చూపించి, వాళ్ళను దగ్గరకు రప్పించి, చేత్తో వెనక్కి తోసేది. ఆ స్పర్శకే రాక్షసులు సమ్మోహితులైపోయే వారు. అలా రాక్షసులను మరిపించిన మోహినీ దేవతలకు అమృతాన్ని పంచింది.

రాక్షసులకు ఒక్క చుక్కకూడ అమృతం దక్కకుండా చేసిన మోహినీని , ఆ మాయా స్వరూపమ్లో తాము పూజించుకోలేము కనుక , భగవంతుని నిజ స్వరూపంలో దర్శనమియ్యమని ప్రార్ధించారు . ఆ విధంగా వారి కోరికని మన్నించి తిరుమోగూరులో కాలమేఘ పెరుమాళ్ళు రూపంలో కొలువైనట్లు స్థలపురాణ కథనం.

మొహమనే మాయ తొలగిపోతేనే కదా దైవము యొక్క దివ్యత్వం, ప్రక్షశం దర్శనమవుతుంది . ఆ మాయా కాలమేఘము కరిగి పోవడం కేవలం ఆ విష్ణుపరమాత్ముని అనుగ్రహం వలన మాత్రం ఏసాధ్యం . దాన్ని అనుగ్రహించే స్వామి కాలమేఘ పెరుమాళ్ళు . మేఘానికి ఉన్న మరో స్వభావం కుంభవృష్టిని కురిపించడం . నీలమేఘశ్యాముడైన ఈ శ్రీహరిని పరమాత్మునిగా తెలుసుకొన్న వారికి ఆయన అనుగ్రహం కూడా ఆ కాలమేఘం కరిగిపోయిన తీరుగా కుంభవృష్టిలా కురుస్తుందని ప్రతీతి .  

స్వామివారి దర్శనం : 

గర్భగృహంలో తూర్పు ముఖంగా కొలువైయున్న స్వామివారు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా దర్శనమిస్తున్నారు. పూర్తిగా నీటిలో నిండిన మేఘశరీర వర్ణంతో శంఖు చక్రధారిమై గోచరిస్తున్న స్వామివారు, పేరుకు తగ్గట్లుగానే భక్తులపై తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరిస్తున్నాడు. కాలమేఘ పెరుమాళ్ సన్నిధికి దక్షిణ భాగంలో తాయారుసన్నిధి ఉంది. ఈ తల్లిని మోహనవళ్లి తాయారులేక మోహనవళ్లి లేక తిరుమోగూరు వల్లి అని పిలుస్తుంటారు. ఈ ఆలయ ఊరేగింపులలో స్వామివారు మాత్రం  బయటకు వస్తారు తప్ప, తాయారు మాత్రం ఆలయగడపను దాటి బయటకురారు. అందుకే భక్తులు, తాయారును "గడప దాటని పత్ని" అంటూ పిలుచుకుంటారు.

ఆలయ రెండవ ప్రదక్షినా మార్గంలో పాలసముద్రంలో శయించినట్లున్న స్వామివారి ప్రతిమ మనలను విస్మయానికి గురిచేస్తుంది. ఇక్కడ ఇద్దరు తాయారులు స్వామి వారికి మేలుకొలుపు పాడుతుండటం విశేషం! అందుకే ఈ శయనమూర్తిని ప్రార్థనాశయనమూర్తి అని అన్నారు. ఈ స్వామివారికి ద్వాదశినాడు తిరుమంజనం చేయిస్తే అనంత పుణ్యఫలం కలుగుతుందని ప్రతీతి.

నారసింహ చక్రత్తాళ్వార్ : 

ఈ ఆలయ ప్రాంగణంలో చక్రత్తాళ్వారే స్వయంగా తిరుగుతుంటారని, ఈయన దర్శనం చేసుకుంటే శత్రుబాధలు ఉండవని విశ్వాసం. ఇక్కడ  సుదర్శనుడు ఒక చక్ర రూపంలో ఉంటాడు. చక్రానికి చుట్టూతా చాలా పదునైన అంచులు చాలా ఉన్న జ్యోతి రూపాలు ఉంటాయి. అంటే నిప్పులు కక్కుతూ ఊచకోతకోసే సుదర్శన చక్ర స్వరూపం అన్నమాట. (సినిమాల్లో మనకి అప్పుడప్పుడు కనిపించేది). ఆ చక్రం మనకి పూర్తి వృత్తం లాగా కనిపిస్తుంది. విగ్రహం ముందు వైపు మధ్యలో సుదర్శనుడి విగ్రహం ఉంటుంది. పదహారు చేతులతో, చక్కటి కిరీటంతో ఎంతో అందంగా ఉంటారు . ఇంతకన్నా ఆశ్చర్యకరమైనదేమంటే, ఆ చక్రం మీదే గుండ్రంగా అధిదేవతలు చెక్కబడి ఉంటారు . వాటిలో విష్ణుమూర్తి ఒకరు! అంటే తన భక్తుడు, ఆయుధదేవతా అయిన సుదర్శనుడికి విష్ణుమూర్తి పరివారదేవతన్నమాట! 

మరో విశేషం ఏమంటే, ఈ సుదర్శనానికి వెనక వైపున యోగ నరసింహుడు కొలువై ఉంటారు! బహుశా ఇటువంటి దివ్యమైన శక్తివంతమైన సుదర్శనాలయం దేశంలో మరొకటి కనిపించదేమో . ఇక్కడ సుదర్శనుడికి, నారసింహునికీ భేదమే లేదు అనిపిస్తుంది . 

ముందు నుండీ  చక్రత్తాళ్వారుగా, వెనుక వైపు నృసింహావతారంగా ఉన్న  విగ్రహాన్ని చూడగానే అత్యంత శక్తిమంతమైన శక్తిచక్రం ముందు మనమెంత మాత్రమని అనిపించక మానదు . నిజానికి మాయలో మునిగి పరమాత్మని తెలుసుకోలేక, తల్లిని వీడిన బిడ్డలా గగ్గోలు పడుతున్న జీవిని - ఆ మాయ నుండీ తన చక్రజ్వాలతో ముక్తినిచ్చి పరమాత్మని తెలుసుకొనే టట్లు చేయగల గొప్ప క్షేత్రం ఇది .   

సుదర్శన స్వామి దర్శనం : 

 ఓ చక్రజ్వాలలో గోచరిస్తున్న సుదర్శనుడు ఈ సమస్త సృష్టి భ్రమణాన్ని సూచిస్తున్నట్లుగా ఉంటారు . ఈయన చుట్టూ నలభై ఎనిమిది మంది దేవతలు పరివేష్టించి ఉండగా, ఆరు వలయాలలో నూటయాభై నాలుగు అక్షరాలు పొందుపరిచి ఉండగా, పదహారు చేతులతో, పదహారు ఆయుధాలను ధరించి, త్రినేత్రాలతో దర్శనమిస్తుంటారు. ఇక్కడ సుదర్శనమహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 

ఈ సుదర్శన ఆలయంలో  ఆరు సార్లు ప్రదక్షిణలు చేస్తే, మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ప్రతీతి. స్వామిని సేవించినవారికి మరణభయం తొలగడమే కాక, మనోవ్యాధులు నాయమవుతాయట. 

బ్రహ్మతీర్థం : 

కాలమేఘ పెరుమాళ్ సన్నిధి ప్రక్కన ఆండాళ్ సన్నిధి ఉంది. బ్రహోత్సవం ఆరవరోజున, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఆండాళ్ లో కలసి దర్శనమిస్తుంటాడు. ఆలయ ప్రాకారంలో ఆంజనేయస్వామి వారి సన్నిధి ఉంది. రాక్షసులు తనను వేధిస్తుండటంతో తట్టుకోలేక పోయిన బ్రహ్మదేవుడు ఇక్కడకొచ్చి తపస్సు చేశాడట. అప్పటికీ బ్రహ్మను వదలని రాక్షసులు ఇక్కడకు రావడంతో, వారిని చూసిన కాలమేఘ పెరుమాళ్ ఆ రక్కసులనంతా దూరంగా విసిరేశాడట. అందుకు గుర్తుగా ఇక్కడ బ్రహ్మతీర్థం ఉంది.

గరుడమండపంలో నున్న స్తంభాలపై పూల బాణాలతో కూడిన మన్మథుడు, దానికెదురుగా నున్న మరొక స్తంభంపై హంసవాహనంపై రతీదేవిశిల్పం కనులవిందు చేస్తుంటాయి. ఇంకా సీతారామలక్ష్మణుల విగ్రహాలున్నాయి. కాలమేఘ పెరుమాళ్ ఆలయానికి వెలుపల పద్దెనిమిది మెట్ల కరుపన్న స్వామి ఆలయం ఉంది.

ఈ ఆలయంలో నిత్యసేవలు, మహాత్సవాలు, సంవత్సర ఉత్సవాలు వైభవంగా జరుగుతూంటాయి. ఈ ఉత్సవాలకు భక్తులు గుంపులు గుంపులుగా వస్తుంటారు.

తమిళనాడులోని ఈ ఆలయాన్ని చేరుకునేందుకు చెన్నై చేరుకొని, అక్కడ్నుంచి మదురై పట్టణానికి చేరుకుని, అక్కడ్నుంచి తిరుమోగూరు చేరుకోవచ్చు. తమిళనాడు యాత్ర చేసే యాత్రీకులు, ముఖ్యంగా మదురైను దర్శించుకునేవారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. 

శుభమ్ !!

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi