Online Puja Services

భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ మహత్యం

3.128.94.171

గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, మోక్షాన్ని  ప్రసాదించే భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ మహత్యం. 
- లక్ష్మీరమణ 

భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయంలో భగవానుడు అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును వివరించారు. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవించడానికి ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములని తెలుసుకోవడానికి ఈ అధ్యాయము ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి, అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయాలని ఈ అధ్యాయంలో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. ఈ అద్యాయానని నిత్యమూ పారాయణం చేయడం వలన గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, అంతాన మోక్షాన్ని పొందుతారు అని పద్మ పురాణం తెలియజేస్తోంది.  

 పవిత్రమైన పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయడం వలన లభించే ఫలితాన్ని ఈశ్వరుడు పరమేశ్వరికి ఈ విధంగా వివరిస్తున్నారు . “ ఓ ఈశ్వరీ ! పూర్వము సౌరాష్ట్రమనే నగరాన్ని ఖడ్గబాహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని వద్ద అమితమైన బలశాలయిన ఒక ఏనుగు ఉంది.  ఆ మత్త గజానికి వారు ‘అరిమర్ధనము’ అని పేరు పెట్టారు.  ఒకరోజు  ఆ ఏనుగు గొలుసులను తెంచుకొని ఉక్కు స్తంభాలను విరగగొడుతూ, బజారు పైన పడింది. వెంటనే దాన్ని బంధించడానికి రెండు ఆయుధాలను చేత పట్టుకుని ఆ గజమును వెంబడించాడు.  కానీ యెంత ప్రయత్నం చేసినా అతడు ఆ మత్తగజాన్ని అదుపు చేయలేక పోయాడు. ఆదిసృష్టిస్తున్న భీభత్సాన్ని తట్టుకోలేక, ఆటను భయం భయంగా దూరం నుంచి చూస్తూ నిలబడిపోయాడు. 

ఇంతలో రాజుగారికి ఆ సమాచారం తెలిసి, అక్కడికి వచ్చారు. గజాన్ని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అది కూడా వృధా ప్రయాసే అయ్యింది . ఆ ఏనుగు చేసే వీరంగాన్ని చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఆందోళన చెందసాగారు . ఇంతలో ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి, ఆ మార్గంలో పోతున్నాడు.  పౌరులందరూ ఆయన్ని చూసి, “అయ్యా! మీరు అటు వెళ్ళకండి, అక్కడ రాజావారి ఏనుగు అదుపుతప్పి వీరంగం వేస్తోంది. మీకు ప్రమాదం ఏర్పడవచ్చు” అని చెప్పారు. కానీ వారి మాటల్ని ఆ బ్రాహ్మణుడు ఏ మాత్రం లెక్కచేయలేదు .  బ్రాహ్మణుడు  అదే దారిలో నేరుగా ఆ మత్తగజం దగ్గరికి వెళ్ళాడు . ధైర్యంగా ఆ ఏనుగుని సమీపించి దాన్ని తన చేతితో నిమురుతూ శాంతింపజేశారు. 
అది చూసి రాజుగారు , ఆయన సేవకులు, పౌరులు ఎంతగానో ఆశ్చర్యపోయారు.  రాజుగారు అప్పుడు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లి భక్తితో ఆయనకు నమస్కరించి “ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఇంట సులభంగా ఈ మత్త గజాన్ని ఎలా లొంగదీసుకున్నారు ? ఇంత ప్రేమగా దీంతో ఎలా మాట్లాడగలిగారు ? ఇది నిజంగా ఒక అలౌకిక కార్యంగా అనిపిస్తుంది. దయచేసి వివరించండి” అని ప్రశ్నించారు.  అప్పుడు బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. “ఓ రాజా! నేను ప్రతి రోజు కూడా శ్రీమద్భగవద్గీత షోడశదశాధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను. దానివల్లే  నాకు ఇంతటి సిద్ధి కలిగింది”. ఈ విధంగా బ్రాహ్మణుని మాటలు విన్నటువంటి రాజు వెంటనే ఆ గజాన్ని అక్కడే వదిలి ఆయన్ని తన భవనానికి తీసుకుపోయాడు. 

 ఒక సుముహూర్త సమయంలో అతడు లక్ష సువర్ణ నాణాలని ఆ బ్రాహ్మణునికి గురుదక్షిణగా ఇచ్చి,  భగవద్గీత లోని పదహారవ అధ్యాయాన్ని ఉపదేశింప జేసుకున్నారు.  ఆ రోజు నుంచీ రాజు భగవద్గీత పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయసాగారు. మొదటి రోజున రాజు ఒక్క శ్లోకాన్ని మాత్రము చదివి తన ఏనుగుని చూడడానికి గజశాలకు వెళ్లారు. మావంటి వాని చేత దాని బంధములను తీయించి, నిర్భయంగా ఆ గజం దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ ఏనుగు ఎంత మాత్రం చెలించకుండా గొప్ప సాధు స్వభావాన్ని ప్రదర్శించింది. అది గమనించిన రాజు చాలా ఆశ్చర్యపోయారు.  అది తానూ ఆరోజు పారాయణం చేసిన  గీతా మహత్యమే అని తలపోశాడు.

 ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా, క్రమంగా ఆయనకి వార్ధక్యము సమీపించింది.  రాజ్య కాంక్ష తగ్గిపోయింది. తన జీవితాన్ని తృణముగా ఎంచి,  గీతా షోడశాధ్యాయమే తన పాలిటికల్ప వృక్షమని నిర్ణయించుకుని, రాజ్య భారాన్ని తన కుమారుడికి అప్పగించారు.  ఈ విధంగా ఖడ్గబాహుడు నిత్యము అమితమైన భక్తితో గీత లోని పదహారవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ చివరికి పరమపదాన్ని పొందారు.

 కాబట్టి ఓ దేవీ ! గీతలోని 16వ అధ్యాయాన్ని ఎవరైతే చక్కటి భక్తితో, శ్రద్ధతో పారాయణ చేస్తారో, వారు గజ సమానమైన బలాన్ని, అమితమైన సాహసాన్ని, పొందడమే కాక యోగులకు కూడా దుర్లభమైన మోక్షాన్ని పొందగలుగుతారు. “ అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు. 

 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!!

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore