Online Puja Services

నిజమైన కాలకేయులు అంటే వీళ్ళే !

3.144.167.151

నిజమైన కాలకేయులు అంటే  వీళ్ళే !
-లక్ష్మీ రమణ 
 
బాహుబలి సినిమా చూసిన వారికి కాలకేయులని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కాలకేయులు నిజంగానే రాక్షసులు. మన పురాణాలలో వీరి గురించిన ప్రస్తావన ఉంది . కృతయుగానికి చెందిన ఈ కధలోని కాలకేయులనే , బాహుబలిలో పాత్ర కట్టించి తెరమీద ఆడించారు అనిపిస్తుంది.  వాళ్ళు కిలికిలి భాష మాట్లాడారో లేదో గానీ , ఆ అకృత్యాల వివరణ మాత్రం స్కాందపురాణంలో ఉంది  . 

పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు . వాడు మహా బలశాలి . వీడి అనుచర గణమే కాలకేయులు . ఇంద్రుణ్ణి కూడా జయించి , దేవతలని, సజ్జనులని , మునులని రకరకాలుగా హింసించడం మొదలు పెట్టాడు . ధనం , అధికారం బహు చెడ్డవి . మంచివాడిని చెడు మార్గంలో నడిపిస్తే, చెడు స్వభావం ఉన్నవాడిని పూర్తిగా బ్రష్టుణ్ణి చేసేస్తాయి .  వృత్తాసురుడు , తన అనుచరులైన  ‘కాలకేయులతో’ కలిసి చేయని అకృత్యం లేదు . దీంతో దేవతలు , మునులు సృష్టి కర్తయైన బ్రహ్మ దేవుణ్ణి ఆశ్రయించారు .  ఆయన తపోబలసంపన్నుడైన దధీచి మహర్షి తప్ప ఈ ముప్పు తప్పించగలవాడు లేడని సెలవిచ్చారు . చేసేదేమీలేక , వారందరూ కలిసి సరస్వతీ నదీ తీరాన తపోదీక్షలో ఉన్న దధీచి మహర్షిని వేడుకున్నారు . ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అని భావించే ‘మహర్షి’ కదా దధీచి . ఆయన వెంటనే దేహ త్యాగం చేశారు .  ఆయన వెన్నుముక ని ఆయుధంగా ఇంద్రుడు గ్రహిస్తే, మిగిలిన దేవతలు ఆయన ఆస్థిని ఆయుధాలుగా మలుచుకున్నారు . 

మేరుదండం అంటే, అది యోగ నిష్టా గరిష్ఠమైనది . భౌతికమైనదే అయినా , సహస్రారం  వరకూ వ్యాపించి  జ్ఞాన సముపార్జనకు యోగించినది , నియోగించినది . అందునా , అది దధీచిది. 

సరే, కథ ప్రకారం , వైరి గణాల మధ్య ఆయుధాలు ఉపయోగించకూడదు అనే ఒప్పందం ఆ కాలం నాటి నుండీ ఉంది . ఒకసారి దేవతలు - రాక్షసులూ ఆయుధాలు ఉపయోగించకూడదు అని నియమం పెట్టుకున్నారు . వారి ఆయుధాల్ని శాంతి కాముకుడైన దధీచి ఆశ్రమంలో దాచిపెట్టారు . సంవత్సరాల తరబడి అవి అలాగే ఆయన ఆశ్రమంలో ఉండిపోయాయి . దధీచి మహర్షి , ఆ ఆయుధాల్ని కరిగించి , ఆయుధ రసాపానం చేసేశారు . అవి జీర్ణం అయిపోయాయి కూడా ! దానివల్ల ఆయన శరీరానికి కొత్త శక్తి చేకూరింది . వృత్తాసురుణ్ణి సంహరించడానికి దేవతల వద్ద ఆయుధాలు లేకపోవడం కూడా ఒక కారణమే అయ్యింది . 

అలా దధీచి వెన్ను యముకతో తయారైన ఆయుధమే వజ్రాయుధం . ఇంద్రుడు ఆ వజ్రాయుధం సాయంతో వృత్తాసురుణ్ణి వధించాడు . కానీ చూడండి , రాజ్యం పోయినా , రాజుపోయినా , అనుచరగణాలు తమ అసురత్వాన్ని వదల్లేదు . కాలకేయులు తమ బుద్ధి మార్చుకోలేదు . పగలంతా సముద్రంలో దాక్కొని , రాత్రి పూట బయటికి వచ్చి తమ అకృత్యాలు కొనసాగించడం మొదలుపెట్టారు . ధర్మచరులైన ఋషులని చంపేస్తే, దేవతలకి హవిస్సులు అందకుండా పోతాయి . దాంతో వాళ్ళు శక్తి హీనులవుతారని తెలివిగా ఆలోచించి  దుశ్చర్యలకు తెగించడం మొదలుపెట్టారు .   నిశాచరులు కదా రాక్షసులు . 

అలా వశిష్టాశ్రమంలో  197 మందిని, చ్యవన మహాశి ఆశ్రమంలో 100 మందిని , భరద్వాజుని ఆశ్రమంలో 20 మందినీ తినేశారు . దీంతో ఆ మహర్షులతోపాటు  యమ, ఇంద్ర , అగ్ని, వరుణ , కుబేరాదులందరూ కలిసి   విష్ణుమూర్తిని ప్రార్ధించారు . విష్ణుమూర్తి ప్రత్యక్షమై , ‘అగస్త్యుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలవాడు . ఆయన సముద్రాన్ని పుక్కిట పట్టగలడు . అప్పుడు దేవతలకి ఆ కాలకేయులని సంహరించడం సాధ్యమైతుందని’ సెలవిచ్చారు . 

దీంతో తిరిగి వాళ్ళందరూ అగస్త్యుని సాయం అర్థించారు . అగస్త్యుడు సరేనన్నారు . ఇదిగో చూడమని , సముద్రాన్ని పుక్కిటపట్టి మింగేశారు . ఒక్క బిందెడు నీళ్లయినా గటగటా తాగలేమే ? ఆ మహానుభావుడు ఆ సముద్రాన్ని ఎలా పుక్కిట పట్టారో మరి ! ఆశ్చర్య పోయిన దేవతలు, ఋషులు ఆయన్ని వేనోళ్ళా పొగిడారు . ‘పీత సముద్రుడని’ అగస్త్యుని కీర్తించారు .  సరే, దాంతో సముద్రంలో నక్కిన ఆ కాలకేయులు బయటపడ్డారు . దేవతలు వారిని చంపేశారు . దాంతో వారి పీడ వదిలిపోయింది . 

మరి సముద్రం లేకపోతే ఎలా ? అగస్త్యుని పుక్కిటపట్టిన జలాన్ని విడువమన్నారు . ఆయనన్నారు ‘ అయ్యా ! ఆ జలం  జీర్ణమైపోయింది. ఇప్పుడది కిందినుండే గానీ, పైనుండి రాదన్నారు .  అదే మహా ప్రసాదం విడిచిపెట్టమన్నారు దేవతలు . అలా అగస్త్యుడు మూత్ర ద్వారం నుండీ విడిచి పెట్టడం వలన సముద్రం నీరు ఉప్పగా అవ్వడమే కాకుండా , అది స్నానానికి పనికిరానిదిగా మారిపోయింది . పుణ్య సమయాలలో తప్ప సముద్రజలాలు స్నానానికి పనికిరావు . తాగడానికి పనికిరావు .       

ఇది స్కాంద పురాణంలో చెప్పిన కథ .  చూడండి మన మహర్షులు ఎంతటి ద్రష్టలో . అగస్త్యుడు  సముద్రాన్ని ఔపోసన పట్టేశారు . జహ్నుమహర్షి గంగమ్మని ఔపోసన పట్టి , చెవి నుండీ విడిచి పెట్టాడు .  ఇంతటి జలం వారి శరీరంలో ఎలా పట్టింది ? యోగులంటారు అది మణిపూరక చక్రం (నాభి చక్రం ) మహిమ అని ! యోగులైన వారికే ఈ విషయం ఎరుక ! కానీ, కాలకేయులు వంటి రాక్షసులు , యుక్తితో వారినుండి బయటపడేసే అగస్త్యుల వంటి మిత్రులూ ఈ లోకంలో అక్కడక్కడా తారసపడడం మనకి అనుభవమే కదా !

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna