Online Puja Services

రామాయణం వాస్తవం అంటున్న శ్రీలంక సర్కార్ !

52.14.130.13

రామాయణం కథ కాదు, వాస్తవం అంటున్న శ్రీలంక సర్కార్ !
సేకరణ: లక్ష్మీ రమణ 
 
అశోకవాటికలో సీతమ్మ కూర్చున్న చోటు, తోకకి నిప్పంటించుకొని రావణ లంకని హనుమన్న కాల్చిన చోటు, మండోదరి నివాసంలో విలాసవంతమైన రావణుడు గడిపిన చోటు , ఆ పుష్పకవిమానం ఎగిరిన చోటు దొరికేసింది . రావణుని లంక దొరికేసింది.  రామాయణ కావ్యం జరిగిన చరిత్రేగానీ, పుక్కిట పురాణం కాదని నొక్కి చెప్పే సాక్ష్యం దొరికేసింది . సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.

రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. 

ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం.ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.

సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు.రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది. ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఇదే హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవనీ పర్వతమని విశ్వాసం . శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్. ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.

ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే, శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.

మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది. ఇక్కడి రాళ్లు కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వేడి వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో, ఇంకా ఇంతటి వేడి వాతావరణం ఉండటం విశేషం. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.

కెలీనియా- రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది.

ఆ తరువాత నరోలియా. ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు. ఇవి అలోపతి మాత్రల్లాంటివి. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. 

రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ.

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.

రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. 

 ఇవేకాక , రామాయణంలో ఇలా జరిగింది అని చెప్పిన కథలోని ప్రతి సంఘటనకి , ఇది వాస్తవం అని లంక ఆధారాన్ని చూపిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీతో టూరిజాన్ని అభివృద్ధి చేసుకోవడానికే ఈ మాయమాటలు అనుకుంటే, ఇంతటి ఇతిహాసానికి సాక్ష్యాలని చూపించడం , వాటిని మసిబూసి మారేడుకాయ చేయడం అంత సులువైన విద్యకాదు. అది సాధ్యమయ్యే పనికూడా కాదు. కాబట్టి ఒకే ఒక్క మాట మనం ఇప్పుడు అనదగినది ఏమంటే, జై శ్రీరామ్ !  

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi