Online Puja Services

భట్టి, విక్రమార్క, భేతాళీయం .

18.221.85.33

అది అతని సుగుణమా , స్థలమహిమా ? భట్టి, విక్రమార్క, భేతాళీయం . 
లక్ష్మీ రమణ 

ధారాపురం అనే మహా నగరానికి  రాజు  భోజరాజు. ఇప్పటి మధ్యప్రదేశ్ లోని ధార్ అనే ప్రాంతం రాజధానిగా చేసుకొని పరిపాలించిన చక్రవర్తి .  అతను గొప్ప పరాక్రమమం కలవాడు.  సద్గునవంతుడు. ఆయన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు. ఆయన ఒకరోజు వేటకి వెళ్లి ఒక వింతని చూశాడు. ఆ వింత సంఘటన ఆ రాజుగారి జీవితాన్నే మార్చేసింది . గొప్ప సాహిత్యాన్ని ఈ దేశప్రజలకు అందించింది . ఆ కథని తెలుసుకుందాం . 

తన రాజ్యంలో క్రూర మృగాల వల్ల  ప్రజలకు అపారమైన కష్టనష్టాలు ఏర్పడుతున్నాయి అని భోజరాజుకి తెలిసింది . వెంటనే మంత్రిగారైన నీతిమంతుని పిలిచి,  క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి  అంతా సిద్దం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో  బయల్దేరారు  భోజరాజు . 

అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు  సేవకులు.  పులులు,  సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో క్రూర జంతువులను సంహరించారు  రాజుగారు .  చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి, రాజుగారికి ధన్యవాదాలు చెప్పి , దండాలు పెట్టి సాగనంపారు. వచ్చిన కార్యం విజయవంతంగా ముగియడంతో , రాజుగారు   తన పరివారంతో  రాజధానికి  తిరిగి వెళ్ళసాగారు.  

ఇలా వెళ్తున్న వారికి  ఓ చోట చక్కగా పంట మీదున్న  జొన్న చేను కనిపించింది . పంట చక్కగా పండిందేమో , కళకళలాడిపోతూ బంగారపు వర్ణాన్ని వెదజల్లుతోంది . ఆ చేను  పక్క నుండీ రాజుగారు, పరివారంతో  వెళుతున్నారు.  ఆ చేనులో మంచెపై కూర్చుని  ఉన్న ఆచేను యజమానయిన  ఓ బ్రాహ్మణుడు  వీళ్ళను చూసి చెయ్యెత్తి పిలిచాడు .   “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు. పైగా బాగా అలసిపోయి కనిపిస్తున్నారు .  ఈ జొన్నచేనులోని తీయని కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి.   సందేహం లేకుండా  అందరూ ఈ కంకులు తిని, మీ ఆకలి తీర్చుకుని, కాసేపు  విశ్రాంతి తీసుకుని వెళ్ళండి.  మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం”  అంటూ ప్రార్థించాడు.
 
 ఆ బ్రాహ్మడి  ఔదర్యానికి భోజరాజుగారు ఎంతో సంతోషించారు.  ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని  తన పరివారంతో చెప్పారు. పరివారమంతా, పసిడి కాంతులతో ఉన్న ఆ పంటని ఆనందంగా తినే ప్రయత్నంలో ఉన్నారు . 

ఇదిలా ఉంటె, రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై  మంచెపైనుండి  దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఖం ముంచుకు వచ్చింది.  సరాసరి రాజు వద్దకు వెళ్ళి “రాజా ! మీకు ధర్మవంతుడని గొప్ప పేరుంది . అలాంటి నీవు , నీ  పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు.  ఇది నీకు న్యాయంగా ఉందా ?  నా వంటి పేదవాడి కష్టాన్ని అన్యాయంగా దోచుకోవడంతో ఇది సమానం కాదంటావా ?  కంచే చేను మేసినట్టుగా, రాజువైన నీవే ఇలాంటి అన్యాయానికి ఒడిగట్టి, నాకున్న ఏకైక ఆధారాన్ని నాశనం చేస్తావా ?ఇక నేనూ నాకుటుంబం జీవించేదెలా?”  అంటూ విలపించసాగాడు. 

అతడి మాటలు విని రాజుగారు విస్తుపోయారు . ‘అందరినీ పిలిచి తినమన్నది ఇతడే, ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి!  తనని, తన పరివారాన్ని నిందిస్తూ, తాము అన్యాయం చేశామని తప్పు నెడుతూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని ’ ఆలోచిస్తూ,   అనుకుంటూ తన వాళ్ళనందరినీ  కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పారు . ఆ  రైతు  దుఖం చూడలేక  అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నారు .

ఆ రైతు పిట్టలను తోలటానికి తిరిగి మంచె మీదకు చేరాడు.  వెళ్ళిపోతున్న  రాజు గారి పరివారాన్ని చూసి  “ఎందుకు వెళ్ళిపోతున్నారు?  విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పానుకదా,  కడుపార తిని కావలసినన్ని పట్టుకుపొండి. రాజా  మీ పరివారానికి మీరు చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృదా”  అన్నాడు.

ఈ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది.  చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.  సరే కానిమ్మని  తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు.  రైతు సంతోషించాడు. తిరిగి కాసేపటితరువాత మంచె దిగివచ్చిన  రైతు  “ధర్మవంతుడైన  రాజు లక్షణం ఇదేనా? నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సాహించటమేమిటి? నా  పంట నాశనం చేస్తున్నారు  నేనేం నేరం చేసానని నాకీ శిక్ష.”  అంటూ భోరాజు ను నిలదీసి అడిగాడు.

భోజ రాజు ఆశ్చర్యంతో  తన మంత్రియైన నీతిమంతునితో  “ఈ రైతు ప్రవర్తన  చాలా వింతగా , విపరీతముగా ఉన్నది. మంచెపై ఉన్నప్పుడు ఒకమాదిరిగా,  మంచె దిగిన తరువాత మరొక విధముగా  ప్రవర్తిస్తున్నాడు. మంచెపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు, మంచె దిగగానే అంతా మరచి ఎంతో అమర్యాదగా, సంకుచితంగా  మాట్లాడుతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థంకావడంలేదు .  అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది?”  అంటూ అడిగాడు. 

దానికి సమాధానంగా మంత్రి రాజా  “ఇతడి ఈ ప్రవర్తనకి కారణం  తప్పకుండా ఆ మంచెయే ననిపిస్తున్నది.  మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య  రైతులా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించి గానీ ఆ  మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు.”  అన్నాడు.

రాజు వెంటనే బ్రాహ్మణుతో    “ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైన్నా కొనుక్కొనేంత ధనం ఇస్తాను”  అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి  రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి, “ రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే, మీ దయ వలన ఆ ధనంతో  నేనూ నా కుటుంబం సుఖంగా ఉంటాము”    అని చెప్పాడు.

రాజు ధారాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి  సేవకులను పంపి ఆ మంచెఉన్న చోటును తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుత మైన రత్నాలు పొదగబడిన  బంగారు సింహాసమ్నం ఒకటి  కనిపించింది. దానికి ముఫైరెండు బంగారు మెట్లు ఉన్నాయి.  ఆ మెట్లకు  రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసన్నాని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది.

సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇంత అద్భ్త సింహాసనాన్ని అధిష్టించిన రాజు  ఈ భూమినంతటినీ  ఏకచ్చత్రాధిపత్యంగా  ఏలిన వాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్నచోట మంచె పై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు  అని  గ్రహించారు.

ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా  నగరానికి  తీసుకుపోయి  తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు. 

పండితులచే ఒక  శుభముహుర్తం  నిర్ణయించి  ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్నాన మంగళవాద్యాలతో  సింహాసనానికి పూజలు జరిపించి  మంచి ముహుర్తం లో  ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు.  వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగింది.  మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి. ఆ మెట్టుపైనున్న  రత్నఖచితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది.  రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు. 

“రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అదిరోహించటం  అంత సులువైన విషయంకాదు.  శౌర్య ప్రతాపాలు, సకల గుణవంతుడు అయిన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది. ఇది మానవ నిర్మితంకాదు,  స్వయంగా దేవేంద్రుడే  విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది. దీనిపై కూర్చోవాలనుకునే వారు అతడితో సమానులై ఉండాలి. దీనిపై ఉన్న ముఫై రెండు బొమ్మలూ మాట్లాడతాయి దానికి కారణం  ముందు ముందు  నీకే తెలుస్తుంది.

సకల కళా ప్రావీణ్యుడూ, దిగాంతాలవరకూ ఖ్యాతి గాంచినవాడు, సుగుణ వంతుడూ అయినా విక్రమార్కుడి లక్షణాలు నీకున్నాయని  అనుకుంటే ఈ సింహాసన్నాని అధిరోహించు, లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో.”  అంది.

భోజరాజు ఆ బొమ్మమాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు  “విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్రఏమిటో నాకు తెలియదు. నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి. నాకు అతడి చరిత్ర చెప్పు”  అన్నాడు. దానికి ఆ బొమ్మ బదులిస్తూ  “అతడి గుణగణాలు వర్ణించడం అంతసులభంకాదు, నా శక్తి మెరకు చెపుతాను”  అంటూ మొదటి మెట్టులోని ప్రతిమ ఇలా చెప్పసాగింది . 

" మహారాజా! నా పేరు వినోదరంజిత. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.

అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.

అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.   

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi