Online Puja Services

సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాధాన్యత

3.145.63.136

సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాధాన్యతని తెలుసుకుందాం రండి . 
-లక్ష్మీ రమణ 

మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం. చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సుబ్రహ్మణ్య షష్ఠి సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని విస్వాసం. ఈ పర్వదినం నాడు స్వామికి చేసే పూజలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. పెళ్లికాని వారికి వివాహం, సంతానాన్ని కోరుకునేవారికి సంతానం సుబ్రహ్మణ్యుని అనుగ్రహంగా జరుగుతాయి . అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాశస్తిని తెలుసుకుందాం రండి !  

పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలైన చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయడంవలన అమితమైన పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం . ఇక శాస్త్రానుసారం బ్రహ్మచారికి భోజనం పెట్టె ఆచారం కూడా ఈ పండుగలో విశిష్ఠత .బ్రతకడానికి కావలసిన మౌలికమైన అవసరాలలో తినడానికి తిండి, కట్టుకోవాలని బట్ట ముఖ్యమైనవి . వాటిని అందుకోలేని వారికి అందించాలనే అంతరార్థం ఈ పండుగలో ఈ సంప్రదాయాలకు మూలం కావొచ్చు . కానీ, సుబ్రహ్మణ్యుని ఆరాధనలో ఎన్నో గొప్ప విశేషాలని మన పెద్దలు నిగూఢంగా పొందుపరిచి అందించారని మాత్రం చెప్పవచ్చు. 

సుబ్రహ్మణ్య షష్ఠి :
మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి , సుబ్బరాయుడు షష్టి అని పిలుస్తారు , తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించారని ఒక కథనం. కానీ, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి. ఇక్కడ యోగాంతర్గతమైన  రహస్యం దాగుంది . దీనిని పురస్కరించుకొని , ఇప్పటికీ బ్రాహ్మణునికి భోజనం పెట్టె సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు . ఇక ,  ఆ రోజునే  "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని చెబుతారు పెద్దలు .

కుమారుని అవతరణం :
మరో కథయేమిటంటే, సుబ్రహ్మణ్యస్వామి ఈరోజే అవతరించారని. ఆ వృత్తాంతం ఇలా ఉంది . కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు,కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. 

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందేందుకు దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు బ్రహ్మగారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. కాబట్టి వాడిని  చంపడం మన తరంకాదు. కానీ, ఈశ్వర తేజాంశ సంభవుని వల్ల వీడికి మరణము ఉంటుంది అని చెప్పాడు. 

ఈశ్వరుడు సదానిర్విచారుడు. వివాహం, సంసారం పైన మోహము లేనివాడు . మరి ఆయన తేజముతో పుత్రుడు ఎలా ఉదయిస్తాడు? అందువల్ల మన్మధుడు ముందుకొచ్చి తన వింటిని సారించి, శివునికి ఎక్కుపెట్టి, ఆ ముక్కంటి కంటి జ్వాలలో దగ్దమయ్యాడు .  కానీ , ఆ బాణ ప్రభావం స్వామికి తగిలిందో, లేక లోకకల్యాణం కోసం కట్టుబడ్డారో , ఆ పరమేశ్వరుడు హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవిని చేపట్టారు . 

 ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా,  ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు అగ్నిదేవుడు . ఆ తేజము, ఆ సమయములో గంగలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తిక దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక, పొదలలో విసర్జిస్తారు. ఆ గడ్డి పొదల నుండీ శివతేజోరాశి స్వరూపంగా ఆరుముఖాలని కలిగి , సూర్య సమాన తేజస్సుతో, ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. ఆయనే షణ్ముఖుడు . 

పార్వతీదేవే ఈ మాతృకల స్వరూపము . ఆ తర్వాత వారందరూ ఆ బాలుణ్ణి తమ బిడ్డగా పెంచుతారు . ఆ తర్వాత , పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడైన  ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని,  గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని అనేక నామాలని పొందారు . 

కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" ఆయుధాన్ని ఇచ్చి సర్వశక్తివంతునిగా  చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అప్పుడు ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

షష్ఠి పూజా ఫలం :

"శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. 

షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. 

స్వామి పుణ్యతిధి అయినా షష్ఠి నాడు ఈ ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. 

పూజావిధి :
ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం, కూడడం ఫలితాన్నిస్తుంది . 

ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో ముందుగా చెప్పుకున్నట్టు  దానాలే ప్రధానం అని తెలుస్తుంది. 

సర్వేజాన:సుఖినోభవంతు.

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha