Online Puja Services

విజయవాడ కనకదుర్గమ్మ స్వయంగా అక్కడికి

18.118.0.240

విజయవాడ కనకదుర్గమ్మ స్వయంగా అక్కడికి వచ్చి గాజులు వేయించుకుంది . 
- లక్ష్మి రమణ 

దైవాన్ని శక్తి స్వరూపంగా ఆరాధించేటప్పుడు, ఆవిడని తల్లిగా భావన చేస్తాం. నిత్యసువాసినిగా, పెద్దముత్తయిదవగా భావిస్తాం . ఆ గౌరమ్మకి  పసుపు, కుంకుమ, మాంగళ్యం , నల్లపూసలు, గాజులు, మెట్టెలు ఇలా అమ్మకి మంగళమైన ద్రవ్యాలని సమర్పిస్తాం. అయితే అమ్మవారికి మట్టి గాజులంటే ఏంటో మక్కువట . ఆ విషయాన్ని నిరూపించే సంఘటనని ఇప్పటికీ విజయవాడ వాసులు చెప్పుకుంటూ ఉంటారు . కనకదుర్గమ్మ వెలసిఉన్న ఈ ప్రాంతంలో అమ్మని ప్రత్యక్షంగా చూసినవారి అనుభవాలు వింటూంటే, ఆ తల్లి కృపకి వళ్లు జలదరించాల్సిందే !!

సనాతన సంప్రదాయం చాలా గొప్పది . దాన్ని ఒప్పుకోలేని వారి కుతంత్రాలు, దాడులు  ఈ ధర్మం మీద ఎన్నో జరిగాయి. సనాతనవలంబకుల నమ్మకం మీద దెబ్బకొట్టే ప్రయత్నం బలంగా చేశాయి . ఆలా జరిగిన ప్రతిసారీ తిరిగి తన ఉనికిని, తన ప్రభావాన్ని రెట్టింపు ప్రకాశంతో చాటుతూనే ఉంది . అలా సుల్తానులు ఈ దేశం మీద దాడులు చేసిన కాలమది . 
     
 తన ధర్మాన్ని గౌరవించినట్టే, ఇతర ధర్మాలని కూడా గౌరవంగా చూసే సంస్కారం సనాతన ధర్మం ఇచ్చింది . కానీ కొన్ని ధర్మాలలో ఆ పరమత సహనం ఉండదు . అందునా, సర్కారు వారి నిరంకుశ పాలన, దాడుల నేపధ్యం లో కనకదుర్గమ్మకి కొంత కాలం నిత్యపూజలు ఆగిపోయాయి . 

కుసంస్కారాలు , కుసంప్రదాయాలు వాటి ప్రభని యెంత బలంగా ప్రయోగిస్తాయే అంత త్వరగా వెనక్కి తగ్గాల్సిందే ! కొంత కాలానికి ఆ అరాచక పాలనకు తెర పడింది . అప్పటి వరకూ ఆ అమ్మని మనసులోనే నిలుపుకొని , ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఆవాహన చేసుకొని పూజలు చేసిన పండితులు ఒక చోట చేరారు. ధర్మానుసారణ చాలా క్లిష్టమైనది . వారికి ఒక ధర్మ సందేహం వచ్చింది . అమ్మవారి ఆలయాన్ని తిరిగి ప్రారంభం చేయాలి. కానీ కొన్ని సంవత్సరాలపాటు మూలవిరాట్టుని అర్చించలేదు . కాబట్టి విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్ట చేయాలా ? లేదా సంప్రోక్షణతో ఆలయాన్ని ప్రారంభం చేయవచ్చా అని . 

ఆ సందేహానికి సమాధానం చెప్పగలవారు అమ్మ కృపని  సంపూర్ణంగా పొందిన  శ్రీవిద్యా పూర్ణ దీక్షా దక్షులైన పెదకళ్లేపల్లి వాస్తవ్యులు  శ్రీ విద్యా  శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతిశాస్త్రి గార్లు అని తీర్మానించుకున్నారు . వారి సలహాని అభ్యర్ధించారు . 

మహామంత్రవేత్తలైన ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు, ''ఇంద్రకీలాద్రి మీద ఉన్నది విగ్రహం కాదయ్యా ! ఆమె స్వయంగా వచ్చి నిలిచిన దుర్గమ్మ . ఆ దేవి స్వయంభువు. ఆవిడని  తిరిగి పునః ప్రతిష్ట చేయాల్సిన అవసరం లేదు. మంత్ర పూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది'' అని ధర్మసందేహాన్ని తీర్చి,  వారే స్వయంగా దుర్గమ్మ  ఆలయానికి వచ్చి   సంప్రోక్షణా కార్యక్రమాలు నిర్వహించారు . 

ఈ కార్యక్రమ నిర్వాహణ , అమ్మవారి ఉపాసనా విజయవాడలోని ఆలయంనే ఉంటూ సకుటుంబంగా కొనసాగించాల్సిన అవసరం కలిగింది .  ఒకరోజు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు గాజులు వేయించుకోవడానికి ఇంటింటికీ తిరిగి గాజులమ్మే అతన్ని పిలిచారు . గాజులు వేయించుకున్నారు . గాజులు వేసాక అతను “అయ్యా మొత్తం ఐదుగురు గాజులు తొడిగించుకున్నారు డబ్బులివ్వండని” అడిగాడు . 

అయ్యో ! పొరపాటు పడ్డట్టున్నావు గాజులబ్బీ ! మా ఇంట్లో ఉన్నది నలుగురు ఆడవాళ్ళే  ! అన్నారు శాస్త్రి గారు . కాదు శాస్త్రిగారూ మీతో అబద్ధం ఆడతానా ? వారితో పాటు మరొక చిన్న పాప కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. అని చెప్పాడు . శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు . 

ఇంతలో ఇంట్లోని ఆడవాళ్లు “ లేదు మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా? మరి ఐదుగురెక్కడున్నారు'' అని గాజులమ్మే
వానిని ప్రశ్నించారు. 'లేదమ్మా !  నేను ఐదుగురికి గాజులు తొడిగాను. ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలకెళ్లి దాక్కుని ఉంటుంది! అని ఆ గాజులవాడు రెట్టించాడు.

వారి వాదన విన్న ఆ పండితులు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కణ్ణించి వచ్చింది, ఎక్కడకెళ్లింది, అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు. ఆలయంలోకి వెళ్లి చూసిన వారి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది .  ఆ గాజుల వర్తకుడు గాజులు తొడిగిన చెయ్యి సాక్షాత్తూ ఆ అమ్మవారిదే ! అతను తొడిగిన గాజులు అమ్మవారి మూలవిరాట్టు చేతులున్నాయి . వెంటనే అతనికి ఆనందంగా డబ్బులిచ్చి పంపేశారు . 

అద్భుతమైన ఈ విషయాన్ని వారు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న భక్తులూ , ఇతర పండితులూ ఇలా అందరూ చూశారు . అప్పటి నుండీ అమ్మవారికి మట్టి గాజులంటే యెంత ఇష్టమో , ప్రపంచానికి తెలిసింది . 

ఈ విషయం ఆనోటా ఆనోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టం అనీ, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.

ఈ గాజుల సంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. 

ఇలా అమ్మవారికి గాజులు సమర్పిస్తే, సువాసినులకి అఖండమైన సౌభాగ్యం, ఐదవతనం సంప్రాప్తిస్తుందని విశ్వాసం. విజయవాడ దుర్గమ్మకు కాదు, శక్తి స్వరూపిణులైన అమ్మవారి ఆరాధనలో గాజులు సమర్పించడం అనంతమైన ఫలితాలని అనుగ్రహిస్తుంది . ఆలయానికి వెళ్లినా, ఇంట్లో అమ్మవారి పూజ చేసుకునేప్పుడు యెర్రని గాజులు అమ్మకి సమర్పించండి. శుభం .  

#vijayawada #kanakadurga #durga 

Tags: vijayawada, kanakadurga, kanaka, durga, bangles

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda