Online Puja Services

వినాయకుణ్ణి ఎత్తుకెళ్లిన లక్ష్మీ దేవి !

3.15.235.104

అమ్మ పార్వతికి ఒక్క మాటైనా చెప్పకుండా వినాయకుణ్ణి ఎత్తుకెళ్లిన లక్ష్మీ దేవి ! 
లక్ష్మీ రమణ 
 
విష్వక్సేనుడు, వినాయకుడూ ఇద్దరూ తొలిపూజలందుకునే వారే ! ఒకరేమో శైవ సంప్రదాయంలో గణాధిపతి అయితే, మరొకరు వైష్ణవ సంప్రదాయంలో గణాధిపతి . ఇద్దరూ దేవీ శక్తి స్వరూపాలైన పార్వతీదేవి , లక్ష్మీదేవులకి ముద్దలా బిడ్డలే . వీరి సారూప్యత ఇంతటితో ఆగలేదు . ఆయనకీ ఈయనకే భేదంలేదని , ఆమాటకొస్తే, లక్ష్మీదేవి వినాయకుణ్ణి దొగతనం చేసిందని చెబుతారు . అంతటి అపవాదా అనుకుంటున్నారేమో !! ఈ కథ విన్నారంటే, మీరూ నిజమంటారు మరి !! 
  
గణాధిపత్యాన్ని పొంది , రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు,  దేవగణాలు అందరూ కీర్తించడంలో విశేషమేమీలేదుకదా ! ఆ గణాధిపతికి, గుణాధిపతికి జన్మనిచ్చిన గౌరమ్మనికూడా వారందరూ గొప్పగా ప్రసంశించారు. బిడ్డని ఎవరైనా పొగుడుతూ ఉంటె, పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది ? గౌరమ్మ కూడా వినాయకుని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది . ఈ సందర్భంలోనే అనిపించిందట లక్ష్మీదేవికి నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని .
 
ఆలశ్యం చేయకుండా ఆ సిరిమహాలక్ష్మి ,  శ్రీమహావిష్ణువుని ప్రార్ధించి , నాకూ వినాయకుడి లాంటి కొడుకే కావాలి . కుదిరితే, వినాయకుడే నా కొడుకు కావాలీ అని అడిగారట !అప్పుడు విష్ణుమూర్తి , నువ్వే ఆ వినాయకుణ్ణి ప్రార్ధించి , ప్రసన్నం చేసుకో లక్ష్మీ అని చెప్పారు . వంటనే అమ్మవారు వినాయకుని కొడుకుగా పొందేందుకు తపస్సు చేశారట . ఆ తల్లి మనసు తపన విని గణేశుడు పరుగున వచ్చి , అమ్మ ! ఎందుకు నన్ను గురించి తాపం చేస్తున్నావు ? నీ కొరికేమిటో తెలియజేయి తల్లి అని అగిడారట . అప్పుడు లక్ష్మీ దేవి నీ నుండీ అమ్మా అన్న ఈ పిలుపు నాకు శాశ్వతంగా కావాలి గణేశా అని కోరారు . 

అప్పుడాయ , అది నా అదృష్టం తల్లీ ! అలాగే కానివ్వు అన్నారట ! అంటే, ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీ దేవి, వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకనెట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్లిపోయారట . పార్వతిదేవికి ఒక్కమాట కూడా చెప్పకుండా, ఆవిధంగా ఆ  తల్లి బిడ్డని ఎత్తుకుపోవడం ఒక విధంగా దొంగతనమే కదా! కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వరులు ఆమె ముచ్చట కి నవ్వుకున్నారట .

ఈ విధంగా వైకుంఠం చేరిన గణాధిపతి పూర్ణానందుడు అని పేరు పెట్టుకొని, ఏలారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుందట లక్ష్మీ దేవి ! ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్లి అడగండి! అని ఆదిదంపతులు ఆదిలక్ష్మి దగ్గరికి పంపించారు . దేవతలా వినతి మీదట పూర్ణానందుడిని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీ దేవి . అలా విష్ణుసైన్యానికి నాయకుడై , విష్వక్సేనుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు, ఆరోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో , అదే విధంగా లక్ష్మీదేవికి కూడా దేవతలా ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి, ఆమె కోరిక తీర్చాడు . తర్వాత వినాయకుడు లక్ష్మీ దేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షం అవుతాను.  అని చెప్పి, సెలవు తీసుకుని కైలాసం చేరుకున్నారు . 

అందుకే విష్ణు దేవాలయంలో విశ్వక్సేనుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు.. శివాలయంలో, వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు, దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే, ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం . దీనికి సంబంధించి , పుత్ర గణపతి వ్రతాన్ని ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ఆచరించాలని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి . ఈ వ్రతాన్ని గురించి మరొక పోస్ట్ లో వివరించే ప్రయత్నం చేస్తాము . శుభం !! 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba