Online Puja Services

పది అడుగుల దూరం

18.227.0.192
ఇది 1983లో జరిగిన సంఘటన. నేను ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేవాణ్ణి. ఉద్యోగ పరంగా నేను చాలా ఊర్లకు తిరిగేవాణ్ణి. ఒకసారి అలా వెళ్లి చెన్నై తిరిగొచ్చిన మీదట కొద్దిగా అలర్జీ అయ్యి, శరీరం మొత్తం ఎర్రని దద్దుర్లు బొబ్బలు రావడం ఆరంభించాయి. కొద్దిగా దుమ్ము, లేదా తినకూడని వాటిని తిన్నా అవి చాలా అధికమయ్యేవి. చిన్న చిన్నగా మొదలై మొత్తం శరీరం అంతా, కాళ్ళు, చేతులు, ముఖం అన్నిచోట్లా వచ్చాయి. చాలా మంటగా దురదగా అనిపించడంతో తరచుగా ఉద్యోగానికి సెలవు పెట్టవలసి వచ్చేది. ఏ వైద్యమూ నా వ్యాధిని తగ్గించలేకపోయింది. చివరికి పరమాచార్య స్వామివారిని ప్రార్థించాను. కాని గుణం కనిపించలేదు. ఇక ఈ జన్మకు ఎలా బ్రతకవలసిందే అని సరిపెట్టుకున్నాను.

ఒక రోజు నా స్నేహితుడు ఆడిటర్ సీతారామన్, పరమాచార్య స్వామివారు చాతుర్మాస్యం చేస్తున్న కర్నూలుకు వస్తావా అని అడిగాడు. అంతకంటే కావలసింది ఏమి ఉంది? నా పరిస్థితి ఎలా ఉంది అంటే, “తినడానికి చెరుకుగడ ఇచ్చి, తిన్ననదుకు డబ్బులు కూడా ఇస్తున్నట్టు” ఉంది. వెంటనే వెళ్ళడానికి ఒప్పుకున్నాను. నా బాధను స్వామివారికి విన్నవించుకోవచ్చు అనే చిన్న ఆశ కూడా.

కూరగాయలు, వంట సరుకులు వంటి భారీ లగేజితో కర్నూలు చేరుకున్నాము. మహాస్వామివారు విడిది చేస్తున్న స్థలానికి వెళ్ళడానికి ఒక సైకిల్ రిక్షాను మాట్లాడుకున్నాము. ఆ రిక్షా వాడు ఏమాత్రం ఎక్కువ డబ్బులు అడగకుండా సంతోషంతో మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. మహాస్వామివారు ఒక మిల్లులో మకాం చేస్తున్నారు. అక్కడ వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. కాని ఆ మిల్లు యజమాని అయిన శ్రీ అన్నవర్జుల రంగనాథ శర్మ (స్వామివారు పొగాకు శర్మ అని పిలిచేవారు) గారు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు కావడంతో మిల్లు కార్యకలాపాలను ఆపివేసి మరీ నాలుగు నెలల పాటు స్వామివారు ఉండడానికి ఏర్పాట్లు చేశారు.

మొత్తం సామాను దించుకున్న తరువాత మా రాక గురించి బాలు మామకి తెలిపాము. ఆయన లోపలి వెళ్లి స్వామివారికి చెప్పారు. స్వామివారు అనుష్టానానికి నదికి వెళ్తున్నారని, మమ్మల్ని కూడా నదిలో స్నానం చేసి దర్శనానికి రమ్మన్నారని తెలిపాడు. మేము స్టేషనులో స్నానం చేశామని చెప్పినా, నదికి వెళ్లి నదిస్నానం చేసి రండి అని బాలు మామ ఖరాఖండిగా చెప్పాడు.

ఆ మిల్లులోని దుమ్ము వల్ల నాకు శరీరమంతా వ్యాధి లక్షణాలు మొదలయ్యాయి. డాక్టర్లు చెప్పిన సిట్జిన్ మాత్రను కూడా వెంట తెచ్చుకోలేదు. దరిదాపుల్లో ఎక్కడా మందుల దుకాణం ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. ఏమి చెయ్యాలో దిక్కుతోచడం లేదు. మహాస్వామి వారిపై నమ్మకంతో వారే నన్ను చూసుకుంటారని, మనస్సులో “జయ జయ శంకర, హర హర శంకర” అని చెప్పుకుంటూ, నా వ్యాధిని తగ్గించండి పెరియవ అని మనస్సులో తలచుకుంటూ వారిని అనుసరించాను.

నది ఒడ్డుకు చేరుకున్నాము. నది చాలా ప్రశాంతంగా ఉంది. మాడు పాయలుగా ప్రవహిస్తోంది. మహాస్వామి వారు నీళ్ళల్లోకి దిగి స్నానం చేయ్యనారంభించారు. నేను వారి వెనుకనే దిగక నది ఒడ్డున నిలబడి ఉన్నాను. స్వామివారి స్నానానంతరం దిగుదామని వేచి ఉన్నాను. స్వామివారు నావైపుకు చూసి, బాలు మామని పిలిచి ఏదో చెప్పారు. బాలు మామ వెంటనే ఒడ్డుకు వచ్చి స్వామివారు నన్ను కూడా స్నానం చెయ్యమన్నారని చెప్పారు. ఎక్కడ చెయ్యాలి అని బాలు మామని అడిగాను నేను. ఎందుకంటే నేను స్నానం చేసిన నీళ్ళు స్వామివారి వైపుకు వెళ్ళకూడదు అనే ఉద్ద్యేశముతో. బాలు మామ నన్ను స్వామివారికి పది అడుగుల దూరంలో ప్రవాహం వైపు నిలబడి స్నానం చెయ్యమని ఆదేశించారు. ఆయన సూచించిన చోట నదిలోకి దిగి స్నానం మొదలుపెట్టాను. చల్లని నిరు తగలడంతో శరీరమంతా దురద మొదలయ్యింది. కాని దాన్ని లెక్కచెయ్యక పూర్తిగా నీళ్ళల్లో మునిగాను.

మహాస్వామివారు స్నానం ముగించి మంత్రజపానికి కూర్చోబోతుండగా నేను కూడా స్నానం ముగించి బయటకు వచ్చాను. దురద మంట కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. శరీరంపై బొబ్బలు దద్దుర్ల తీవ్రత కొద్దిగా తగ్గింది. పొడి వస్త్రాలు ధరించి విభూతి రాసుకోబోతుండగా బాలు మామ వచ్చి మహాస్వామి వారు పూసుకోగా మిగిలిన విభూతిని ఇచ్చారు. స్వామివారు దాన్ని నా ముఖము, చేతులు, ఎద, భుజాలపై పూసుకొమ్మని చెప్పారుట. నేను అలాగే చేసి అనుష్టానం ముగించుకుని మిల్లుకు చేరుకున్నాము.

పూజ పూర్తైన తరువాత తీర్థం తీసుకోవడానికి స్వామివద్దకు వెళ్లాను. అప్పుడు నాకు గుర్తువచ్చింది నా శరీరంపై ఎటువంటి బొబ్బలు, దద్దుర్లు లేవని దురద కూడా పూర్తిగా తగ్గిపోయిందని. స్వామివారు నాకు తీర్థం ఇచ్చి, “ఇక్కడకు నువ్వు వచ్చిన ఉద్దేశ్యము నెరవేరిందా?” అని అడిగారు. అప్పుడే నాకు మెరుపులా తట్టింది. మహాస్వామి వారిని తాకి నావైపు ప్రవహించిన నీరు నా శరీరాన్ని తాకడంతో నాకున్న వ్యాధి నయమైపోయింది. ఇక నాకు స్వామివారు రాసుకుని ఇచ్చిన విభూతితో పూర్తీ స్వస్థత చేకూరింది. అదికూడా నేను పరమాచార్య స్వామీ వారికి నా సమస్య గురించి ఏమీ చెప్పకుండానే.

కన్నుల నీరు స్రవిస్తుండగా, స్వామివారి పాదాలపై సాష్టాంగపడి నమస్కరించి, “మీ దయ వల్ల నేను ఇక్కడకు వచ్చిన ఉద్ద్యేశ్యము నెరవేరింది పెరియవ” అని అక్కడ నుండి బయలుదేరాము. నేను నా స్నేహితుడు సీతారామన్ ను అడిగాను, “నేను నా వ్యాధి గురించి ఏమీ చెప్పకుండానే స్వామివారికి ఎలా తెలిసింది?” అని. అందుకు సీతారామన్ నాతొ, “పరమాచార్య స్వామివారు త్రికాలవేదులు. వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. వారి భక్తుల బాధలను వారు ముందే తెలుసుకోగలరు”

కర్నూలు నదివల్ల నా అనారోగ్యం బాగైంది. ఈనాటికీ, ఎంతటి దుమ్ము, ధూళి ప్రదేశములో తిరిగినా, వంకాయ వంటి కూర తిన్నా నాకు ఎటువంటి అలర్జి అవ్వడం లేదు. ఈ సంఘటనను తలచుకోకుండా ఒక్క మహాస్వామివారి ఆరాధన కూడా జరగదు.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore