Online Puja Services

రావణాసురుడికి స్త్రీలోలత్వం చాలా ఎక్కువ

3.17.128.129

రావణాసురుడికి స్త్రీలోలత్వం చాలా ఎక్కువ ! అదే అతని మరణానికి కారణమయ్యింది ! 
లక్ష్మీ రమణ 

రావణాసురుడు చనిపోయిన తర్వాత , ఆతని భార్య మండోదరి భర్త శవాన్ని చూస్తూ ఒక్కమాటంటుంది. ‘ నువ్వు బలవంతంగా అణిచి పెట్టిన ఇంద్రియాలు, నువ్వు జయించానని అణగదొక్కిన ఇంద్రియాలు, నువ్వు జయించాల్సిన ముఖ్యమైన శత్రువులు నీమీద పగబూనాయి. అందుకే నువ్వు ఇప్పుడు ఒక మానవుడి చేతిలో ఒక మానవ కాంత కోసం చనిపోయావు’ అని . దీనికి ముందు కూడా రావణుడు స్త్రీల విషయంలో చాలా లోలత్వాన్ని ప్రదర్శించాడని కథలు ప్రచారంలో ఉన్నాయి . 

రావణుడి తండ్రి మానవుడు , మహాతపస్సంపన్నుడు, బ్రాహ్మణుడైన విశ్రవసు బ్రహ్మ. రావణుడి తల్లి రాక్షస స్త్రీ అయిన కైకసి. వీళ్ళ సంతానం రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు , సూర్పణఖ. ఆవిధంగా రావణుడు బ్రాహ్మణుడు.  కానీ, అతనిలో రాక్షస లక్షణాలే ఎక్కువ .కర్ణుడు చావుకి సవాలక్ష కారాణాలున్నట్టు , దశకంఠుని చావుకి కూడా అన్నే స్త్రీ శాపాలు కారణమయ్యాయి . ఆయన చెరబట్టిన స్త్రీలు సామాన్యులు కారు .   

కన్నుచూసిన సౌందర్యమంతా తన సొంతం కావాలనుకునే మనసున్న వాడు రావణుడు . సీతమ్మ పూర్వ జన్మలో వేదవతి. ఒకసారి రావణుడు పుష్పక విమానంలో వెళ్తూ, తపోనిష్ఠలో నారాయణున్నే భర్తగా పొందాలని తపస్సు చేస్తున్న వేదవతిని చూసి మోహిస్తాడు. అగిశిఖ లాంటి తేజోరాశి అయినా ఆమెని బలవంతం చేయబోతాడు . అప్పుడు వేదవతి యోగాగ్నిలో ప్రాయోపవేశం చేసి, దహించుకుపోతూ,  తన వల్లే రావణుడు మరణిస్తాడని శాపం పెడుతుంది.

తన భార్య మండోదరి చెల్లెల్ని కూడా కోరుకుంటాడు రావణుడు. మండోదరి చెల్లెలు మాయ. బలవంతంగా , దౌర్జన్యంగా తనని చేపట్టబోయిన రావణున్ని  ‘ స్త్రీ వల్లే నువ్వు చనిపొతావు’ అని శపిస్తుంది .

అంతేకాకుండా వావీవరసా లేకుండా, కుబేరుడి కొడుకు ప్రియురాలు అయినా రంభని మోహిస్తాడు . కుబేరుడు రావణుని అన్న . ఆవిధంగా చూస్తే, రంభ రావణునికి కోడలు వరుస . కొడుకు భార్య . ఆమెను చేరబట్టబోతుండగా, నల కుబేరుడు ఒక శాపాన్నిస్తాడు . అదేంటంటే , ‘ రావణుడు ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవించాలని ప్రయత్నిస్తే తల పగిలి చస్తాడు’ అని. 

అందుకే రావణుడు సీతమ్మను తాకలేక, సీతమ్మని ఆమె నిలబడిన భూమితో సహా పెల్లగించి , లంకకు తెస్తాడు. లంకలో కూడా సీతమ్మను చంపేస్తానని బెదిరిస్తాడేగానీ , చేరలేకపోతాడు . అలా రావణుడు ఇంద్రియ చాపల్యాన్ని గెలవలేక , తన చావుని తానె కొనితెచ్చుకున్నాడు . 

రామో విగ్రహవాన్ ధర్మః అని మారీచుడు చెప్పినా వినలేదు. సీతమ్మను తీసుకు రావడం తప్పని తిరిగి రామునితో కలపమని మండోదరి,విభీషణుడు,కుంభకర్ణుడు ఎంతగా వారించినా వినలేదు.తన వారందరూ చనిపోతున్నా పట్టించుకోలేదు.కేవలం సీతమ్మను పొందాలని మాత్రమే ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba