Online Puja Services

పదకొండు మంది రుద్రులు ఎవరు ? ఎక్కడున్నారు ?

13.58.77.98

పదకొండు మంది రుద్రులు ఎవరు ? ఎక్కడున్నారు ?
-సేకరణ 

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది. దీని ప్రకారం ఈశ్వరుడు మనకి పదకొండు మంది రుద్రులుగా దర్శనమిస్తున్నారు .  అసలు  ఈ పదకొండు మంది రుద్రులు ఎవరు ? వారి స్వరూపాలు తెలుగు నేలపైన ఎక్కడున్నాయి  ? 

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు :

1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్రయంబకుడు , 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. 

ఈ ఏకాదశ రుద్రులు ప్రతిష్టింపబడిన స్థలములు.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం .(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):

పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివలింగరూపాన్ని పొందిందని కధ. వ్యాఘ్రము శివునిగా అవతరించడం వలన ఆయనని వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలుస్తారు . 

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):

విశ్వామిత్రుని తపస్సుని భంగపరచమని ఇంద్రుడు ‘మేనక’ అనే అప్సరసని పంపిస్తాడు . ఆమె అందచందాలకు విచలితుడైన విశ్వామిత్రుడు ఉద్రేకపూరితుడవుతాడు . దాంతో  విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మిస్తుంది.  విశ్వామిత్రుని తపస్సు ఆగిపోతుంది . ఆ  తరువాత మేనక, తన కర్తవ్యం ముగుసింది కాబట్టి  స్వర్గమునకు తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. కానీ వెళ్లలేకపోతుంది . అపుడు ఆమె శివుని శరణువేడింది.  ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి, ఆప్రదేశములో ప్రతిష్ఠించి పూజించమని చేబుతారు . 
 
అలా  మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) లో శివలింగమును ప్రతిష్ఠించి,  స్వర్గమునకు వెళ్లిందని స్థానిక ఐతిహ్యం .  మేనకచేత  ప్రతిష్ఠింప బడుటచేత ఈయనని  మేనకేశ్వరస్వామి అని పిలుస్తారు .  ఈయనే మహాదేవ రుద్రుడు . 

3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):

రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళుతున్నారు . మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారట .  అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదిలింది స్థల ఐతిహ్యం .  రామునిచేత ప్రతిష్ఠింపబడినది కాబట్టి ఈయన  రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే, ఆనందరామేశ్వరుడని పేరొందారు . ఈయనే త్యంబకేశ్వరుడు.  

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక
(శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):

తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామములో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధ . అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచేత  శివలింగము ప్రతిష్ఠ చేశారు . ఈయనే  విశ్వేశ్వరునిగా పేరొందిన త్రిపురాంతక రుద్రుడు.  

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):

మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి, శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి, అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామములో ప్రతిష్ట చేయబడిన చెన్నమల్లేశ్వరస్వామి . 

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):

రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకి వెళుతున్న సమయంలో  రామునిచేత ఈప్రదేశములో శివలింగాన్ని ప్రతిష్ఠి చేశారు .  కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించారు . రాఘవునిచే ప్రతిష్ఠింపబడడం వల్ల రాఘవేశ్వరస్వామిగా పేరొందారు . 

పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించిన , ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధ ఉంది . 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి )

దేవతలు, రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేసేందుకు శివుడు తన కంఠములో నిక్షిప్తము చేసికొని నీలకంఠుడయ్యారు. 

ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపములో ఆవిర్భవించారు . తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అవడం చేత అనంత భోగేశ్వరస్వామిగా పేరొందారు.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అని పేరొందారు . ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామములో లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలవబడ్డారు . 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి):

దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలలో  కాలిబూడిద అయినపుడు శివుడు, ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించాడు . వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేశాడు . ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచేత  ప్రతిష్ఠింపబడ్డారు . 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపించారు . విష్ణువు శివుని పాదములను కనుగొనలేక, తిరిగివచ్చి,తనకి కనిపించలేదని చెప్పారు . కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినప్పటికీ , ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూశానని చెప్పారు . శివునికి ఆగ్రహము వచ్చి, బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి, విష్ణువే అగ్రగణ్యుడని అనుగ్రహించారు . ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచేత ప్రతిష్టింపబడ్డారు . 

11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):

పూర్వకాలంలో విష్ణుమూర్తి,  శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించారు.  దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించారు .  ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామములో లింగరూపములో ఆవిర్భవించారు . పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామములోని  శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరొందారు .

సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు! సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని సంతు.!

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi